
హైదరాబాద్: భారత వెటరన్ క్రికెటర్ అంబటి రాయుడు తండ్రయ్యాడు. అతని భార్య చెన్నుపల్లి విద్య ఆదివారం పండంటి ఆడ బిడ్డకి జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ తమ అధికారిక ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. 'ఇప్పుడు డాడీస్ఆర్మీ నుండి ఆఫ్-ఫీల్డ్ పాఠాలు అన్నీ ఉపయోగించబడతాయి' అని చెన్నై తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 2018 నుంచి అంబటి రాయుడు చెన్నై తరఫున మ్యాచ్లు ఆడుతున్న విషయం తెలిసిందే.
తండ్రయిన సందర్భంగా సోషల్ మీడియాలో రాయుడికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాయుడిని సహచర ఆటగాడు సురేష్ రైనా అభినందించాడు. 'కూతురు పుట్టినందుకు రాయుడు-విద్యలకు హృదయపూర్వక అభినందనలు. ప్రతిక్షణం చిన్నదానితో ఎంతో ప్రేమగా ఉండండి. మీకు ఎంతో ప్రేమ మరియు ఆనందం కలగాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా' అని ట్వీట్ చేశాడు. చెన్నుపల్లి విద్యాని 2009లో రాయుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
2019 వన్డే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కకపోవడంతో నిరాశ చెందిన అంబటి రాయుడు.. గత ఏడాది రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే రాయుడు నిర్ణయంపై చాలామంది మాజీలు పెదవివిరిచారు. అనంతరం ఆ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఆ తర్వాత హైదరాబాద్ తరఫున దేశవాళీ క్రికెట్లో ఆడిన రాయుడు.. ఐపీఎల్ 2020 సీజన్లో రాణించి మళ్లీ టీమిండియాలోకి పునరాగమనం చేయాలని ఆశించాడు. కానీ కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ నిరవధికంగా వాయిదా పడింది. ఎప్పుడు జరుగుతుందో తెలియదు. ఈ ఏడాది లీగ్ సెప్టెంబర్-అక్టోబర్లో జరుగుతుందని సమాచారం.
2013లో భారత జట్టులోకి అరంగేట్రం చేసిన అంబటి రాయుడు ఇప్పటి వరకు 55 వన్డేలు, 6 టీ20 మ్యాచ్లు ఆడాడు. వన్డేల్లో 1694 పరుగులు.. టీ20ల్లో 42 రన్స్ చేశాడు. మూడు సెంచరీలు బాదాడు. అయితే 147 ఐపీఎల్ మ్యాచ్లలో 3300 పరుగులు చేశాడు. పొట్టి .ఫార్మాట్లో కూడా ఓ సెంచరీ బాదాడు. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు. నిలకడలేమి కారణంగా 2018 వరకూ రాయుడికి రెగ్యులర్గా అవకాశాలు దక్కలేదు. అయితే 2018 ఐపీఎల్ సీజన్లో పరుగుల వరద పారించిన రాయుడు.. భారత్ జట్టులో వరుసగా అవకాశాల్ని దక్కించుకున్నాడు. నెం.4 స్థానానికి పరిష్కారం దొరికిందనుకున్న సమయంలో ఫామ్ కోల్పోయి మళ్లీ జట్టుకు దూరమయ్యాడు.
2019 వన్డే ప్రపంచకప్కి తనని ఎంపిక చేయకపోవడంపై అప్పట్లో భారత సెలక్టర్లపై 3D సెటైర్లు వేసిన రాయుడు.. రిటైర్మెంట్ని వెనక్కి తీసుకుని హైదరాబాద్ తరఫున రంజీల్లో ఆడాడు. కానీ అక్కడా రాజకీయాలు ఉన్నాయని హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ (హెచ్సీఏ)పై తెలంగాణ మంత్రి కేటీఆర్కి రాయుడు ఫిర్యాదు చేశాడు. మొత్తంగా వివాదాల నడుమ గత ఏడాది నుంచి క్రికెట్ కెరీర్ని కొనసాగిస్తున్నాడు.
మా ఆటగాళ్లు హోటల్లో కూర్చోలేరు.. క్వారంటైన్ సమయం కుదించాలి: గంగూలీ
https://telugu.mykhel.com/cricket/bcci-chief-sourav-ganguly-hoping-for-shorter-quarantine-period-for-team-india-during-australia-tour/articlecontent-pf47695-029127.html