భారత్ తెగింపుని క్రికెట్ ప్రపంచానికి చాటిన కెప్టెన్.. హ్యాపీ బర్త్డే దాదా!!

కోల్కతా: భారత క్రికెట్కు దూకుడును పరిచయం చేసిన కెప్టెన్ అతను. మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతంతో ఇరుక్కుని సతమతమవుతున్న జట్టు బాధ్యతలను భుజాలపై మోశారు. మైదానంలోనూ, బయట ఎక్కడా రాజీపడని మనస్తత్వంతో ఫేమస్ అయ్యారు. యువకులతో ఉన్న జట్టును దక్షిణాఫ్రికా గడ్డపై ప్రపంచకప్ ఫైనల్కు తీసుకెళ్లారు. సొంతగడ్డపై మాత్రమే టీమిండియా విజయాల్ని సాధిస్తుంది అనే వాదనని తుడిచేస్తూ.. విదేశీ గడ్డపైనా భారత్ జట్టు సత్తాచాటగలదని నిరూపించిన తొలి కెప్టెన్. అంతేకాదు.. తన బ్యాటింగ్తో ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు పరుగెత్తించారు. ఇప్పటికే అతను ఎవరో అర్ధమైఉంటుంది. అతను మరెవరో కాదు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ. 1972, జులై 8న కోల్కతాలో జన్మించిన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బుధవారం 48వ పడిలోకి అడుగుపెట్టారు.

వన్డేల్లో 10వేల పరుగుల మైలురాయి:
భారత్ తరఫున కెరీర్లో 113 టెస్టులాడిన 'ప్రిన్స్ ఆఫ్ కోల్కతా' సౌరవ్ గంగూలీ 16 శతకాలు, 35 అర్ధ శతకాల సాయంతో 7212 పరుగులు చేశారు. అత్యధిక స్కోర్ 239. 311 వన్డేల్లో ప్రాతినిథ్యం వహించిన గంగూలీ.. 22 సెంచరీలు, 72 హాఫ్ సెంచరీలతో 11363 పరుగులు సాధించారు. వన్డేల్లో సచిన్ టెండూల్కర్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన రెండో భారత క్రికెటర్ గంగూలీనే. వన్డేల్లో 10వేల పరుగుల మైలురాయిను వేగంగా అందుకున్న మూడవ క్రికెటర్గా గంగూలీ నిలిచారు.

యువ ఆటగాళ్లకు అవకాశాలు:
సౌరవ్ గంగూలీ తన కెప్టెన్సీ కాలంలో ఎందరో యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చారు. అందరూ కూడా ఓ వెలుగువెలిగారు. ఇందులో యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, మొహమ్మద్ కైఫ్, గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్, ఎంఎస్ ధోనీ, ఆశిష్ నెహ్రా లాంటి వారు ఉన్నారు. వీరందరూ విఫలమయిన ప్రతిసారి అండగా నిలిచేవారు. ఇక కెప్టెన్గా భారత్ తెగింపుని క్రికెట్ ప్రపంచానికి చాటారు. జట్టుకు దూకుడుని నేర్పారు. 2002 నాట్వెస్ట్ సిరీస్ ఫైనల్లో ఇంగ్లాండ్పై టీమిండియా గెలవగానే స్టేడియంలోని బాల్కనీలో షర్ట్ విప్పిన ఘనత దాదాకే చెల్లింది.

విదేశీ ఆటగాళ్లు స్లెడ్జింగ్కి దిగుతుంటే:
విదేశీ ఆటగాళ్లు స్లెడ్జింగ్కి దిగుతుంటే అప్పటి వరకూ మౌనంగా ఉండిపోయిన భారత క్రికెటర్లు.. సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలోనే ధీటుగా బదులివ్వడం నేర్చుకున్నారు. దీంతోనే విదేశాల్లోనూ భారత్ జట్టు తన ఆధిపత్యాన్ని ప్రదర్శించగలిగింది. అయితే 2003లో గంగూలీ కెప్టెన్సీలోనే టీమిండియా ఫైనల్కి చేరింది. కానీ తుది పోరులో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. గంగూలీ కెప్టెన్సీలో 146 వన్డేలాడిన టీమిండియా.. 76 మ్యాచ్ల్లో గెలుపొంది 65 మ్యాచ్ల్లో ఓడింది. మరో ఐదు మ్యాచ్ల్లో ఫలితం తేలలేదు. టెస్టు ఫార్మాట్లోనూ దాదా కెప్టెన్సీలో భారత్ జట్టు 49 మ్యాచ్లు ఆడగా.. 21 మ్యాచ్ల్లో విజయం సాధించింది. 13 మ్యాచ్ల్లో ఓడిపోగా.. 15 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి.

గంగూలీకి ఐసీసీ బర్త్డే గ్రీటింగ్స్:
టీమిండియాకు ఎంతో సేవ చేసిన దాదా ప్రస్తుతం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. నేడు 48వ వసంతంలోకి అడుగుపెడుతున్న మాజీ కెప్టెన్ గంగూలీకి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఐసీసీ తన ట్విట్టర్లో గంగూలీకి ప్రత్యేక విషెస్ చెప్పింది. టీమిండియా విజవంతమైన కెప్టెన్గా కొనసాగిన గంగూలీకి బర్త్డే గ్రీటింగ్స్ అంటూ ఐసీసీ పేర్కొన్నది. అందులో దాదా ఘనతలను రాసుకొచ్చింది. సహచరుడు, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గంగూలీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. బీసీసీఐ, యువీ, సెహ్వాగ్, హర్భజన్ కూడా దాదాకు విషెష్ చెప్పారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
మెల్బోర్న్లో లాక్డౌన్.. టీ20 ప్రపంచకప్ ఇక లేనట్టే?