
హైదరాబాద్: టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్మన్, భారత టెస్టు జట్టుకు పిల్లర్ అయిన ఛటేశ్వర్ పుజారా శుక్రవారం 31వ పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా పుజారాకు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
2010లో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియా జట్టుపై అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన పుజారా ఇప్పటివరకు వరకు భారత్ తరుపున 68 టెస్టులాడి 51.18 యావరేజితో 5426 పరుగులు సాధించాడు. ఇందులో 18 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన నాలుగు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ను టీమిండియా 2-1తో కైవసం చేసుకోవడంలో పుజారా కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్లో మొత్తం మూడు సెంచరీలతో ఆకట్టుకున్న పుజారా 521 పరుగులు చేసి 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' అవార్డును కూడా గెలుచుకున్నాడు.