హైదరాబాద్: టెస్టు క్రికెట్లో ఆతిథ్య జట్లకు దక్కే అదనపు ప్రయోజనాన్ని నివారించేందుకు మ్యాచ్ ఆరంభానికి ముందు టాస్ పద్ధతిని తీసేయాలన్న ప్రతిపాదనను అనిల్ కుంబ్లే నేతృత్వంలోని ఐసీసీ క్రికెట్ కమిటీ వ్యతిరేకించింది. టాస్ను యధావిధిగా కొనసాగించాలని నిర్ణయించింది. పర్యాటక జట్టుకే బ్యాటింగ్ లేదా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఇవ్వాలన్న ప్రతిపాదన ఇటీవలే తెరపైకి వచ్చింది.
'టాస్ వేయకుండా పర్యాటక జట్టుకు బ్యాటింగ్ లేదా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఇవ్వాలనే అంశంపై చర్చ జరిగింది. అయితే టెస్టు క్రికెట్లో టాస్ అంతర్గత భాగంగా క్రికెట్ కమిటీ భావించింది' అని ఐసీసీ ప్రకటించింది.
ఇకపై సిరీస్ విజయానికి కాకుండా మ్యాచ్కు పాయింట్లు కేటాయించాలని కూడా కమిటీ సిఫారసు చేసింది. టాస్ అనేది టెస్టుల్లో అంతర్భాగమని, ఈ పద్ధతిని మార్చాల్సిన అవసరం లేదని కుంబ్లే, జయవర్దనె, గ్యాటింగ్, డేవిడ్ బూన్, మైక్ హెసన్లతో కూడిన కమిటీ భావించింది. మరోవైపు మైదానంలో హద్దులు దాటి ప్రవర్తించే, బాల్ టాంపరింగ్కు పాల్పడే ఆటగాళ్లకు ఇప్పడున్న వాటి కంటే కఠిన శిక్షలు అవసరమని ఈ కమిటీ ఐసీసీకి సూచించింది.
ఇటీవల ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, బాన్ క్రాఫ్ట్లు బాల్ ట్యాంపరింగ్కు పాల్పడి ఏడాది పాటు నిషేదానికి గురైన సంగతి తెలిసిందే. కాగా, వారు తాజాగా దేశీ వాలీ టోర్నీల్లో ఆడేందుకు అర్హత పొందారు.