క్రికెట్లో దిగ్గజ అంపైర్ అస్తమించాడు. సౌతాఫ్రికాకు చెందిన మాజీ అంపైర్, మాజీ ఐసీసీ ఎలైట్ ప్యానెల్ అంపైర్ రూడి కోర్జెన్ (73) మంగళవారం మధ్యాహ్నం ప్రమాదకర యాక్సిడెంట్లో అసువులు బాశాడు. రివర్డేల్లోని గోల్ఫ్ కోర్స్ నుంచి అతను ఇంటికి బయలుదేరగా విధి వక్రీకరించింది. మార్గమధ్యలోనే ఆయన ఘోర కారు యాక్సిడెంట్కు గురయ్యారు. ఈ ప్రమాదంలో కోర్జెన్ స్పాట్లోనే చనిపోయారు. ఆయనే కాకుండా.. అతని సన్నిహితులు మరో ఇద్దరు కూడా స్పాట్లో మరణించారు.
1981లో రూడి కోర్జెన్ తన అంపైరింగ్ కెరీర్ను మొదలెట్టారు. అనతి కాలంలోనే పేరెన్నికదగ్గ అంపైర్గా మారాడు. ఐసీసీ 1992లో కోర్జెన్ను ఫుల్ టైం అంపైర్గా నియమించగా అప్పటి నుంచి అంతర్జాతీయ క్రికెట్లో అంపైరింగ్లో రాణించాడు. 1992లో తొలిసారిగా సౌతాఫ్రికా - భారత్ మధ్య జరిగిన ఇంటర్నేషనల్ మ్యాచ్కు అంపైర్గా వ్యవహరించాడు. ఆ మ్యాచ్లో ఓ ప్రత్యేకత కూడా ఉంది. ఆ మ్యాచ్లో రనౌట్ విషయంలో రీప్లేను తొలిసారిగా ప్రవేశపెట్టారు.
అప్పటి నుంచి రనౌట్లో టెలివిజన్ రిప్లేలు మొదలయ్యాయి. దాదాపు 108 టెస్టులు, 209 వన్డేలు, 14 టీ20లకు అతను అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తించాడు. 2003, 2007 వరల్డ్కప్ టోర్నీల్లో కోర్జెన్ థర్డ్ అంపైర్గా కూడా వ్యవహరించాడు. ఇక రుడీ కోర్జెన్ మృతి పట్ల ఐసీసీ అధికారులతో సహా క్రికెట్ దిగ్గజాలు నివాళులు ప్రకటించారు. దక్షిణాఫ్రికా బోర్డు అధికారులు, క్రికెటర్లు ఆయన మృతికి సంతాపం తెలిపారు.