Commonwealth Games: సగానికి తగ్గనున్న భారత్ పతకాల సంఖ్య.. ఎందుకంటే?
అప్కమింగ్ కామన్వెల్త్ గేమ్స్లో భారత్ పతకాల సంఖ్య సగానికి తగ్గిపోనుంది. ఎందుకంటే ఈ సారి కామెన్వెల్త్ గేమ్స్ను 10 క్రీడలకే పరిమితం చేశారు. గ్లాస్గోలో జూలై 23 నుంచి ఆగస్ట్ 2 వరకు కామన్వెల్త్ గేమ్స్ జరగనున్నాయి. బర్మింగ్హామ్ వేదికగా జరిగిన గత ఎడిషన్లో భారత్ 22 స్వర్ణాలతో పాటు 16 రజతాలు, 23 కాంస్యాలతో మొత్తం 61 పతకాలు సాధించింది.
పతకాల పాయింట్ల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. కానీ ఇందులో 30 పతకాలు వరకు తాజా ఎడిషన్లో లేని క్రీడల నుంచే వచ్చాయి. దాంతోనే ఈ సారి భారత్ పతకాల సంఖ్య దాదాపు సగం తగ్గే అవకాశం ఉంది.
భారత్కు ఎదురు దెబ్బ
భారత్కు అచ్చొచ్చిన రెజ్లింగ్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, హాకీ, స్క్వాష్, మహిళల టీ20 క్రికెట్, ట్రయాథ్లాన్ వంటి క్రీడలను గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ నుంచి తొలగించారు. ఇది భారత స్వర్ణ పతకాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. గత ఎడిషన్లో భారత్ గెలిచిన 22 స్వర్ణాలలో 13 స్వర్ణాలు ఈ తొలగించిన క్రీడల నుంచే వచ్చాయి.

రెజ్లింగ్లో ఆరు స్వర్ణాలు గెలిచిన భారత్.. టేబుల్ టెన్నిస్ నాలుగు, బ్యాడ్మింటన్లో మూడు స్వర్ణాలు సొంతం చేసుకుంది. ఈ మూడు గేమ్స్ లేకపోవడంతో మెడల్స్ టేబుల్లో భారత్ స్థానంపై ప్రభావం చూపనుంది.
| తొలగించిన క్రీడ | బర్మింగ్హామ్ 2022 పతకాలు |
|---|---|
| రెజ్లింగ్ | 12 |
| టేబుల్ టెన్నిస్ | 7 |
| బ్యాడ్మింటన్ | 6 |
| హాకీ | 2 |
| స్క్వాష్ | 2 |
| మహిళల టీ20 క్రికెట్ | 1 |
ముఖ్యంగా రెజ్లింగ్ లేకపోవడం భారత్కు అతిపెద్ద లోటు అని చెప్పాలి. బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్లో 12 మంది భారత రెజ్లర్లు బరిలోకి దిగగా.. ప్రతీ ఒక్కరు పతకాలు సాధించారు. రెజ్లింగ్లో భారత్కు ఆరు స్వర్ణాలతో పాటు మొత్తం 12 మెడల్స్ వచ్చాయి.
టేబుల్ టెన్నిస్లోనూ భారత్ ఆధిపత్యం చూపింది. అచంట శరత్ కమల్ మూడు స్వర్ణాలతో సహా నాలుగు పతకాలతో మెరిశారు. బ్యాడ్మింటన్లో పీవీ సింధు, లక్ష్య సేన్ సింగిల్స్లో స్వర్ణాలు గెలవగా.. సాత్విక్సాయిరాజ్ రాంకిరెడ్డి-చిరాగ్ శెట్టి డబుల్స్లో స్వర్ణం సాధించింది. కానీ ఈ సారి బ్యాడ్మింటన్ను తొలగించడంతో ఈ పతకాలన్ని భారత్కు చేజారనున్నాయి.
వారిపైనే భారం..
భారత్ ఆధిపత్యం చెలాయించే 10 క్రీడలను తొలగించడంతో అథ్లెటిక్స్, వెయిట్లిఫ్టింగ్, బాక్సింగ్ విభాగాలపైనే ఇప్పుడు భారత్ ఆశలు పెట్టుకుంది. బర్మింగ్హామ్లో అథ్లెటిక్స్, వెయిట్లిఫ్టింగ్ విభాగాల్లో చెరో 10 పతకాలు రాగా.. బాక్సింగ్లో ఏడు పతకాలు వచ్చాయి. అయితే గ్లాస్గోలో ఈ విభాగాల్లో పోటీ మరింత కఠినంగా ఉండే అవకాశం ఉంది.
ఎందుకంటే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, కెన్యా, జమైకా వంటి దేశాల నుంచి భారత్కు గట్టి పోటీ ఎదురవ్వనుంది. బర్మింగ్ హామ్ కామన్వెల్త్ గేమ్స్లో మహిళల టీ20 క్రికెట్లో హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు సిల్వర్ మెడల్ గెలిచింది. ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. ఈ సారి క్రికెట్ లేకుండా పోయింది.
వాస్తవాన్ని గ్రహించాలి..
ఈ క్రమంలోనే బర్మింగ్ హామ్ కామన్వెల్త్ గేమ్స్తో అప్కమింగ్ ఎడిషన్ను పోల్చవద్దని కామన్వెల్త్ గేమ్స్ భారత చెఫ్-డి-మిషన్ రోహిత్ రాజ్పాల్ అన్నారు. భారత్ బలంగా ఉన్న అనేక క్రీడలు ఈసారి కార్యక్రమంలో లేవని, మొత్తం పతకాల సంఖ్యతో గత గేమ్స్ను నేరుగా పోల్చడం సరైంది కాదని ఆయన స్పష్టం చేశారు.
గ్లాస్గో కామన్వెల్త్ గేమ్ 2026లో భారత్ ఎన్ని పతకాలు గెలుస్తుందో ఇప్పుడే చెప్పడం కష్టం. కానీ కొత్త విభాగాల్లో ఈసారి పతకాలు రావచ్చు. కొందరు యువ క్రీడాకారులు తమ ప్రదర్శనతో ఆకట్టుకోవచ్చు. కానీ బర్మింగ్హామ్తో పోలిస్తే ఈ సారి పోటీ వాతావరణమే పూర్తిగా మారిపోయింది. కాబట్టి భారత ప్రదర్శనను గత గేమ్స్తో పోల్చకుండా క్రీడల ఆధారంగా అంచనా వేయాలని క్రీడా నిపుణులు సూచిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

