
హైదరాబాద్: సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న చివరిదైన మూడో టెస్టులో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సోమవారం నాలుగో రోజు ఆటలో భాగంగా డేవిడ్ వార్నర్ పరుగు తీసే క్రమంలో డేంజర్ జోన్లో పరుగు తీశాడు. దీంతో ఫీల్డ్ అంపైర్ అలీమ్ దార్ ఆస్ట్రేలియాకు ఐదు పరుగుల పెనాల్టీ విధించాడు.
దీంతో అంపైర్ను డేవిడ్ వార్నర్ ప్రశ్నించాడు. అలీమ్ దార్ కాస్త ఘాటుగానే తిరస్కరించడంతో వార్నర్ మరొ అంపైర్ ఎరాస్మస్ వద్దకు వెళ్లి తాను ఏం తప్పు చేశానో చెప్పాలంటూ అతడితో వాగ్వాదానికి దిగాడు. తాను షాట్ ఆడి జంప్ చేశానని, ఏం చేయాలో అంపైర్లు చెప్పాలి కదా? అంటూ వాగ్వాదం చేశాడు.
అంపైర్లు సైతం వెనక్కి తగ్గకపోవడంతో ఆస్ట్రేలియాకు ఐదు పరుగుల పెనాల్టీని విధించారు. ఫలితంగా ఆస్ట్రేలియా చేసిన స్కోరులో ఐదు పరుగులు తగ్గించారు. ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో డేవిడ్ వార్నర్ (111 నాటౌట్) సెంచరీ సాధించగా, లబుషేన్(59) హాఫ్ సెంచరీ సాధించడంతో రెండో ఇన్నింగ్స్ను 217/2 వద్ద డిక్లేర్డ్ చేసింది.
ఫలితంగా ఆస్ట్రేలియాకు 420 పరుగుల ఆధిక్యం లభించింది. అయితే, ఫీల్డ్ అంఫైర్ పెనాల్టీ కారణంగా వారి ఆధిక్యం 415 పరుగులకు కుదించబడింది. అనంతరం 416 పరుగుల విజయ లక్ష్యంతో న్యూజిలాండ్ బ్యాటింగ్కు దిగింది. ఆసీస్ పేసర్లు మెరవడంతో కివీస్ వంద పరుగులు దాటకుండానే ఐదు వికెట్లు కోల్పోయింది.