వైభవ్ సూర్యవంశీ ఆ విషయంలో మెరుగుపడాలి: వీవీఎస్ లక్ష్మణ్
టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీపై తాత్కలిక హెడ్ కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసల జల్లు కురిపించాడు. వైభవ్ సూర్యవంశీ ప్రతిభపై ఎలాంటి సందేహం లేదని, కానీ ఫిట్నెస్ను మెరుగుపర్చుకోవాలని సూచించాడు. ఫిట్నెస్పై దృష్టి సారిస్తే వైభవ్కు తిరుగుండదని, ఈ క్రికెట్ ప్రపంచాన్ని ఏలుతాడని కొనియాడాడు.
జింబాబ్వేతో మూడు టీ20ల సిరీస్ను టీమిండియా 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ సిరీస్ నుంచి గౌతమ్ గంభీర్కు విశ్రాంతి కల్పించగా.. వీవీఎస్ లక్ష్మణ్ తాత్కలిక హెడ్ కోచ్గా జట్టను నడిపించాడు. ఈ సిరీస్లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్తో రెండు హాఫ్ సెంచరీలు బాది ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. ఆఖరి మ్యాచ్లో విధ్వంసకర హాఫ్ సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు.

అతని సత్తా విజయవాడలోనే గుర్తించాం..
ఈ విజయానంతరం మీడియాతో మాట్లాడిన వీవీఎస్ లక్ష్మణ్.. వైభవ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విజయవాడలోనే వైభవ్ ప్రతిభ గుర్తించినట్లు పేర్కొన్నాడు. 'వైభవ్ సూర్యవంశీ గురించి మాకు రెండున్నరేళ్ల క్రితమే తెలుసు. అండర్ 19 ప్రపంచకప్ టోర్నీకి ముందే అతని ప్రతిభను గుర్తించాం. విజయవాడలో జరిగిన క్వాడ్రపుల్ సిరీస్లో ఇండియా బి తరఫున వైభవ్ సూర్యవంశీ టాప్ స్కోరర్.
అప్పటికి, ఇప్పటికీ వైభవ్లో చాలా పరిణతి కనిపిస్తోంది. ఆటపై అవగాహన కూడా పెరిగింది. అందుకే కఠినమైన పరిస్థితుల్లో కూడా రాణిస్తున్నాడు. ఈ సిరీస్లో అద్భుతంగా రాణించాడు. అయితే, అతను మెరుగుపరుచుకోవాల్సిన ఏకైక అంశం ఫిట్నెస్. అతని వయసు కేవలం 15 ఏళ్లేనని కూడా మనం గుర్తుంచుకోవాలి.
ఫిట్గా ఉంటేనే..
మూడో టీ20లో ఫీల్డింగ్ చేస్తూ వైభవ్ గాయపడ్డాడు. అయినా మైదానంలోనే కొనసాగాలనుకున్నాడు. కానీ మా ఫిజియో సూచన మేరకు అతన్ని బయటకు తీసుకురావాల్సి వచ్చింది. జట్టు కోసం ప్రతీ విషయంలో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనే తప అతనిలో ఉంది. సుదీర్ఘ కాలం ఆటలో కొనసాగాలంటే రాబోయే కాలంలో వైభవ్ మరింత ఫిట్గా ఉండాల్సిన అవసరం ఉంది.'అని వీవీఎస్ లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు.
భారత్దే సిరీస్ ..
మూడో టీ20లో భారత్ 35 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ను 3-0 క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 192 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ(49 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్లతో 81) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. ఇషాన్ కిషన్(29), శ్రేయస్ అయ్యర్(27), రింకూ సింగ్(25) పర్వాలేదనిపించారు.
అనంతరం జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 157 పరుగులే చేసి ఓటమిపాలైంది. ర్యాన్ బర్ల్(43 బంతుల్లో 5 ఫోర్లతో 54 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించగా.. వెస్లీ మధవెరె(28) పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్(3/29) మూడు వికెట్లు తీయగా.. యశ్ ఠాకూర్(2/45) రెండు వికెట్లు పడగొట్టాడు. అశోక్ శర్మ, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీసారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


