IND vs SL: భారత్ X శ్రీలంక రెండో టెస్ట్ డ్రాకు 4 కారణాలు!
టెస్ట్ క్రికెట్లో ప్రధాన బ్యాటర్లను ఔట్ చేయడం ఎంత ముఖ్యమో.. చివర్లో వచ్చే టెయిలెండర్లను ఔట్ చేయడం అంతే కీలకమనే విషయం భారత్కు బాగా తెలిసొచ్చింది. శ్రీలంకతో కొలంబో వేదికగా జరిగిన రెండో టెస్ట్లో నాలుగు రోజులు పూర్తి ఆధిపత్యం చెలాయించిన భారత్.. తోకను కత్తిరించలేక విజయాన్ని చేజార్చుకుంది. శ్రీలంక టెయిలెండర్ల అద్వితీయమైన పోరాటంతో డ్రాతో సరిపెట్టుకుంది. ముఖ్యంగా సోనాల్ దినుష రెండు శతకాలతో భారత్ విజయానికి అడ్డుగా నిలిచాడు. చేజేతులానే ఈ మ్యాచ్ను భారత్ చేజార్చుకుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
1. బెడిసి కొట్టిన ఫాలో-ఆన్ వ్యూహం..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 503/9 భారీ స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం శ్రీలంకను 290 పరుగులకు ఆలౌట్ చేసింది. వర్షాభావ పరిస్థితులు ఉండటంతో ఆ జట్టు ఫాలో-ఆన్ ఆడించి ఆ తర్వాత లక్ష్యాన్ని ఛేదించాలనుకుంది. కానీ ఈ వ్యూహం బెడిసి కొట్టింది. ఫాలో ఆన్ ఆడించకుండా టీమిండియా ఓ సెషన్ పాటు దూకుడుగా బ్యాటింగ్ చేసి శ్రీలంక ముందు 350+ టార్గెట్ పెట్టి ఉంటే ఫలితం మరోలా ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టార్గెట్ ఛేజ్ చేయాలని ఒత్తిడిలో శ్రీలంక బ్యాటర్లు తప్పులు చేసేవారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

2. తోకను కత్తిరించలేక..
శ్రీలంకను ఫాలో-ఆన్ ఆడించినా..భారత్ మెరుగైన బౌలింగ్ ప్రదర్శన చేసింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు పడగొట్టింది. ఆఖరి రోజు తొలి సెషన్లోనే ఫలితం తేలుతుందని అంతా అనుకున్నారు. చివరి నాలుగు వికెట్లు తీయడం భారత్కు కష్టం కాదనుకున్నారు. కానీ ఫామ్లో ఉన్న సోనాల్ దినుషాతో పాటు కేశర నువాంత అద్భుతంగా పోరాడాడు. బౌలింగ్కు అనుకూలంగా ఉండే తొలి సెషన్లో ఇద్దరూ 30 ఓవర్లకు పైగా ఆడి 100 పరుగులు జోడించారు. ఇక్కడే భారత్ విజయవకాశాలు దెబ్బతిన్నాయి. ఈ సెషన్ ఆరంభంలోనే కేశరను ఔట్ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది.
3. ఉడానా 90 బంతులు..
చివరకు రెండో సెషన్ ఆరంభంలోనే కేశర నువాంతను ఔట్ చేశారు. ఆ వెంటే ప్రభాత్ జయసూర్య కూడా ఔటవ్వడంతో శ్రీలంక ఇన్నింగ్స్ ముగుస్తుందని అంతా అనుకున్నారు. కానీ సోనాల్ దినుషకు తోడుగా లాహిరు ఉడానా నిలబడ్డాడు. 90 బంతులు ఆడి భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. సోనాల్తో కలిసి 28 ఓవర్ల పాటు క్రీజులో నిల్చొని 47 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. దాంతో భారత్ విజయవకాశాలు నీరుగారాయి. కనీసం లాహిరు ఉడానాను ఔట్ చేసినా ఫలితం మరోలా ఉండేది.
4. వర్షం కూడా..
చివరి సెషన్లోనూ ఆఖరి వికెట్ను భారత్ త్వరగా తీయలేకపోయింది. అసితా ఫెర్నాండో 24 బంతులు ఎదుర్కొన్నాడు. దినుషకు అండగా నిలిచాడు. దాంతో మ్యాచ్ డ్రా కావాల్సి వచ్చింది. 18 ఓవర్ల ఆట మాత్రమే మిగిలి ఉండటం.. మ్యాచ్ ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో భారత్ డ్రాకు అంగీకరించింది. నాలుగో రోజు ఆట చివర్లో వర్షం అంతరాయం కూడా భారత్ విజయవకాశాలను దెబ్బతీసింది. నాలుగో రోజు మ్యాచ్ ఇంకాసేపు జరిగి ఉంటే మరో రెండు వికెట్లను భారత బౌలర్లు తీసేవారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

