శ్రీలంక సీనియర్ క్రికెటర్ ఏంజెలో మాథ్యుస్ 18 నెలల తర్వాత బౌలింగ్ చేసాడు. అంతేకాదు తొలి బంతికే వికెట్ తీసి లంకకు విజయాన్ని అందించాడు. 2017లో మాథ్యుస్ చివరి సారిగా వన్డేలలో బౌలింగ్ చేసాడు. సరిగ్గా 18 నెలల తర్వాత క్లిష్ట సమయంలో బంతిని అందుకొని శ్రీలంక విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
339 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ ఇన్నింగ్స్ తడబడుతూ సాగింది. ఓపెనర్ అంబ్రిస్ (5), షైహోప్ (5), గేల్ (48 బంతుల్లో 35; 1 ఫోర్, 2 సిక్సర్లు), హెట్మైర్ (38 బంతుల్లో 29; 2 ఫోర్లు) పెవిలియన్ చేరడంతో.. 84 పరుగులకే 4 కీలక వికెట్లను కోల్పోయింది. ఈ సమయంలో వికెట్ కీపర్ నికోలస్ పూరన్ (103 బంతుల్లో 118; 11 ఫోర్లు, 4 సిక్స్లు) అద్భుత శతకంతో గెలుపు దిశగా తీసుకెళ్లాడు. అతనికి అలెన్ (32 బంతుల్లో 51; 7 ఫోర్లు, 1 సిక్స్) చక్కటి సహకారం అందించాడు.
విండీస్ విజయానికి చివరి మూడు ఓవర్లలో 30 పరుగులు కావాల్సి ఉండగా.. క్రీజులో పూరన్తో షెల్డాన్ కాట్రెల్లు ఉన్నారు. పూరన్ ఊపు చూస్తే విండీస్ విజయం ఖాయమని భావించారు. ఈ దశలో చాలా కాలం తర్వాత బంతిని అందుకున్న మాథ్యుస్.. తొలి బంతికే పూరన్ను ఔట్ చేసాడు. ఆఫ్స్టంప్ దిశగా వేసిన బంతిని పూరన్ కవర్స్ దిశగా షాట్ ఆడగా.. బంతి బ్యాట్కు ఎడ్జ్ తీసుకుని కీపర్ కుసాల్ పెరెరా చేతిలో పడింది. ఇక శ్రీలంక ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. చివరకు శ్రీలంక 23 పరుగులతో విజయం సాధించింది.
మ్యాచ్ అనంతరం మాథ్యూస్ మాట్లాడుతూ... 'గత కొన్ని నెలలుగా నేను బౌలింగ్ చేయలేదు. చాలా కాలం తర్వాత వేసిన తొలి బంతి. వికెట్ తీసినందుకు సంతోషంగా ఉంది. మేం గెలవాలంటే రెండు ఓవర్లు జాగ్రత్తగా వేయాలి. ఊపుమీదున్న పూరన్ ఉండడంతో స్పిన్నర్లతో వేయించలేం. ఇలాంటి క్లిష్ట సమయంలో నేను మా కెప్టెన్ దగ్గరకు వెళ్లి.. నాకు ఇలాంటి పరిస్థితుల్లో బౌలింగ్ చేసిన అనుభవం ఉంది. రెండు ఓవర్లు బౌలింగ్ చేస్తానని చెప్పాను' అని మాథ్యూస్ తెలిపాడు.