
హైదరాబాద్: ఈ ఏడాది మూడు ఫైనల్స్లో ఓటమి పాలైనప్పటికీ... వరల్డ్ ఛాంపియన్షిప్, ఆసియా గేమ్స్ను కొత్తగా ప్రారంభించనున్నట్లు భారత షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు తెలిపింది. రియో ఒలింపిక్స్లో రజత పతకం గెలిచినప్పటి నుంచీ సింధు అద్భుతమైన ఫామ్లో కొనసాగుతోంది.
గతేడాది మొత్తం ఆరు టోర్నీల్లో ఫైనల్స్కు చేరిన సింధు, మూడు టోర్నీల్లో టైటిల్ విజేతగా నిలిచింది. జులై నెలలో వరల్డ్ ఛాంపియన్షిప్, ఆగస్టులో ఆసియా గేమ్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో సింధు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జపాన్ క్రీడాకారిణి నొజొమి ఒకుహర, తాను సమానంగా ఆడతామని తెలిపింది.
వరల్డ్ ఛాంపియన్షిప్, ఆసియా గేమ్స్లో మా ఇద్దరి మధ్య గట్టి పోటీ ఉంటుందని పేర్కొంది. ''ప్రపంచంలో ఎక్కడ.. ఏ టోర్నీలో ఆడినా ఒకుహర, నాకు మధ్య పోటీ తీవ్రంగా ఉంటుంది. గత వరల్డ్ ఛాంపియన్షిప్లో తను గెలిచింది. కొరియా ఓపెన్లో నేను నెగ్గా. జపాన్ ఓపెన్లో ఒకుహర నెగ్గగా.. ఆల్ ఇంగ్లాండ్లో నేను పైచేయి సాధించా. మా ఇద్దరి ఆట సమానంగా ఉంటుంది" అని సింధు తెలిపింది.
"ఆటలో కీలక సమయంలో సాధించే 2, 3 పాయింట్లే ఫలితాన్ని మార్చేస్తాయి. వరల్డ్ ఛాంపియన్షిప్లో ఒకుహరతో మ్యాచ్ గురించి అందరు మాట్లాడుతున్నారు. కానీ అంతకంటే ముందున్న మ్యాచ్లు కూడా కఠినమే. తొలి రౌండ్లో ఫిత్రియానితో తలపడాలి. గతంలో ఆమెతో ఆడా. ప్రస్తుతం ఫిత్రియాని బాగా ఆడుతోంది. ఏదైనా జరుగొచ్చు" అని సింధు పేర్కొంది.
"ఆ తర్వాతి రౌండ్లో సుంగ్ హ్యున్తో పోటీ పడాలి. సుంగ్ కఠినమైన ప్రత్యర్థి. ఆసియా ఛాంపియన్షిప్లో ఆమె చేతిలో ఓడా. తను మంచి స్ట్రోక్లు ఆడుతుంది. సుంగ్ను తేలిగ్గా తీసుకోలేను. కాబట్టి ఆమెతో మ్యాచ్ కూడా కీలకమే. ఏదేమైనా ప్రపంచ ఛాంపియన్షిప్ కోసం పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్నా" అని సింధు తెలిపింది.
"కఠినమైన డ్రా ఉన్నా పోరాడతా. ఇక ఆసియా గేమ్స్ల్లోనూ గట్టి పోటీ ఉంటుంది. నాణ్యత పరంగా సూపర్ సిరీస్కు ఏమాత్రం తీసిపోదు. కరోలినా మారిన్ మినహా మిగతా స్టార్ ప్లేయర్లు అంతా బరిలో దిగుతున్నారు. ఆసియా క్రీడల్లో విజయం సాధించాలంటే కష్టపడాల్సిందే" అని సింధు తెలిపింది.