అర్జెంటీనాకు మెస్సీ.. టీమిండియాకు కోహ్లీ, రోహిత్: మహ్మద్ కైఫ్
వచ్చే ఏడాది సౌతాఫ్రికా వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ 2027లో టీమిండియా విజయం సాధించాలంటే అపార అనుభవం కలిగిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జట్టులో ఉండాలని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు. అర్జెంటీనాకు ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ఎలానో.. టీమిండియాకు కోహ్లీ, రోహిత్ అలానేనని చెప్పాడు. ఈ ఇద్దరి ఆటగాళ్లను భారత జట్టులో కొనసాగించాలని బీసీసీఐకి కైఫ్ సూచించాడు.
రోహిత్ శర్మ రిటైర్మెంట్ అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో కైఫ్ చేసి ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. టీ20 క్రికెట్తో పాటు టెస్ట్లకు వీడ్కోలు పలికిన కోహ్లీ, రోహిత్లు కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే ఆడుతున్నారు. వన్డే ప్రపంచకప్ 2027 ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరూ ఇంగ్లండ్ పర్యటనలో వన్డే సిరీస్ ఆడుతున్నారు. ఈ సిరీస్లో రోహిత్ వరుసగా రెండు మ్యాచ్ల్లో విఫలమవడంతో లార్డ్స్ వేదికగా జరిగే మూడో వన్డే అతనికి చివరి మ్యాచ్ అంటూ వార్తలు వచ్చాయి.

కోహ్లీ, రోహిత్ ఆడాలి..
రోహిత్ రిటైర్ అయితే కోహ్లీ కూడా తప్పుకుంటాడని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఈ ఇద్దరి అవసరం జట్టుకు ఎంతో ఉందని కైఫ్ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా చెప్పుకొచ్చాడు. సౌతాఫ్రికాలో 2027 వన్డే ప్రపంచకప్ జరగనుందని, అక్కడి పరిస్థితులు కఠినంగా ఉంటాయని తెలిపాడు.
'2027 వన్డే ప్రపంచకప్ చాలా ముఖ్యమైనది. జనాలు రోహిత్, కోహ్లీల గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈ మెగా టోర్నీ అంత ఈజీ కాదు. ఈ టోర్నీ జరిగే సౌతాఫ్రికాలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. అక్కడ బౌన్సీ పిచ్లు ఉంటాయి. కాబట్టి భారత జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఉండాలి. ఇప్పటి నుంచే వారు వీలైనన్ని మ్యాచ్లు ఆడి ఫామ్ అందుకోవాలి. 39 ఏళ్ల వయసులో లియోనెల్ మెస్సీ, అతని టీమ్ ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ చేరింది.
అనుభవం ముఖ్యం..
సెమీఫైనల్లో మెస్సీ గోల్ చేయకున్నా.. రెండు గోల్స్కు అసిస్ట్ చేసి అర్జెంటీనా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అనుభవం తెచ్చిపెట్టేది ఇదే. పనిని పూర్తి చేయగల యువ ఆటగాళ్లు జట్టులో ఉన్నప్పుడు వారికి మార్గనిర్దేశం ఎలా చేయాలో.. అవకాశాలను ఎలా సృష్టించాలో అనుభవం కలిగిన ఆటగాళ్లకు తెలుసు. కాబట్టి అర్జెంటీనాకు మెస్సీ ఎలాగో.. వన్డే ప్రపంచకప్లో టీమిండియా కోహ్లీ, రోహిత్లు కూడా అలాగే. ఫుట్బాల్, క్రికెట్ ఏదైనా అనుభవం కీలక పాత్ర పోషిస్తుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను గొప్ప వన్డే ఆటగాళ్లుగా పరిగణిస్తారు. కాబట్టి సౌతాఫ్రికా కండిషన్స్లో శుభ్మన్ గిల్ సారథ్యంలోని టీమిండియాకు 100 శాతం కోహ్లీ, రోహిత్లు అవసరం ఉంటుంది.'అని కైఫ్ చెప్పుకొచ్చాడు.
ఈ ఏడాది 5 వన్డేలు ఆడిన కోహ్లీ 62 సగటు, 102.33 స్ట్రైక్రేట్తో 310 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ మాత్రం ఈ ఏడాది 8 మ్యాచ్లు ఆడి 30.12 సగటుతో 241 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ దారుణంగా 88.6గానే ఉంది. మరోవైపు రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలను బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ఖండించాడు. లార్డ్స్ వేదికగా జరిగే మూడో వన్డే అతనికి చివరి మ్యాచ్ కాదని స్పష్టం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


