ఐపీఎల్ చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన చెంపదెబ్బ ఘటనపై భారత మాజీ పేసర్ శ్రీశాంత్ మరోసారి నోరు విప్పాడు. దాదాపు 18 ఏళ్ల క్రితం జరిగిన ఈ ఘటనను హర్భజన్ సింగ్ తన వ్యాపార ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని శ్రీశాంత్ సంచలన ఆరోపణలు చేశాడు. హర్భజన్ తనపై చేసిన దాడిని సాకుగా చూపి.. ఓ ప్రకటన ద్వారా దాదాపు రూ.కోటి వరకు ఆదాయం గడించారని శ్రీశాంత్ విమర్శించాడు.
కోటి రూపాయల ఆదాయంపై శ్రీశాంత్ ఆరోపణలు
శ్రీశాంత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హర్భజన్ ఆనాటి చేదు జ్ఞాపకాన్ని మార్కెట్ చేసుకుంటున్నారని మండిపడ్డాడు. "నాటి చెంపదెబ్బ ఘటన ఆధారంగా భజ్జీ ఇటీవల ఓ యాడ్ చేశాడు. దాని ద్వారా ఆయనకు రూ.కోటి ఆదాయం వచ్చింది. అంతటితో ఆగకుండా, ఆ యాడ్ను నా సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసి ప్రమోట్ చేయమని స్వయంగా నాకు ఫోన్ చేసి అడిగాడు. అప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నేను అతడిని క్షమించాను కానీ, ఆ ఘటనను మాత్రం ఎప్పటికీ మర్చిపోను" అని శ్రీశాంత్ స్పష్టం చేశాడు.

నటన అంటూ శ్రీశాంత్ విమర్శలు
హర్భజన్ సింగ్ వివిధ ఇంటర్వ్యూలలో ఆ ఘటనపై పశ్చాత్తాపం వ్యక్తం చేయడం కేవలం సానుభూతి కోసమేనని శ్రీశాంత్ కొట్టిపారేశాడు. భజ్జీ మాటలన్నీ నటనేనని, అందుకే తాను అతడిని ఇన్స్టాగ్రామ్లో బ్లాక్ చేశానని తెలిపాడు. "చాలా ఇంటర్వ్యూల్లో తాను పెద్ద తప్పు చేశానని భజ్జీ చెబుతుంటాడు. నా కుమార్తె గురించి కూడా ప్రస్తావించాడు. కానీ ఒకట్రెండు నెలల క్రితం ఆయన చేసిన ఆ యాడ్ చూశాక, అతడి అసలు రంగు బయటపడింది. మనకు జరిగిన చెడును మర్చిపోతే అవతలి వ్యక్తి మళ్లీ అదే తప్పు చేసే ప్రమాదం ఉంటుంది" అని శ్రీశాంత్ ఆవేదన వ్యక్తం చేశాడు.
నేపథ్యం.. 2008 నాటి ఐపీఎల్ ఘటన
2008లో జరిగిన తొలి ఐపీఎల్ సీజన్లో ముంబయి ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ వివాదం చోటుచేసుకుంది. ఆటగాళ్లు పరస్పరం కరచాలనం చేసుకుంటున్న సమయంలో హర్భజన్ సింగ్ ఒక్కసారిగా శ్రీశాంత్ చెంపపై కొట్టాడు. ఆ దెబ్బకు శ్రీశాంత్ మైదానంలోనే వెక్కి వెక్కి ఏడ్చాడు. ఈ ఘటన అప్పట్లో పెను సంచలనం సృష్టించగా.. బీసీసీఐ హర్భజన్పై 8 మ్యాచ్ల పాటు నిషేధం కూడా విధించింది. తాజాగా ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ ఆ వీడియోను విడుదల చేయడంతో ఈ పాత గాయం మళ్లీ చర్చనీయాంశమైంది.
అశ్విన్ ఇంటర్వ్యూలో భజ్జీ కామెంట్స్
ఇటీవల రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్భజన్ సింగ్ ఈ ఘటనను గుర్తు చేసుకున్నాడు. శ్రీశాంత్ కుమార్తె తనను ఉద్దేశించి అన్న మాటలు తనను కలచివేసాయంటూ సానుభూతి వ్యక్తం చేశాడు. అయితే శ్రీశాంత్ తాజా కామెంట్స్,్ చూస్తుంటే, వీరిద్దరి మధ్య పాత వివాదం ఇంకా సమసిపోలేదని, పైగా కొత్త మలుపు తీసుకుందని స్పష్టమవుతోంది.