పాకిస్థాన్ పర్యటనకు భారత ఆటగాళ్లు..!
పాకిస్థాన్ వేదికగా జరిగే సౌత్ ఏషియన్ ఫెడరేషన్(ఎస్ఏఫ్) గేమ్స్లో పాల్గొనేందుకు భారత్ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే.. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ క్రీడాకారులు తొలిసారి పాకిస్థాన్లో అడుగుపెట్టనున్నారు. ఈ దాడి తర్వాత ఇరు దేశాల మధ్య క్రీడా సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే.
పాకిస్థాన్ మీడియా నివేదికల ప్రకారం.. సౌత్ ఆసియా ఒలింపిక్ అసోసియేషన్ ఉన్నత స్థాయి సమావేశంలో భారత్ పాల్గొంది. ఈ సందర్భంగా పాకిస్థాన్ ఆహ్వానానికి భారత్ అంగీకరించినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 4 నుంచి 11 వరకు ఈ గేమ్స్ జరగనున్నాయి.
సౌత్ ఏషియన్ ఫెడరేషన్ గేమ్స్కు పాకిస్థాన్ చివరిసారిగా 2004లో ఆతిథ్యం ఇచ్చింది. రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ ఈ మెగా ఈవెంట్కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ఎడిషన్లో మొత్తం 28 క్రీడల్లో పోటీలు జరగనున్నాయి. ఇస్లామాబాద్, లాహోర్, పెష్వార్ సిటీలో ఈ గేమ్స్ను నిర్వహించనున్నారు.

ఇస్లామాబాద్ వేదికగా స్క్వాష్, టెన్నిస్, మార్షియల్ ఆర్ట్స్తో పాటు మొత్తం 15 క్రీడలు, లాహోర్లో క్రికెట్, హాకీ, స్విమ్మింగ్తో 10 క్రీడలకు, పెష్వార్ వేదికగా మరో మూడు క్రీడల పోటీలను నిర్వహించనున్నారు. పాకిస్థాన్లో సన్నాహాలు ముమ్మరమయ్యామని, ఆ దేశ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఏర్పాట్లను సమీక్షిస్తూ.. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సౌకర్యాలు కల్పించాలని కేంద్ర, రాష్ట్ర అధికారులను ఆదేశించారని వార్తలు వస్తున్నాయి. భద్రత, వసతి, రవాణా, వైద్య సహాయం, వేదికలను సిద్దం చేయడం ప్రాధాన్యతలుగా గుర్తించినట్లు సమాచారం.
విదేశీ ప్లేయర్స్, అధికారులు, ప్రేక్షకులు, అంతర్జాతీయ మీడియా వారి బస అంతటా సమగ్ర భద్రతను కల్పించాలని కూడా అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ టోర్నీలో పాల్గొనే దేశాలు, ప్రాంతీయ క్రీడా సంస్థలతో పాకిస్థాన్ ఒలింపిక్ అసోసియేషన్ సమన్వయం చేసుకోవడం ప్రారంభించింది. అయితే ఈ గేమ్స్లో పాల్గొనే విషయంపై భారత ఒలింపిక్ అసోసియేషన్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


