నాన్నకు అంకితం:
'ఇదో భావోద్వేగమైన రోజు. నాకు 12 ఏళ్ల వయస్సులో మా నాన్న చనిపోయాడు. భవిష్యత్లో అంతర్జాతీయ క్రికెట్లో నమోదు చేసే తొలి సెంచరీని ఆయనకు అంకితం ఇవ్వాలని అప్పుడే నిర్ణయించుకున్నా. ఆయన ఎక్కడున్నా ఈ రోజు నా ఆట చూసి గర్వించే ఉంటారు. ఈ ఇన్నింగ్స్ ఆడడం సంతోషంగా ఉంది. ఈ సెంచరీలో ఇషాంత్ భాగస్వామ్యం కూడా ఉంది. నాకంటే కూడా ఇషాంతే అసలైన బ్యాట్స్మన్గా కనిపించాడు' అని విహారి అన్నాడు.
ముందు రోజు రాత్రి సరిగా నిద్రపోలేదు:
'బౌలర్లు ఎలాంటి బంతులు విసురుతున్నారనే దానిపై ఇషాంత్, నేను క్రీజులో చర్చించుకున్నాం. అతడి అనుభవం ఉపయోగపడింది. అంతకుముందు రోజు రాత్రి భారీ స్కోరు గురించి ఆలోచిస్తూ సరిగా నిద్రపోలేదు. ఇక 84 పరుగుల వద్ద చాలా సమయం తీసుకున్నా. అప్పుడు విండీస్ బౌలర్ల పదునైన బంతుల కారణంగా 90ల్లోకి వెళ్లడం చాలా కష్టమైంది. ఏదేమైనా సెంచరీ చేయడం ఆనందంగా ఉంది. ఇలాంటి ప్రదర్శనలు మరలా చేయాలని కోరుకుంటున్నా. మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా బుమ్రా' అని విహారి పేర్కొన్నాడు.
వెస్టిండీస్ లక్ష్యం 468.. భారత్ విజయానికి 8 వికెట్లు
సూపర్ సెంచరీ:
తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో రహానే అండగా రెచ్చిపోయిన విహారి.. రెండో టెస్టులో సహచరుల నుంచి పెద్దగా సహకారం లభించకున్నా అదరగొట్టాడు. విండీస్ పేసర్లు హోల్డర్, రోచ్ నిప్పులు చెరుగుతున్నా.. ఏ మాత్రం తడబడకుండా సూపర్ సెంచరీ (225 బంతుల్లో 111 బ్యాటింగ్; 16 ఫోర్లు) చేసాడు. ఇక రెండో ఇన్నింగ్స్లో కూడా కీలక అర్ధ శతకం చేసి జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడంతో పాటు రోహిత్ శర్మ టెస్టు అవకాశాలను మరింత సంక్లిష్టం చేశాడు.