రాయుడు ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు
క్రీజులో ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు. చివరి 14 ఇన్నింగ్స్లో రాయుడు నుంచి వచ్చిన మెరుగైన స్కోర్లు 73, 100, 90 మాత్రమే. ఏడుసార్లు 25 రన్స్లోపే అవుటయ్యాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్లో తొలి మూడు వన్డేల్లో 13, 18, 2 పరుగులే చేయడంతో వరల్డ్కప్ జట్టులో రాయుడికి చోటు అనుమానంగా మారింది.
No. 4ను ఎవరితో భర్తీ చేయాలి
దీంతో భారత్ మళ్లీ ఎవరితో భర్తీ చేయాలనే ఆలోచనల్లో పడింది. ఈ నేఫథ్యంలో ఆల్రౌండర్ విజయ్ శంకర్ను ఆ స్థానంలో బరిలో దించే ప్రయత్నం చేయాలని మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ "స్ట్రయిక్ రొటేట్ చేయడంతో పాటు అలవోకగా సిక్స్లు బాదే సామర్థ్యం కలిగిన విజయ్ను నాలుగో నంబర్లో ఆడిస్తే బాగుంటుందనేది నా ఆలోచన" అని చెప్పాడు.
రాయుడిని పరిగణనలోకి తీసుకుంటారా?
"బౌలర్గా శంకర్కు 3 ఓవర్ల బౌలింగ్ ఇస్తే చాలు. ఏడు లేదా పూర్తి కోటా 10 ఓవర్లు బౌలింగ్ చేయించాల్సిన అవసరం లేదు. నాలుగో నంబర్ బ్యాట్స్మన్గా అంబటి రాయుడిని కూడా పరిగణనలోకి తీసుకుంటారా? అని అడిగిన ప్రశ్నకు గాను వెల్లింగ్టన్లో కివీస్తో మ్యాచ్లో 90 పరుగుల తర్వాత.. అతడు ఆ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి సరిగ్గా సరిపోతాడని.. తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడని భావించా" అని మంజ్రేకర్ అన్నాడు.
అంబటి రాయుడు స్థానం ప్రశ్నార్థకంగా మారింది
"అయితే, ప్రస్తుతం ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ల్లో తక్కువ స్కోరుకే వెనుదిరగడం.. విజయ్ శంకర్ రాణిస్తుండటంతో ప్రస్తుతం జట్టులో అంబటి రాయుడు స్థానం ప్రశ్నార్థకంగా మారింది. ఇక, కోహ్లీ కచ్చితంగా మూడో స్థానంలోనే బ్యాటింగ్కు దిగాలి. ఈ జట్టుకు విజయాన్ని అందించే అత్యుత్తమ బ్యాట్స్మన్ను బ్యాటింగ్ ఆర్డర్లో కిందకి పంపడం సరికాదు" అని సంజయ్ మంజ్రేకర్ అన్నారు.
ధోనీ ప్రశాంతత భారత్కు అవసరం
ఇక, ప్రస్తుతం టీమిండియా బౌలింగ్ అద్భుతంగా ఉందని సంజయ్ మంజ్రేకర్ కొనియాడాడు. "ప్రపంచంలో అత్యుత్తమ జట్టు భారత్ అయినప్పటికీ కచ్చితంగా వచ్చే వరల్డ్కప్లో గెలుస్తారని మాత్రం చెప్పలేను. ధోని అనుభవం జట్టుకు ఎంతో అవసరం. ధోని అద్భుతమైన వికెట్ కీపర్. ఇద్దరు మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, చాహల్ ఎదుగుదలలో అతడి పాత్ర ఎంతో ఉంది. వరల్డ్కప్లో ధోనీ ప్రశాంతత భారత్కు అవసరం ఉంది" అని సంజయ్ మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.