ప్రుడెన్షియల్ వరల్డ్కప్ 1975
ప్రుడెన్షియల్ వరల్డ్కప్ పేరిట జరిగిన ఈ టోర్నీలో టీమిండియా ఆడిన మూడు మ్యాచ్ల్లో రెండు మ్యాచ్ల్లో పరాజయం పాలైంది. ఈస్ట్ ఆఫ్రికా(కెన్యూ, టాంజనియా, యుగాండా, జింబాబ్వే దేశాలకు చెందిన ఆటగాళ్లు ఒక జట్టుగా)తో జరిగిన మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. భారత జట్టుకు ఇదే తొలి వన్డే విజయం. ఈ టోర్నమెంట్లో సునీల్ గవాస్కర్ 174 బంతులాడి 36 పరుగులతో నాటౌట్గా నిలవడం అప్పట్లో తీవ్ర విమర్శలకు తావిచ్చింది.
ప్రుడెన్షియల్ వరల్డ్కప్ 1979
ప్రుడెన్షియల్ వరల్డ్కప్ పేరిట జరిగిన ఈ టోర్నీలో టీమిండియా ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ పరాజయం పాలైంది. దీంతో లీగ్ స్టేజి నుంచే టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ప్రుడెన్షియల్ వరల్డ్కప్ 1983
ఈ వరల్డ్కప్లో కపిల్ దేవ్ నాయకత్వంలోని టీమిండియా ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగింది. అంతకముందు జరిగిన రెండు వరల్డ్కప్ల్లో టీమిండియా ఈస్ట్ ఆఫ్రికాపై విజయం, శ్రీలంక చేతిలో ఓడటంతో టీమిండియాకు ఇంకా టెస్టు హోదా లభించలేదు. అయితే, ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన టీమిండియా అనూహ్యంగా ఫైనల్కు చేరుకుంది. లార్డ్స్ వేదికగా జరిగిన ఫైనల్లో దిగ్గజ క్రికెటర్లు ఉన్న వెస్టిండిస్ జట్టుని ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. అప్పట్లో ఇదొక పెద్ద సంచలనం. వన్డే క్రికెట్లోకి అరంగేట్రం చేసిన తొమ్మిదేళ్లకు భారత్ కేవలం 17 విజయాలను నమోదు చేసింది. అయినా దిగ్గజ జట్లను ఓడించి వరల్డ్కప్ ఫైనల్కు చేరడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
రిలయన్స్ వరల్డ్ కప్ 1987
డిఫెండింగ్ ఛాంపియన్స్గా బరిలోకి దిగిన ఈ టోర్నీలో టీమిండియా ఆడిన ఏడు మ్యాచ్ల్లో ఐదింట విజయం సాధించింది. ఈ టోర్నీలో హైలెట్ ఏంటంటే న్యూజిలాండ్ జట్టుపై భారత్ విజయం సాధించడం... వన్డేల్లో సునీల్ గవాస్కర్ సాధించిన ఏకైక సెంచరీ ఈ మ్యాచ్లోనే నమోదైంది. అంతేకాదు ఈ మ్యాచ్లోనే వరల్డ్కప్ తొలి హ్యాట్రిక్ నమోదైంది. ఈ హ్యాట్రిక్ను సాధించింది చేతన్ శర్మ.
బెన్సన్ & హెగ్డేజ్ వరల్డ్కప్ 1992
ఈ వరల్డ్కప్లో టీమిండియా పేలవ ప్రదర్శన చేసింది. అజహరుద్దీన్ నాయకత్వంలోని టీమిండియా ఆడిన ఎనిమిది మ్యాచ్ల్లో కేవలం రెండింట మాత్రమే విజయం సాధించింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా విజయం సాధించడం టోర్నీకే హైలెట్గా నిలిచింది.
విల్స్ వరల్డ్కప్ 1996
ఈ వరల్డ్కప్కు భారత్ ఆతిథ్యమిచ్చింది. అజహరుద్దీన్ నాయకత్వంలోని టీమిండియా లీగ్ స్టేజిలో ఆస్ట్రేలియా, శ్రీలంక చేతిలో ఓడింది. అయితే, పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో విజయం సాధించింది. శ్రీలంకతో జరిగిన సెమీఫైనల్లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఐసీసీ వరల్డ్కప్ 1999
ఈ వరల్డ్కప్ను టీమిండియా ఓటమితో ప్రారంభించింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే చేతిలో ఓటమి అనంతరం కెన్యాతో జరిగిన మ్యాచ్లో సచిన్ టెండూల్కర్ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్కి ముందు సచిన్ తండ్రి మరణించారు. ఆ తర్వాత టౌన్టౌన్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో సౌరవ్ గంగూలీ-రాహుల్ ద్రవిడ్ రికార్డులు నెలకొల్పారు. అయితే, ఆ తర్వాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలవడంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఐసీసీ వరల్డ్ కప్ 2003
సౌరవ్ గంగూలీ నాయకత్వంలోని టీమిండియా ఫైనల్ వరకు చేరుకుంది. అయితే, పైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నరప్గా నిలిచింది. పాకిస్థాన్పై విజయం సాధించిన వరల్డ్కప్లో తన రికార్డుని మరింతగా మెరుగుపరుచుకుంది. ఈ టోర్నీలో 11 మ్యాచ్లాడి 673 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్కు మ్యాన్ ఆఫ్ ద సిరిస్ అవార్డు లభించింది. వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ నెలకొల్పిన ఈ రికార్డు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.
ఐసీసీ వరల్డ్ కప్ 2007
భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన ఈ మెగా టోర్నీలో టీమిండియా తన తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్తో తలపడింది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో బంగ్లా చేతిలో టీమిండియా ఓడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వరల్డ్కప్ బరిలో నిలవాలంటే ఆ తర్వాత తప్పక గెలవాల్సిన రెండు మ్యాచ్ల్లోనూ టీమిండియా ఓడటంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఐసీసీ వరల్డ్ కప్ 2011
మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలోని టీమిండియా ఈ టోర్నీలో రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. శ్రీలంకతో జరిగిన ఫైనల్లో విజయం సాధించి తన 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. వాంఖడే వేదికగా జరిగిన ఫైనల్లో ధోని సిక్స్ బాది భారత్కు విజయాన్ని అందించిన సన్నివేశం ఇప్పటికీ ప్రతి క్రికెట్ అభిమాని మదిలో మెదులుతుంటూనే ఉంటుంది.
ఐసీసీ వరల్డ్ కప్ 2015
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ఈ వరల్డ్కప్లో ధోని సేన సెమీ ఫైనల్లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ టోర్నీలో టీమిండియా ఏడు విజయాలను నమోదు చేసి నాకౌట్కు చేరుకుంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగిన సెమీఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది.