బీజింగ్లో జరగనున్న వింటర్ ఒలింపిక్స్పై నిషేధం విధించాలనే యోచనలో తాను ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. చైనా తాను చేస్తున్న తప్పేంటో తెలిసేలా చేయాలన్నదే తమ ఉద్దేశమని అయితే ఇది అమెరికా అథ్లెట్లపై ఎలాంటి ప్రభావం చూపకుండా దౌత్యపరమైన మార్గం ద్వారానే వెళ్లి నిషేధం విధించాలని ఆయన చెప్పారు. వైట్ హౌజ్లో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడ్తో సమావేశమైన సందర్భంగా జో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బీజింగ్ ఒలింపిక్స్ జరగనున్నాయి.
సోమవారం రోజున చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం అనంతరం బైడెన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రధాన్యత సంతరించుకుంది. చైనా పాల్పడుతున్న మానవహక్కుల ఉల్లంఘనపై బైడెన్ మాట్లాడాలంటూ తీవ్ర ఒత్తిడి వస్తోంది. ముఖ్యంగా గ్జింజియాంగ్ ప్రాంతంలో ఉయిఘర్ జాతిపై చేస్తున్న అణిచివేతను మారణహోమంగా అమెరికా ప్రభుత్వం అభివర్ణించింది. ఈ క్రమంలోనే బైడెన్ ప్రభుత్వం త్వరలోనే బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ నిషేధంపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయంటూ వాషింగ్టన్ పోస్టు ఒక కథనం రాసుకొచ్చింది. అంటే వింటర్ ఒలింపిక్స్లో అమెరికా అథ్లెట్లు పాల్గొంటారు కానీ అక్కడ స్టాండ్స్లో అమెరికా ప్రభుత్వం తరపున ఎవరూ కనిపించరని వాష్టింగ్టన్ పోస్టు తన కథనంలో వివరించింది.అధ్యక్షుడు జో బైడెన్ మరియు జిన్పింగ్ల మధ్య జరిగిన సమావేశంలో వింటర్ ఒలింపిక్స్ నిషేధంపై ఎలాంటి చర్చ జరగలేదని వైట్ హౌజ్ పేర్కొంది
ఇక మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో అమెరికా చైనా మధ్య సంబంధాలు మరింత బలహీనపడ్డాయి. ముఖ్యంగా వాణిజ్య పరమైన అంశాలతో ఇరు దేశాల మధ్య దూరం మరింత పెరిగింది. ముఖ్యంగా కోవిడ్కు కారణం చైనానే అమెరికా పలుమార్లు చెప్పడంతో ఈ వాణిజ్య యుద్ధం మరింత ముదిరింది. ఇక బైడెన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చైనాతో సత్సంబంధాలు కొనసాగించాలనే ప్రయత్నం చేసినప్పటికీ చైనా మాత్రం దారికి రావడం లేదని అదే సమయంలో ఇండో పసిఫిక్ ప్రాంతంలో తన మిలటరీ సామర్థ్యాలను పెంచుకునే ప్రయత్నం చేస్తోందని అమెరికా ఆరోపించింది. ఈ క్రమంలోనే చైనా అధ్యక్షుడుతో రెండు సార్లు ఫోన్ చేసి మాట్లాడిని జో బైడెన్... వ్యక్తిగతంగా కూడా కలవాలని ఆశించారు. అయితే కోవిడ్ ప్రారంభం అయినప్పటి నుంచి జిన్పింగ్ చైనా దేశం వీడి బయట దేశాలకు వెళ్లడం లేదు. దీంతో ఇది సాధ్యపడకపోవడంతో తిరిగి ఆన్లైన్ ద్వారానే వీరి సమావేశం జరిగింది
బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ నిషేధంపై అధ్యక్షుడు బైడెన్ నిర్ణయం ఎలా ఉన్నప్పటికీ ఇంకా అధికారికంగా ఎలాంటి సమాచారం లేదని ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ చెప్పుకొచ్చారు. వారి సొంత నిర్ణయం కోసమే తాము ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చారు. వింటర్ ఒలింపిక్స్ నిషేధంపై బైడెన్ ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని లేదంటే ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలహీనపడే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెప్పారు. సరైన నిర్ణయం తీసుకోకుంటే ఈ గేమ్స్కు రాజకీయ రంగు పులుముకుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే వింటర్ ఒలింపిక్స్ పై బైడెన్ ప్రభుత్వం సంపూర్ణ నిషేధం విధించాలని డిమాండ్ చేశారు రిపబ్లిక్ పార్టీకి చెందిన సెనేటర్ టామ్ కాటన్. ఒకవేళ అమెరికా అథ్లెట్లు అక్కడికి వెళ్లిన వారి భద్రతపై గ్యారెంటీ లేదని చెప్పారు. అమెరికా చైనాల మధ్య సంబంధాలను పోటీగానే భావిస్తామని ఒక వివాదంలా కాదని ప్రెస్ సెక్రటరీ సాకి చెప్పారు. అయితే మానవ హక్కుల ఉల్లంఘన మాత్రం తీవ్రంగా పరిగిణిస్తామని హెచ్చింరించింది