వైభవ్ సూర్యవంశీ.. ఉరుకులాట ఉత్త చాట!
టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీపై దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్ కామెంటేటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉరుకులాట ఉత్త చాట అనే సామెతను గుర్తు చేశారు. ఓపిక లేకుంటే వేగంగా కనుమరుగవుతావని హెచ్చరించారు. చెన్నై వేదికగా సౌత్ జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ తీవ్రంగా నిరాశపర్చాడు. తొలి ఇన్నింగ్స్లో దూకుడుగా ఆడి 44 పరుగులు చేసిన వైభవ్.. అనవసర షాట్ ఆడి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు.
రెండో ఇన్నింగ్స్లోనూ అదే అత్యుత్సాహం ప్రదర్శించి మూల్యం చెల్లించుకున్నాడు. 16 బంతుల్లో ఓ ఫోర్ సాయంతో 8 పరుగులే చేసి స్టంపౌట్గా వెనుదిరిగాడు. అప్పటికే ఈస్ట్ జోన్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్(3) వికెట్ కోల్పోగా.. బాధ్యతాయుతంగా ఆడాల్సిన వైభవ్ సూర్యవంశీ.. త్రిపురణ విజయ్ బౌలింగ్లో స్టెప్ ఔటై బంతిని బలంగా కొట్టే ప్రయత్నం చేశాడు. కానీ టర్న్ అయిన బంతి వికెట్ కీపర్ చేతిలో పడగా..నారయణ్ జగదీషన్ ఎలాంటి తప్పిదం చేయకుండా స్టంపౌట్ చేశాడు.

సహనం లేకపోతే కష్టమే..
ఈ పేలవ షాట్ను చూసి కామెంటేటర్లు తీవ్ర అసహనానికి గురయ్యారు. సుదీర్ఘ ఫార్మాట్లో రాణించాలంటే సహనంతో ఉండటం నేర్చుకోవాలని గట్టిగా అరుస్తూ వైభవ్ సూర్యవంశీకి హితవు పలికారు. అభిమానులతో పాటు పలువురు క్రికెట్ విశ్లేషకులు సైతం వైభవ్ సూర్యవంశీపై విమర్శలు గుప్పించారు.
భారీ షాట్స్ ఆడటం ఎంత ముఖ్యమో.. సహనంతో ఉండటం కూడా అంతే ముఖ్యమని అభిప్రాయపడుతున్నారు. ఇషాన్ కిషన్, తిలక్ వర్మ బ్యాటింగ్ చూసి ఈ విషయాన్ని తెలుసుకోవాలని, లేదంటే వేగంగా ఈ సుదీర్ఘ ఫార్మాట్కు దూరం కావాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఈస్ట్ జోన్కు భారీ ఆధిక్యం..
242/6 ఓవర్నైట్ స్కోర్తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన సౌత్ జోన్.. తొలి ఇన్నింగ్స్లో 336 పరుగులకు ఆలౌటైంది. తిలక్ వర్మ(211 బంతుల్లో 9 ఫోర్లతో 99)శతకం చేజార్చుకోగా.. దేవదత్ పడిక్కల్(104 బంతుల్లో 4 ఫోర్లతో 62) హాఫ్ సెంచరీతో రాణించాడు. చామ మిలింద్(68 బంతుల్లో 7 ఫోర్లతో 43) పర్వాలేదనిపించాడు.
ఈస్ట్ జోన్ బౌలర్లలో ముఖేష్ కుమార్(3/62) మూడు వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ(2/42), ఖరైషి(2/99), శిఖర్ మోహన్ (2/67) రెండేసి వికెట్లు పడగొట్టారు. ఈస్ట్ జోన్కు తొలి ఇన్నింగ్స్లో 372 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. అయినా ఫాలో ఆన్ ఆడించకుండా ఈస్ట్ జోన్ బ్యాటింగ్కు దిగడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
ఈస్ట్ జోన్ రికార్డ్ స్కోర్..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 708 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్(334 బంతుల్లో 30 ఫోర్లు, 7 సిక్స్లతో 270)తో డబుల్ సెంచరీతో సత్తా చాటగా.. కుమార్ కుశాగ్ర(132 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్లతో 101) సెంచరీతో చెలరేగాడు.
శిఖర్ మోహన్(120 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 85), అభిమన్యు ఈశ్వరన్(86 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్తో 72) హాఫ్ సెంచరీలతో రాణించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


