న్యూఢిల్లీ: థాయ్లాండ్లో జరిగే వరుస టోర్నీల్లో పాల్గొనేందుకు ఒలింపిక్స్ ఆశావహులు సైనా నెహ్వాల్, సాయి ప్రణీత్, కిడాంబి శ్రీకాంత్ ఆదివారం బ్యాంకాక్కు పయనమయ్యారు. ఈనెల 12-17 వరకు యోనెక్స్ థాయ్లాండ్ ఓపెన్ టోర్నీతో పాటు.. 19 నుంచి 24 వరకు జరిగే టయోటా థాయ్లాండ్ ఓపెన్ టోర్నీలో ఆడేందుకు భారత బృందం బ్యాంకాక్ పయనమైంది. డబుల్స్ ప్లేయర్లు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి, అశ్విని పొన్నప్ప-సిక్కిరెడ్డి, సింగిల్స్ ఆటగాళ్లు ప్రణయ్, కశ్యప్, సమీర్ వర్మ, ధ్రువ్ కపిల, మనూ అత్రి కూడా వెళ్లారు.
లక్ష్యసేన్ వెన్ను నొప్పి కారణంగా చివరి నిమిషంలో ఈ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. కిడాంబి శ్రీకాంత్ మినహా మిగతా కరోనా కారణంగా లభించిన 10 నెలల బ్రేక్ తర్వాత మళ్లీ బరిలోకి దిగుతున్నారు. గత అక్టోబరులో జరిగిన డెన్మార్క్ ఓపెన్లో శ్రీకాంత్ పాల్గొన్నాడు. సైనా, కశ్యప్, ప్రణయ్, సమీర్ వర్మ, మను అత్రి హైదరాబాద్ నుంచి బయల్దేరారు. 'చాలా రోజుల తర్వాత జరుగుతున్న టోర్నీ. థాయ్లాండ్ ఓపెన్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం' అని భార్య సైనాతో ఉన్న ఫొటోను కశ్యప్ ఇన్స్టాలో పోస్టు చేశాడు.
గత అక్టోబర్ నుంచి లండన్లోనే ఉంటూ అక్కడే ప్రాక్టీస్ చేసిన ప్రపంచ చాంపియన్, స్టార్ షట్లర్ పీవీ సింధు లండన్ నుంచి దోహా మీదుగా బ్యాంకాక్ చేరనుంది. హీత్రూ విమానాశ్రయం నుంచి బయలుదేరే ముందు సింధుతో కలిసి తీసుకున్న ఫోటోను ఇంగ్లండ్ డబుల్స్ ఆటగాళ్లు బెన్ లేన్, సీన్ వెండీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. కరోనా మహమ్మారి సమయంలో ఇంగ్లండ్కు వెళ్లి సాధన చేయాలనుకోవడం తాను తీసుకున్న ఉత్తమ నిర్ణయాల్లో ఒకటని తాజాగా సింధు తెలిపింది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్లో ఏడో స్థానంలో ఉన్న సింధుకు థాయ్లాండ్ ఓపెన్లో అనుకూలమైన 'డ్రా' ఎదురైంది.
బ్యాడ్మింటన్ షెడ్యూల్:
జనవరి 12-24 థాయ్లాండ్ ఓపెన్
మార్చి 17-21 ఆల్ ఇంగ్లండ్ ఓపెన్
మార్చి 31-ఏప్రిల్4 మలేషియా ఓపెన్
జూన్ 8-13 ఇండోనేషియా ఓపెన్
ఆగస్టు 24-29 హైదరాబాద్ ఓపెన్
సెప్టెంబర్ 21-26 విక్టర్ చైనా ఓపెన్
సెప్టెంబర్ 28-అక్టోబర్ 3 జపాన్ ఓపెన్
అక్టోబర్ 19-24 డెన్మార్క్ ఓపెన్
అక్టోబర్ 26-31 ఫ్రెంచ్ ఓపెన్
నవంబర్ 9-14 చైనా ఓపెన్
డిసెంబర్ 15-19 వరల్డ్ టూర్ ఫైనల్స్
అభిమానులకు శుభవార్త.. టీమిండియా ఆటగాళ్లకు కరోనా నెగటివ్!! ఆ ఐదుగురికి!!