Duleep Trophy 2026 ఫైనల్ డ్రా అయితే.. టైటిల్ ఎవరికంటే?
ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్ రసవత్తరంగా సాగుతోంది. చెన్నై వేదికగా ఆదివారం ప్రారంభమైన ఈ మ్యాచ్లో సౌత్ జోన్, ఈస్ట్ జోన్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 708 పరుగుల రికార్డ్ స్కోర్ నమోదు చేసింది.
ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్(334 బంతుల్లో 30 ఫోర్లు, 7 సిక్స్లతో 270)తో డబుల్ సెంచరీతో చెలరేగగా.. కుమార్ కుశాగ్ర(132 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్లతో 101) సెంచరీతో సత్తా చాటాడు. శిఖర్ మోహన్(120 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 85), అభిమన్యు ఈశ్వరన్(86 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్తో 72) హాఫ్ సెంచరీలతో రాణించారు. వైభవ్ సూర్యవంశీ(37 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 44) దూకుడుగా ఆడాడు.

సౌత్ జోన్ బౌలర్లలో త్రిపురణ విజయ్(4/180) నాలుగు వికెట్లు తీయగా.. చామ మిలింద్, శ్రేయస్ గోపాల్ రెండేసి వికెట్లు పడగొట్టారు. షేక్ రషీద్కు ఒక వికెట్ దక్కింది. సౌత్ జోన్ ప్రధాన పేసర్ మహమ్మద్ సిరాజ్ తేలిపోయాడు. 25 ఓవర్లు బౌలింగ్ చేసి ఒక వికెట్ తీయకపోగా.. 5.60 ఎకానమీతో 140 పరుగులిచ్చుకున్నాడు. అతని వైఫల్యం ఈస్ట్ జోన్కు కలిసొచ్చింది. దూకుడుగా ఆడిన ఆ జట్టు రెండు రోజుల పాటు పూర్తిగా బ్యాటింగ్ చేసి రికార్డ్ స్కోర్ అందుకుంది.
కష్టాల్లో సౌత్ జోన్..
మూడో రోజు తిలక్ వర్మ సారథ్యంలోని సౌత్ జోన్ బ్యాటింగ్కు దిగింది. అయితే ఆ జట్టుకు ఆశించిన ఆరంభం దక్కలేదు. ఓపెనర్లు రికీ భుయ్(1), నారయణ్ జగదీషన్(32), షేక్ రషీద్ తీవ్రంగా నిరాశపర్చారు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన దేవదత్ పడిక్కల్(62) హాఫ్ సెంచరీతోనే సరిపెట్టుకోవడంతో సౌత్ జోన్ 174 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. శ్రేయస్ గోపాల్(21 బ్యాటింగ్) కలిసి కెప్టెన్ తిలక్ వర్మ(47 బ్యాటింగ్) పోరాడుతున్నాడు. ఈ ఇద్దరిపైనే సౌత్ జోన్ ఆశలు ఆధారపడి ఉన్నాయి.
డ్రా అయితే టైటిల్ ఎవరికంటే..?
ఈ మ్యాచ్కు ఇంకా రెండు రోజుల ఆట మాత్రమే మిగిలి ఉంది. ఇషాన్ కిషన్ తరహాలో తిలక్ వర్మ కూడా భారీ శతకంతో రాణిస్తే.. ఈ మ్యాచ్ డ్రా అయ్యే అవకాశం ఉంది. ఇంకా రెండు రోజుల ఆటనే మిగిలి ఉండగా.. ఇరు జట్లు మరోసారి బ్యాటింగ్ చేయాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్ డ్రా అయితే టైటిల్ ఎవరికి ఇస్తారనేది అభిమానులకు సందేహంగా మారింది.
బీసీసీఐ రూల్స్ ప్రకారం.. దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ డ్రా అయితే.. తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యం సాధించిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. ఈ లెక్కన ఈస్ట్ జోన్కే అడ్వాంటేజ్ ఉంది. తొలి ఇన్నింగ్స్లో ఆ జట్టు 708 పరుగులు చేసింది. సౌత్ జోన్ ఆ స్కోర్ అందుకోవడం కష్టమే. ఒకవేళ వర్షం అంతరాయం కారణంగా సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్ పూర్తి చేయలేకపోతే.. ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


