వారు క్రికెట్ను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లగలరు:
న్యూజిలాండ్ పర్యటన సందర్భంగా పిటిఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అజింక్య రహానే మాట్లాడుతూ... 'ప్రస్తుతం టీమిండియాకు ద్రవిడ్, గంగూలీ, రవిశాస్త్రి లాంటి దిగ్గజాలు పనిచేస్తున్నారు. దాదా, రాహుల్ భాయ్ కలిసి భారత క్రికెట్ను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లగలరని నా నమ్మకం. ఈ కలయిక మంచి రోడ్మ్యాప్ను ఇస్తుంది. విరాట్ కోహ్లీ, రవి భాయ్ డ్రెస్సింగ్ రూమ్లో మంచి వాతావరణం పెంచారు. ఆటగాళ్లందరం ప్రేమతో ముందుకు సాగుతున్నాం' అని తెలిపాడు.
చల్లని గాలులే కీలకం:
'2014లో న్యూజిలాండ్లో పర్యటించాం. ఆ సమయంలో చల్లగాలి సమస్య ఎదుర్కొన్నాం. పరిస్థితులకు అలవాటు పడటమే కీలకం. చల్లదనంతో బంతులు రెండు వైపులా స్వింగ్ అవుతూ ఉంటాయి. క్రీజులో కుదురుకోవడానికి సహనం పాటించాలి. చివరి పర్యటనలో వెల్లింగ్టన్లో ఆడాను. కానీ క్రైస్ట్చర్చ్లో ఆడలేదు. చాన్నాళ్ల తర్వాత అక్కడ ఆడబోతున్నాం. ఆ పర్యటన కోసం సిద్దమవుతున్నా' అని జింక్స్ అన్నాడు.
వాగ్నర్ బౌలింగ్ అద్భుతం:
'కివీస్ బౌలర్ నీల్ వాగ్నర్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అతనొక్కడే కాదు ఒక బ్యాటింగ్ విభాగంగా మేం బౌలర్లు అందరినీ గౌరవించాలి. సొంతగడ్డపై ఆడుతుండటం వారికి కలిసొచ్చే అంశం. అయితే మేం మా సహజశైలిలో ఆడాల్సి ఉంటుంది. వేర్వేరు బౌలర్లను వేర్వేరుగా ఎదుర్కోవాలి. కొందరు క్రీజు బయట నిలబడేందుకు ఇష్టపడతారు. కొందరు క్రీజు లోపలే ఉంటారు. కొందరు మిడిల్ స్టంప్ గార్డ్, లెగ్ గార్డ్ తీసుకుంటారు. ఎలా ఉన్నా సరే పరిస్థితులకు తగ్గట్టు ఆడాలి' అని రహానే చెప్పుకొచ్చాడు.
63 టెస్టుల్లో 4,112 పరుగులు:
'విదేశీ పర్యటనలకు ముందు భారత్-ఏతో షాడో సిరీసులు ఉండటం ప్రయోజనకరం. వాతావరణానికి అలవాటు పడేందుకు, సిరీస్కు సన్నద్ధమయ్యేందుకు ఉపయోగకరం.' అని రహానే పేర్కొన్నాడు. 31 ఏళ్ల రహానే 63 టెస్ట్ మ్యాచ్లలో 4,112 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 188. 11 సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు సాధించాడు.