

హైదరాబాద్: మరోసారి బీసీసీఐ ముంగిట కాసుల వర్షం కురియనుంది. భారత క్రికెట్ జట్టు మీడియా, డిజిటల్ ప్రసార హక్కుల కోసం జరుగుతున్న వేలంలో తొలి రోజు భారీగానే పలికినా ఇది రెండో రోజుకి మరింతగా పెరిగే అవకాశాలు లేకపోలేదు. కాగా, తొలిరోజు మంగళ వారం గ్లోబల్ కన్సాలిడేటెడ్ హక్కు (జీసీఆర్)ల కోసం జరిగిన వేలంలో సోనీ, స్టార్స్పోర్ట్స్, జియో మధ్య పోటీ ఏర్పడింది.
రానున్న ఐదేండ్ల(2018-2023)కు మీడియా హక్కుల కోసం ప్రముఖ ప్రసార కంపెనీలు స్టార్, సోనీ, జియో హోరాహోరీగా పోటీపడుతున్నాయి. గతానికి భిన్నంగా తొలిసారి ఈ-వేలంలో మొదటి రోజు కంపెనీల బిడ్డింగ్ రూ.4442 కోట్ల వరకు చేరింది.
గతం(2012)లో స్టార్ దక్కించుకున్న మొత్తం(రూ.3851 కోట్లు) కంటే ఇప్పటికే 15 శాతం అధికంలో బిడ్డింగ్ నడుస్తున్నది. బుధవారం ఉదయం 11 గంటలకు తిరిగి బిడ్డింగ్ ప్రక్రియ మొదలవుతుంది.
గ్లోబల్ కన్సాలీడేటెడ్ మీడియా రైట్స్(జీసీఆర్) కింద ప్రపంచ ప్రసార హక్కులతో పాటు డిజిటల్ హక్కులు ఎక్కువ కోట్ చేసిన వారికి దక్కుతాయి. రానున్న ఐదేండ్ల కాలంలో సొంతగడ్డపై భారత్ ఆడే మూడు ఫార్మాట్ల మ్యాచ్ల(102)ను ప్రసారం చేసే అవకాశం లభిస్తుంది. ఇందులో బిడ్డింగ్ ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.