Duleep Trophy 2026: గెలిపించిన వైభవ్ సూర్యవంశీ.. 13 ఏళ్ల తర్వాత ఫైనల్కు ఈస్ట్ జోన్!
ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలో ఇషాన్ కిషన్ సారథ్యంలోని ఈస్ట్ జోన్ ఫైనల్కు దూసుకెళ్లింది. మంగళవారం ముగిసిన సెమీఫైనల్లో సమష్టిగా రాణించిన ఈస్ట్ జోన్.. 4 వికెట్ల తేడాతో సెంట్రల్ జోన్ను ఓడించింది. టీమిండియా టీనేజ్ సెన్సేషన్, వైభవ్ సూర్యవంశీ(92, 40) విధ్వంసకర బ్యాటింగ్తో ఈస్ట్ జోన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
బౌలింగ్లో ముఖేష్ కుమార్(3/56, 4/44) సత్తా చాటాడు. దాంతో ఈస్ట్ జోన్ 13 ఏళ్ల తర్వాత దులీప్ ట్రోఫీ ఫైనల్కు దూసుకెళ్లింది. రెండు ఇన్నింగ్స్ల్లో వైభవ్ సూర్యవంశీనే టాప్ స్కోరర్గా నిలిచాడు. బ్యాటింగ్కు ప్రతికూలమైన వికెట్పై దూకుడైన బ్యాటింగ్తో ఈస్ట్ జోన్కు విజయాన్ని అందించాడు. రెండు జట్ల మధ్య ప్రధాన వ్యత్యాసం వైభవ్ సూర్యవంశీ బ్యాటింగే. 159 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఈస్ట్ జోన్.. 39.3 ఓవర్లలో 6 వికెట్లకు 162 పరుగులు చేసింది.

నిప్పులు చెరిగిన షమీ, ముఖేష్ కుమార్..
వైభవ్ సూర్యవంశీ(43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 40), కెప్టెన్ ఇషన్ కిషన్(41 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 39 నాటౌట్) రాణించారు. సెంట్రల్ జోన్ బౌలర్లలో హర్ష్ దూబే(4/53) నాలుగు వికెట్లు తీసినా ఫలితం లేకపోయింది. సారాన్ష్ జైన్, యశ్ ఠాకూర్ చెరో వికెట్ పడగొట్టారు. వైభవ్ విధ్వంసకర బ్యాటింగ్తో తొలి వికెట్కు 61 పరుగులు జోడించాడు. మహమ్మద్ షమీ విన్నింగ్ షాట్తో విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.
అంతకుముందు 45/3 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను కొనసాగించిన సెంట్రల్ జోన్.. రెండో ఇన్నింగ్స్లో 50.2 ఓవర్లలో 158 పరుగులకు కుప్పకూలింది. హర్ష్ దూబే(24) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈస్ట్ జోన్ బౌలర్లలో ముఖేష్ కుమార్(4/44) నాలుగు వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ(3/56) మూడు వికెట్లు పడగొట్టాడు. అభిజిత్ సర్కార్, అనుకుల్ రాయ్, ఖురైషి తలో వికెట్ తీసారు.
తృటిలో చేజారిన శతకం..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సెంట్రల్ జోన్.. 80.1 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. రింకూ సింగ్(88 బంతుల్లో 8 ఫోర్లతో 60) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. ఆర్య జుయల్(113 బంతుల్లో 6 ఫోర్లతో 46) హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. ఈస్ట్ జోన్ బౌలర్లలో ముఖేష్ కుమార్(3/56), అభిజిత్ సర్కార్(3/38) మూడేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ, మహమ్మద్ కౌనైన్ రెండేసి వికెట్లు తీసారు.
అనంతరం ఈస్ట్ జోన్ 57 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. వైభవ్ సూర్యవంశీ (81 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్లతో 92)తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. అభిమన్యు ఈశ్వరన్(69) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. వైభవ్ ఔటైన తర్వాత తొలి ఇన్నింగ్స్లో ఈస్ట్ జోన్ ఇన్నింగ్స్ పేకమేడలా కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్లో సెంట్రల్ జోన్ 158 పరుగులకు ఆలౌటైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

