న్యూ ఢిల్లీ: ఓ పక్క పండుగ కోలాహలం.. మరో వైపు రావణ దహనం ఆ మైదానమంతా ఉల్లాసంగా గడిచిపోతోంది. ఈ లోపే అనుకోని ప్రమాదం జరిగింది. అటుగా వెళ్తున్న రైలు ఆదమరిచి ఉన్న వీక్షకులను కొట్టిపడేసింది. ప్రమాదం పసిగట్టలేని అమాయకులు క్షణాల్లోనే ప్రాణాలొదిలేశారు. ఈ ఘటన పంజాబ్లోని అమృత్సర్లో చోటు చేసుకుంది. ఇంతటి దారుణానికి తక్షణ సాయం అందించకపోగా రాజకీయ రంగు పులుముతున్నారు పలువురు పెద్ద మనుషులు.
దీనిపై స్పందించిన భారత వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ రైలు ప్రమాద ఘటనపై రాజకీయ పార్టీలు విమర్శలు చాలించి సాయం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం రావణ దహనకాండని వీక్షిస్తున్న జనంపైకి జలంధర్- అమృత్సర్ రైలు దూసుకెళ్లగా.. ఈ ఘటనలో ఇప్పటికే 61 మంది మృతి చెందారు.
#WATCH Eyewitness at #Amritsar accident site says, "Congress had organised Dussehra celebrations here without permission. Navjot Singh Sidhu's wife was the chief guest at the celebrations and she continued to give a speech as people were struck down by the train." pic.twitter.com/rcsxbVxiB9
— ANI (@ANI) October 19, 2018
అయితే.. ఈ ప్రమాదానికి కారణం కాంగ్రెస్ అంటూ బీజేపీ విమర్శిస్తోంది. రావణ దహనకాండ వేడుకకి ముఖ్య అతిథిగా పంజాబ్ రాష్ట్ర మంత్రి నవజ్యోత్ సిద్ధూ సతీమణి నవజ్యోత్ కౌర్ సిద్ధూ వెళ్లారు. అయితే.. ఘటన జరిగిన కొద్దిసేపటికే ఆమె అక్కడ నుంచి వెళ్లిపోయారని.. బీజేపీ ఆరోపిస్తోంది. మరోవైపు ప్రమాదం జరిగిన సమయంలో ఆమె అక్కడే వేదికపై మాట్లాడుతున్నారని మరికొందరు చెప్తున్నారు.
ప్రమాద ఘటనపై రాజకీయ పార్టీలు విమర్శలు చేసుకుంటుండటంతో హర్భజన్ సింగ్ స్పందించాడు. 'రాజకీయ పార్టీలు, ప్రజలు దయచేసి ఈ ఘటనపై నిందలు వేయడం ఆపండి. ఇది రాజకీయ అంశం కాదు.. ఇదో బాధాకరమైన ఘటన. అందరూ సహకరించుకుంటూ బాధితులకి సాయం చేయండి'అని హర్భజన్ సింగ్ సూచించాడు.