10 వేల పరుగులు చేసిన నన్నే పక్కన పెట్టారు.. షమీ ఎంత!: గంగూలీ
దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్నా.. టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీని పట్టించుకోవడం లేదన్న విమర్శలపై క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందించాడు. మహమ్మద్ షమీని ఎవరూ పక్కన పెట్టలేదని, అతను ఇప్పటికే భారత్ తరఫున అత్యధిక మ్యాచ్లు ఆడాడని గుర్తు చేశాడు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజయానంతరం.. మళ్లీ భారత జట్టు తరఫున షమీ ఆడలేదు. దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్నా.. సెలెక్టర్లు పట్టించుకోవడం లేదు. యువ బౌలర్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో షమీ వంటి సీనియర్లను సెలెక్షన్ కమిటీ దూరం పెట్టింది. మరోవైపు షమీ మాత్రం తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నాడు. 13 ఏళ్ల తర్వాత ఈస్ట్ జోన్ దులీప్ ట్రోఫీని గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.
10 వేల పరుగుల చేసిన నన్నే పక్కన పెట్టారు
ఈ విషయంపై గంగూలీ మాట్లాడుతూ.. 'మహమ్మద్ షమీ దేశియ మ్యాచ్ల్లో నిలకడగా రాణిస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 10 వేల పైగా పరుగులు చేసిన నాకే ఏడాది పాటు జట్టులో చోటు దక్కలేదు. ఆ తర్వాత నేను పోరాడి తిరిగి వచ్చాను. ఇప్పుడు షమీని ఎందుకు ఎంపిక చేయడం లేదో నాకు తెలియదు. కానీ అతని సామర్థ్యంపై నాకు పూర్తి నమ్మకం ఉంది.'అని గంగూలీ బదులిచ్చాడు.

వచ్చే ఏడాది జరిగే 2027 వన్డే ప్రపంచకప్లో మహమ్మద్ షమీ ఆడుతాడా? అని ప్రశ్నించగా.. మెగా టోర్నీకి ఇంకా ఏడాది సమయం ఉందని, కాబట్టి అతను ఆడుతాడా? లేదా? అనేదానిపై ఇప్పుడే కచ్చితంగా ఏమీ చెప్పలేమని గంగూలీ బదులిచ్చాడు.
టెస్ట్ల్లోకి ఇషాన్ కిషన్
దులీప్ ట్రోఫీ ఫైనల్లో 350 పరుగులతో ఈస్ట్ జోన్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ ఇషాన్ కిషన్ను గంగూలీ ప్రత్యేకంగా కొనియాడాడు.'నేను ఇషాన్ కిషన్తో ఫోన్లో మాట్లాడాను. విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ, దులీప్ ట్రోఫీలతో సహా అన్ని ఫైనల్స్లోనూ అతను అద్భుతంగా ఆడాడు. యువ ఆటగాళ్లు టెస్ట్ మ్యాచ్ల్లో ఆడాలని కలలు కంటారు. ఇషాన్ కిషన్ కూడా త్వరలోనే భారత టెస్ట్ టీమ్లోకి రీఎంట్రీ ఇస్తాడని నేను ఆశిస్తున్నా'అని గంగూలీ చెప్పుకొచ్చాడు.
డ్రాగా ముగిసిన ఫైనల్..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఈస్ట్ జోన్ 708 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ ఇషాన్ కిషన్(270) డబుల్ సెంచరీతో సత్తా చాటగా.. కుమార్ కుశాగ్ర(101) సెంచరీతో సత్తా చాటాడు. అనంతరం సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 368 పరుగులే చేసింది. కెప్టెన్ తిలక్ వర్మ(99) తృటిలో శతకం చేజార్చుకోగా.. దేవదత్ పడిక్కల్(62) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.
372 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈస్ట్ జోన్.. రెండో ఇన్నింగ్స్లో 99.2 ఓవర్లలో 7 వికెట్లకు 388 పరుగులు వద్ద డిక్లేర్ చేసింది. ఖురైషి(116 నాటౌట్) అజేయ శతకంతో రాణించగా.. ఇషాన్ కిషన్(80), శిఖర్ మోహన్(52) హాఫ్ సెంచరీలతో రాణించారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని సౌత్ జోన్ ముందు 761 పరుగుల లక్ష్యం నమోదు కాగా.. ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు. దాంతో తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యం సాధించిన ఈస్ట్ జోన్ను విజేతగా ప్రకటించారు. 13 ఏళ్ల తర్వాత ఈస్ట్ జోన్ దులీప్ ట్రోఫీ టైటిల్ను సొంతం చేసుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


