

హైదరాబాద్: ఓవల్ వేదికగా భారత్తో జరుగుతున్న ఐదో టెస్టులో నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్కు జరిమానా విధించారు. ఐసీసీ క్రీడా నియమావళిలో లెవెల్-1 తప్పిదానికి పాల్పడిన ఆండర్సన్కు మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధిస్తున్నట్లు ఐసీసీ పేర్కొంది.
దీంతో పాటు క్రమశిక్షణా చర్యల కింద ఒక డీమెరిట్ పాయింట్ను కూడా ఆండర్సన్ ఖాతాలో జత చేశారు. ఈ మేరకు ఐసీసీ తన అధికారిక ట్విట్టర్లో పేర్కొంది. ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య శుక్రవారం ఓవల్ వేదికగా చివరి టెస్టు ప్రారంభమైన సంగతి తెలిసిందే.
రెండోరోజైన శనివారం ఆటలో భాగంగా అంపైర్ నిర్ణయంపై ఆండర్సన్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
అసలేం జరిగింది?
అండర్సన్ వేసిన ఇన్నింగ్స్ 29వ ఓవర్లో బంతి విరాట్ కోహ్లీ ప్యాడ్లను తాకింది. దీంతో అండర్సన్ వెంటనే అప్పీల్ చేసినా అంపైర్ ధర్మసేన అతని అప్పీల్ను తిరస్కరించాడు. కానీ, బంతి వికెట్లను తాకుతుందని భావించిన ఆండర్సన్ రివ్యూ కోరాడు. రివ్యూలో బంతి వికెట్లకు తాకే అవకాశం ఉన్నట్లు కనిపించినా.. థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని ఫీల్డ్ అంపైర్కు వదిలేశాడు.
దీంతో ధర్మసేన తన నిర్ణయానికే కట్టుబడి ఉండడంతో కోహ్లీ నాటౌట్గా నిలిచాడు. దీంతో అంఫైర్ ధర్మసేన దగ్గరకు వెళ్లి కోపంగా మాట్లాడిన జేమ్స్ అండర్సన్.. ఆ తర్వాత విరాట్ కోహ్లీ వద్దకు వెళ్లి కోపంతో ఊగిపోయాడు. ఈ సమయంలో అంఫైర్ ధర్మసేన కలగజేసుకుని ఇద్దరు ఆటగాళ్లకు సర్ది చెప్పడంతో వివాదం ముగిసింది.