బ్యాటింగే భారత్ బలం
ఇటీవలి కాలంలో భారత బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేసినా.. బ్యాటింగే వారి బలమని మెక్గ్రాత్ స్పష్టం చేశాడు. "బుమ్రా, భువనేశ్వర్ గాయాలబారిన పడటం ఆందోళన కగిలిస్తుంది. ఈ భారాన్ని మిగతా బౌలింగ్ లైనప్ ఎలా అధిగమిస్తుందో చూడాలి. టీమిండియా స్పిన్నర్లు కూడా ఈ మధ్యకాలంలో చాలా బాగా ఆడుతున్నారు. ఇంగ్లండ్లో వాళ్ల పాత్రను తీసిపారేయలేం" అని మెక్గ్రాత్ అన్నాడు.
ఫాస్ట్ బౌలర్లు అత్యంత కీలకం
అయినా సరే, ఈ సిరిస్లో ఫాస్ట్ బౌలర్లు అత్యంత కీలకంగా మారనున్నారని మెక్ గ్రాత్ తెలిపాడు. "ఇంగ్లాండ్లో బౌలింగ్ చేయడాన్ని వార్న్ బాగా ఆస్వాదించేవాడు. పేస్ లేకపోతే బంతి కచ్చితంగా టర్న్ అవుతుందని వార్న్ చాలాసార్లు చెప్పేవాడు. అయినా కూడా అతను ఇక్కడ చాలా బాగా విజయవంతమయ్యాడు. కాబట్టి భారత స్పిన్నర్లు కూడా సత్తా చాటితే సిరీస్ గెలువొచ్చు" అని మెక్గ్రాత్ వెల్లడించాడు.
జట్టులో ఇద్దరు స్పిన్నర్లు ఉండాలి
"ఈ సిరీస్లో భారత్ పైచేయి సాధించాలంటే తుది జట్టులో కచ్చితంగా ఇద్దరు స్పిన్నర్లు ఉండాలి. ఈ నేపథ్యంలో పేసర్లలో ఎవరికి అవకాశం ఇస్తారో చూడాలి. ఉమేశ్తో కలిసి కొత్త బంతిని ఇషాంత్, షమీలలో ఎవరు పంచుకుంటారో చూడాలి. భువీ, బుమ్రా లేకపోవడం పెద్ద లోటుగా తయారైంది. ఇషాంత్కు అనుభవం ఎక్కువగా ఉన్నా.. ఆరంభంలో వికెట్లు తీసే సామర్థ్యం చాలా తక్కువ" అని మెక్గ్రాత్ వ్యాఖ్యానించాడు.
ఉమేశ్ బౌలింగ్లో వేగం బాగుంది
"ఉమేశ్ బౌలింగ్లో వేగం బాగుంది. కాబట్టి సిరీస్ మొత్తం అతను ఆడాల్సిందే. పరిస్థితులను బట్టి షమీ, శార్దూల్ను ఉపయోగించుకుంటే బాగుంటుంది. సిరీస్లో మొదటి టెస్టు గెలువడం చాలా ప్రధానం. ఇంగ్లిష్ పరిస్థితుల్లో డ్యూక్ బంతులతో వికెట్లు తీయడం అంటే మామూలు విషయం కాదు. స్పిన్నర్లపై భారం మోపినా.. సీమర్లే ఇంగ్లండ్లో అత్యంత ప్రధానమైన బౌలర్లు. వాళ్లే వికెట్లు తీయాలి" అని మెక్గ్రాత్ అన్నాడు.
ఇంగ్లిష్ పిచ్లపై కోహ్లీ సత్తా చాటాలి
"కోహ్లీ సహజ నైపుణ్యం ఉన్న ఆటగాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అన్ని రకాల షాట్లు కొట్టగల సమర్థుడు. దూకుడుగా కూడా ఆడతాడు. కాబట్టి ఇంగ్లిష్ పిచ్లపై సత్తా చాటాల్సిన సమయం వచ్చేసింది. బంతి రెండువైపులా స్వింగ్ అవుతుంది కాబట్టి పరిస్థితులకు తొందరగా ఆకళింపు చేసుకుంటే సులువుగా పరుగులు చేయొచ్చు" అని మెక్గ్రాత్ అన్నాడు.