మైదానంలోకి అడుగుపెడితే చాలు..ఎదురుగా ఉన్నది బుమ్రా అయినా,ట్రెంట్ బౌల్ట్ అయినా సరే..బంతి బౌండరీ దాటాల్సిందే.అదీ వైభవ్ సూర్యవంశీ స్టైల్.నిన్న ముంబై ఇండియన్స్తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్లో ఈ బీహార్ కుర్రాడు ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ చూసి క్రికెట్ ప్రపంచం నోరెళ్లబెట్టింది.కేవలం 14 బంతుల్లోనే 5 సిక్సర్లతో ముంబై బౌలర్ల పని పట్టిన వైభవ్ను చూసి అతని ఓపెనింగ్ పార్ట్నర్ యశస్వీ జైస్వాల్ ఆశ్చర్యపోయాడు.
మ్యాచ్ అనంతరం యశస్వీ జైస్వాల్ మాట్లాడుతూ వైభవ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు."వైభవ్ ఆడుతున్న తీరు నిజంగా అద్భుతం.అంత చిన్న వయసులో అంత పరిణతితో ఆడటం మామూలు విషయం కాదు. అతను పడుతున్న కష్టం, అతని డెడికేషన్ చూస్తుంటే నాకే మోటివేషన్ కలుగుతోంది. నిజం చెప్పాలంటే.. వైభవ్ షాట్లు చూశాక, నేను కూడా నా బ్యాటింగ్లో కొత్త రకమైన షాట్లను డెవలప్ చేసుకోవాలని అనిపిస్తోంది" అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు. ఒక స్టార్ ప్లేయర్ తన తోటి జూనియర్ గురించి ఇలా అనడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో వైభవ్ అస్సలు తగ్గలేదు. ముఖ్యంగా ప్రపంచ అత్యుత్తమ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో వరుసగా రెండు భారీ సిక్సర్లు బాది అందరినీ అవాక్కయ్యేలా చేశాడు. జైస్వాల్ (77*)ఒకవైపు క్లాస్ ఇన్నింగ్స్ ఆడితే, వైభవ్ (39) మాత్రం మాస్ విధ్వంసంతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరి జోడీ ఐదు ఓవర్లలోనే 80 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి రాజస్థాన్కు భారీ స్కోరు అందించింది.

ఒకప్పుడు గల్లీ క్రికెట్ ఆడే వయసులో ఇప్పుడు ఐపీఎల్ స్టేడియంలను షేక్ చేస్తున్న వైభవ్ సూర్యవంశీ.. టీమ్ ఇండియాకు దొరికిన మరో ఆణిముత్యం అనడంలో సందేహం లేదు. జైస్వాల్ లాంటి ఆటగాళ్లనే ఆలోచనలో పడేసిన ఈ 'వండర్ కిడ్' ప్రయాణం ఇంకా ఎన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.
గువహతిలోని బర్సపరా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 27 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 11 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది.యశస్వీ జైస్వాల్ 32 బంతుల్లో 77* పరుగులు (10 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసి అజేయంగా నిలిచాడు.వైభవ్ సూర్యవంశీ 14 బంతుల్లో 39 పరుగులు చేశాడు.

అనంతరం బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ 11 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది.151 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైని రాజస్థాన్ బౌలర్లు కట్టడి చేశారు.రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వంటి స్టార్ బ్యాటర్లు తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు.రాజస్థాన్ బౌలర్లలో సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, నాండ్రే బర్గర్ తలో రెండు వికెట్లు తీసి ముంబై నడ్డి విరిచారు.ఫలితంగా రాజస్థాన్ రాయల్స్ వరుసగా మూడో విజయం నమోదు చేసి ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.