నవంబర్ 22 నుంచి 26 వరకు
నవంబర్ 22 నుంచి 26 వరకు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగే తొలి డే నైట్ టెస్టుకు క్యాబ్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ డే నైట్ టెస్టుని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న క్యాబ్ అంగరంగవైభవంగా నిర్వహించాలని భావిస్తోంది. ఇప్పటికే కోల్కతాలోని వీధులన్నీ గులాబీ మయం అయ్యాయి.
|
డే నైట్ టెస్టు కోసం ఈడెన్ గార్డెన్స్ ముస్తాబు
డే నైట్ టెస్టు కోసం ఈడెన్ గార్డెన్స్ను క్యాబ్ ఏ విధంగా ముస్తాబు చేసిందో 17 సెకన్ల నిడివి ఉన్న ఓ వీడియో క్లిప్ బీసీసీఐ తన ట్విట్టర్లో అభిమానులతో పంచుకుంటూ "పింక్ బాల్ టెస్టు కోసం కోల్కతా సిద్దమైంది" అనే కామెంట్ పోస్టు చేసింది. వీడియోలో ఈడెన్ గార్డెన్స్ గులాబీ రంగుతో అందంగా ముస్తాబైంది.
2015లో తొలి తొలి డే నైట్ టెస్టు
ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య 2015లో తొలి తొలి డే నైట్ టెస్టు అడిలైడ్ వేదికగా జరిగింది. దీంతో అడిలైడ్లో మొదలైన పింక్ బాల్ కథ ఇప్పుడు కోల్కతాకి చేరింది. పింక్ బాల్ టెస్టుకు ఆతిథ్యమిస్తోన్న 8వ నగరంగా కోల్కతా నిలిచింది. సుదీర్ఘ ఫార్మాట్లో ఇప్పటివరకు 11 డే నైట్ టెస్టులు జరగగా ఆస్ట్రేలియా అత్యధికంగా ఐదు డే నైట్ టెస్టులు ఆడింది.
11 డే నైట్ టెస్టు మ్యాచ్లకు ఆతిథ్యమిచ్చిన వేదికలివే
తర్వాతి స్థానాల్లో శ్రీలంక(3), వెస్టిండీస్(3), ఇంగ్లండ్ (3), పాకిస్థాన్(2), దక్షిణాఫ్రికా( 2), జింబాబ్వే(1)లు ఉన్నాయి. ఇప్పటివరకు ముగిసిన 11 డే నైట్ టెస్టు మ్యాచ్లకు ఆతిథ్యమిచ్చిన వేదికలను ఒక్కసారి పరిశీలిస్తే అడిలైడ్, దుబాయ్, అడిలైడ్, బ్రిస్బేన్, బర్మింగ్హామ్, దుబాయి, అడిలైడ్, పోర్ట్ ఎలిజెబెత్(సెంట్ జార్జ్ పార్క్), ఆక్లాండ్, బ్రిడ్జ్టౌన్, బ్రిస్బేన్.
12వ డే నైట్ టెస్టుకు కోల్కతా నగరం ఆతిథ్యం
శుక్రవారం నుంచి ఆరంభమయ్యే 12వ డే నైట్ టెస్టుకు కోల్కతా నగరం ఆతిథ్యమిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. డే నైట్ టెస్టులో ఇరు జట్ల కెప్టెన్లకు ఆర్మీ పారాట్రూపర్లు చేతుల మీదగా పింక్ బాల్ను అందజేయనున్నారు. ఈ విషయమై ఆర్మీ(ఈస్టర్న్ కమాండ్)తో చర్చించామని క్యాబ్ కార్యదర్శి అవిశేక్ దాల్మియా వెల్లడించారు.
పారాట్రూపర్లు చేతుల మీదుగా పింక్ బాల్
మ్యాచ్ జరగడానికి ముందు భారత ఆర్మీ ఇరు దేశాలకు చెందిన జాతీయ గీతాన్ని తమ బ్యాండ్స్తో ఆలపించనుంది. ఈ పింక్ బాల్ టెస్ట్కు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మ్యాచ్కు ముఖ్య అతిథులుగా రానున్నారు. వీరిద్దరూ ఈడెన్ గార్డెన్స్లోని గంట మోగించనున్నారు.
క్రీడా దిగ్గజాలకు ఘన సత్కారం
అనంతరం మ్యాచ్కు హాజరుకానున్న భారత క్రీడా దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, ఒలింపియన్ అభినవ్ బింద్రా, టెన్నిస్ స్టార్ సానియా మిర్జా, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, ఆరు సార్లు మహిళల బాక్సింగ్ చాంపియన్ మేరీకోమ్లను ఘనంగా సత్కరించనున్నట్లు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) సెక్రటరీ అవిషేక్ దాల్మియా తెలిపారు.
మధ్యాహ్నం 1 గంట మ్యాచ్ ప్రారంభం
మ్యాచ్ను మధ్యాహ్నం 1 గంటకి ప్రారంభమవుతుంది. తొలి సెషన్ మధ్యాహ్నం మూడు గంటలకు ముగుస్తుంది. లంచ్ విరామం నలభై నిమిషాలు, అనంతరం 3:40 గంటలకు ప్రారంభమయ్యే రెండో సెషన్ 5:40వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత 20 నిమిషాలు టీ విరామం ఉంటుంది. ఆఖరి సెషన్ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరుగుతుంది.
లంచ్ విరామంలో 'ఫ్యాబులెస్ ఫైవ్'తో ఓ టాక్ షో
లంచ్ విరామ సమయంలో 'ఫ్యాబులెస్ ఫైవ్'తో ఓ టాక్ షో కూడా ప్లాన్ చేశారు. సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్లను అభిమానులు ముద్దుగా 'ఫ్యాబులెస్ ఫైవ్' అని పిలుచుకునే సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా 'ఫ్యాబులెస్ ఫైవ్' క్రికెటర్లు 2001లో ఇదే మైదానంలో ఆస్ట్రేలియాపై సాధించిన చారిత్రక విజయంపై మాట్లాడనున్నారు.