Duleep Trophy 2026: సౌత్జోన్ కొంపముంచిన సిరాజ్.. ఈస్ట్ జోన్ రికార్డ్ స్కోర్!
ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో ఇషాన్ కిషన్ సారథ్యంలోని ఈస్ట్ జోన్ ఆధిపత్యం చెలాయిస్తోంది. తిలక్ వర్మ సారథ్యంలోని సౌత్ జోన్తో చెన్నై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 708 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్(334 బంతుల్లో 30 ఫోర్లు, 7 సిక్స్లతో 270)తో డబుల్ సెంచరీతో సత్తా చాటగా.. కుమార్ కుశాగ్ర(132 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్లతో 101) సెంచరీతో చెలరేగాడు.
శిఖర్ మోహన్(120 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 85), అభిమన్యు ఈశ్వరన్(86 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్తో 72) హాఫ్ సెంచరీలతో రాణించారు. వైభవ్ సూర్యవంశీ(37 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 44) దూకుడుగా ఆడాడు. సౌత్ జోన్ బౌలర్లలో త్రిపురణ విజయ్(4/180) నాలుగు వికెట్లు తీయగా.. చామ మిలింద్, శ్రేయస్ గోపాల్ రెండేసి వికెట్లు పడగొట్టారు. షేక్ రషీద్కు ఒక వికెట్ దక్కింది. మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు.

కొంపముంచిన సిరాజ్..
ముఖ్యంగా మహమ్మద్ సిరాజ్ తీవ్రంగా నిరాశపర్చాడు. 25 ఓవర్లు బౌలింగ్ చేసి ఒక వికెట్ తీయకపోగా.. 5.60 ఎకానమీతో 140 పరుగులిచ్చుకున్నాడు. అతని వైఫల్యం ఈస్ట్ జోన్కు కలిసొచ్చింది. దూకుడుగా ఆడిన ఆ జట్టు రెండు రోజుల పాటు పూర్తిగా బ్యాటింగ్ చేసి రికార్డ్ స్కోర్ అందుకుంది.
దులీప్ట్రోఫీ ఫైనల్స్ చరిత్రలోనే ఇది రెండో అత్యధిక స్కోర్గా నిలిచింది. 1987 దులీప్ ట్రోఫీ ఫైనల్లో వెస్ట్ జోన్పై నార్త్ జోన్ 868 పరుగులు చేసింది. ఇప్పటి వరకు ఇదే అత్యధిక స్కోర్గా కొనసాగుతోంది. తాజా ఫైనల్కు ముందు రెండు సార్లు మాత్రమే జట్లు 700 ప్లస్ స్కోర్లు చేశాయి. 1986లో సౌత్ జోన్.. 1991లో నార్త్ జోన్ 700 పరుగుల మార్క్ను అందుకున్నాయి.
ఇషాన్ డబుల్ సెంచరీ..
385/4 ఓవర్ నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను కొనసాగించిన ఈస్ట్ జోన్..నిలకడగా బ్యాటింగ్ చేసింది. ఓవర్నైట్ బ్యాటర్ కుమార్ కుశాగ్ర 128 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అదే జోరులో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో విజయ్ బౌలింగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో ఐదో వికెట్కు నమోదైన 230 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి అనుకూల్ రాయ్ రాగా.. ఈస్ట్ జోన్ 491/5 లంచ్ బ్రేక్కు వెళ్లింది.
రెండో సెషన్లో ఇషాన్ కిషన్ సాధికారికంగా బ్యాటింగ్ చేశాడు. అతన్ని అడ్డుకునేందుకు తిలక్ వర్మ ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. పార్ట్ టైమ్ బౌలర్లతో కూడా బౌలింగ్ చేయించాడు. పడిక్కల్ బౌలింగ్లో బౌండరీ బాది ఇషాన్ కిషన్ 270 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం మరింత దూకుడుగా ఆడిన అతను భారీ సిక్సర్లతో విరుచుకుప్పాడు. 30 బంతుల వ్యవధిలోనే 250 పరుగుల మార్క్ను అందుకున్నాడు. కండరాలు పట్టేయడంతో రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. దాంతో 6వ వికెట్కు నమోదైన 140 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
తిప్పేసిన త్రిపురణ విజయ్
హాఫ్ సెంచరీకి చేరువైన అనుకూల్ రాయ్(45)ను షేక్ రషీద్ ఔట్ చేయగా.. షమీ, ఖురైషి సౌత్ జోన్ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. శ్రేయాస్ గోపాల్ ఈ జోడీని విడదీసాడు. ఖరేషి(40)ని క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ దూకుడుగా ఆడి జట్టు స్కోర్ 700 ధాటించాడు. అతనితో పాటు ముఖేష్ కుమార్(0)ను విజయ్ పెవిలియన్ చేర్చి ఈస్ట్ జోన్ భారీ ఇన్నింగ్స్కు తెరదించాడు. దాంతో రెండో రోజు ఆట ముగిసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


