Asian Games 2026: భారత ఆటగాళ్ల కోసం కంటైనర్ రూమ్స్.. సాయ్ ప్రత్యేక ఏర్పాట్లు!
ఆసియా గేమ్స్ 2026లో పాల్గొనే భారత ఆటగాళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జపాన్లోని ఐచి-నగోయా వేదికగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు 20వ ఆసియా గేమ్స్ జరగనున్నాయి. ఈ టోర్నీలో 45 దేశాల నుంచి సుమారు 11000 మంది క్రీడాకారులు, అధికారులు పాల్గొననున్నారు. 43 క్రీడల పరిధిలోని 71 విభాగాల్లో 469 ఈ వెంట్స్ జరగనున్నాయి. క్రీడా ప్రాంగణంలోని వసతి సౌకర్యాల కొరత కారణంగా.. గేమ్స్ విలేజ్కు బయట నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
ఇందులో భాగంగానే నగోయా ఓడరేవులో ఓ క్రూయిజ్ నౌకను విలాసవంతమైన ఆశ్రయంగా మార్చారు. ఇందులో సుమారు 4,600 మంది క్రీడాకారులు, అధికారులు ఉండనున్నారు. మరో 2400 మంది గార్డెన్ పియర్ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న తాత్కలిక కంటైనర్ షెల్టర్లలో బస చేస్తారు. మిగిలిన వారికి పోటీ వేదికల సమీపంలోని హోటళ్లలో వసతి కల్పించనున్నారు.
కంటైనర్లలో వసతి సవాలే..
ఓడల్లో, హోటళ్లలో బస చేయడం భారత క్రీడాకారులకు ఇబ్బంది కాకపోయినప్పటికీ.. తాత్కలిక కంటైనర్ వసతి వారికి కొత్త అనుభవం ఇవ్వనుంది. 40X8 అడుగుల చిన్న కంటైనర్లను, నలుగురు ఆటగాళ్లు బస చేసేలా తాత్కలిక గదులుగా మార్చారు. సాధారణ గదుల్లో ఉండటానికి అలవాటు పడిన భారత ఆటగాళ్లు.. ఈ చిన్న కంటైనర్స్తో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

దాంతో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని వారికి తగిన ఏర్పాట్లు చేసింది. కంటైనర్లలో అడ్జస్ట్ అయ్యేలా.. అక్కడి పరిస్థితులకు అలవాటు పడేలా.. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) పంజాబ్లోని పాటియాల, బెంగళూరులో ఉన్న సాయ్ సెంటర్లో ఇలాంటి కంటైనర్ గదులను ఏర్పాటు చేసింది.
సవాళ్లను అధిగమించేందుకు సాయ్ ప్రత్యేక ఏర్పాట్లు..
ఆసియా గేమ్స్కు ముందే భారత అథ్లెట్లు ఈ చిన్న గదుల్లో బస చేసి అక్కడి వాతావరణానికి అలవాటు పడనున్నారు. అందుబాటులో ఉన్న వాటికి అడ్జస్ట్ అవ్వడం ఎలానో తెలియజేయడం ఈ కంటైనర్ల ముఖ్య ఉద్దేశం.
పాటియాలా కేంద్రంలోని నమూనా కంటైనర్లో అన్ని సౌకర్యాలతో నలుగురు అథ్లెట్లకు వసతి కల్పించేలా రూపొందించారు. ఇందులో నాలుగు బెడ్స్, వ్యక్తిగత వార్డ్రోబ్లు, ఏసీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, ఎలక్ట్రిక్ కెటిల్ ఉన్నాయి. వంట చేసుకోవడానికి చిన్న గదితో పాటు టాయిలెట్ సౌకర్యాలు కూడా ఉన్నాయి.
మానసికంగా రెడీ చేసేందుకు..
జపాన్కు చేరుకునే ముందే భారత ఆటగాళ్లను మానసికంగా సిద్ధంగా ఉండేందుకు ఈ ఏర్పాట్లు చేశామని పాటియాల ఎన్ఎస్ ఎన్ఐఎస్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ వినీత్ కుమార్ అన్నారు. అక్కడ వసతులకు అలవాటు పడేందుకు, ఎలాంటి సవాళ్లను ఎదుర్కోనేందుకైనా సిద్దంగా ఉండేందుకు ఈ ఏర్పాట్లు చేశామని తెలిపారు.
అయితే ఈ కంటైనర్లను సాయ్ కొత్తగా కొనుగోలు చేయలేదు. కరోనా సమయంలో వెయిట్ లిఫ్టింగ్, అథ్లెటిక్ పరికరాలను ఉంచేందుకు కంటైనర్లను తెప్పించారు. వాటినే ఇప్పుడు పూర్తి స్థాయి షెల్టర్లుగా మార్చారు.
క్రీడా మంత్రిత్వ శాఖ , SAI జాయింట్ కమిటీ జపాన్లో నిర్వహించిన క్షేత్రస్థాయి అధ్యయనం ఆధారంగా ఈ ఏర్పాట్లు చేశారు. అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు సాయ్ ఏర్పాటు చేసిన ఈ కంటైనర్లను ఆటగాళ్లు స్వాగతించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


