వైభవ్ సూర్యవంశీ వయసు నా కెరీర్ అంత లేదు: మహమ్మద్ షమీ
టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీపై టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ ప్రశంసల జల్లు కురిపించాడు. తన కెరీర్ అంత వయసు లేకున్నా వైభవ్ సూర్యవంశీ దులీప్ ట్రోఫీ గెలిచాడని కొనియాడాడు. అతనికి ఎక్కువగా సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని, పోరాట స్ఫూర్తిని నింపితే సరిపోతుందని అభిప్రాయపడ్డాడు.
సౌత్ జోన్తో చెన్నై వేదికగా జరిగిన దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో ఈస్ట్ జోన్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ డ్రా అవడంతో తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యం సాధించిన ఈస్ట్ జోన్కు టైటిల్ వరించింది. దాంతో 13 ఏళ్ల నిరీక్షణకు ఇషాన్ కిషన్ సారథ్యంలోని ఈస్ట్ జోన్ తెరదించింది.

ఈ మ్యాచ్ మహమ్మద్ షమీకి 100వ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ కావడం విశేషం. 2010 నవంబర్ 17న ఫస్ట్ క్రికెట్లోకి షమీ అరంగేట్రం చేయగా.. వైభవ్ సూర్యవంశీ 2011 మార్చి 27న జన్మించాడు. షమీ అరంగేట్రం తర్వాత నాలుగు నెలలకు పుట్టిన వైభవ్.. దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్కు వైస్ కెప్టెన్గా వ్యవహరించి విజేతగా నిలిచాడు. ఈ విషయం గురించి మాట్లాడిన మహమ్మద్ షమీ.. వైభవ్ సూర్యవంశీని ప్రత్యేకంగా కొనియాడాడు.
నా కెరీర్ అంత లేదు అతని వయసు..
'ఈస్ట్ జోన్ జట్టులోని యువ ఆటగాళ్లకు మార్గదర్శకత్వం వహించడం చాలా ఆనందాన్నిచ్చింది. మా జట్టు తరఫున ఆడిన వైభవ్ సూర్యవంశీ వయసు.. నా ఫస్ట్ క్లాస్ కెరీర్ అంత కూడా లేదు. చిన్న పిల్లాడు అయిన అతనికి కచ్చితత్వం, విషయాలను త్వరగా అర్థం చేసుకునే సామర్థ్యం ఉన్నాయి.
ప్రస్తుత కాలంలో ఐపీఎల్ వంటి పెద్ద సిరీస్ల్లో ఆడటం వల్ల యువ ఆటగాళ్లు చాలా త్వరగా పరిణతి చెందుతారు. వారికి ఎక్కువ శిక్షణ అవసరం లేదు. ఆట కీలకమైనప్పుడు మాత్రమే మనం సలహాలు ఇచ్చి వారిలో పోరాట స్ఫూర్తిని నింపాలి.'అని మహమ్మద్ షమీ చెప్పుకొచ్చాడు.
దులీప్ ట్రోఫీలో 3 మ్యాచ్లు ఆడిన షమీ 7 వికెట్లు పడగొట్టాడు. 13 ఏళ్ల తర్వాత తన 100వ మ్యాచ్లో దులీప్ ట్రోఫీ గెలవడం చాలా సంతోషంగా ఉందని షమీ చెప్పుకొచ్చాడు. తీవ్రమైన ఎండలో కూడా అంకితభావంతో ఆడిన ఆటగాళ్లందర్నీ అతను ప్రత్యేకంగా ప్రశంసించాడు.
ఈస్ట్ జోన్దే ఆధిపత్యం..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఈస్ట్ జోన్ 708 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ ఇషాన్ కిషన్(270) డబుల్ సెంచరీతో సత్తా చాటగా.. కుమార్ కుశాగ్ర(101) సెంచరీతో సత్తా చాటాడు. అనంతరం సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 368 పరుగులే చేసింది. కెప్టెన్ తిలక్ వర్మ(99) తృటిలో శతకం చేజార్చుకోగా.. దేవదత్ పడిక్కల్(62) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.
372 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈస్ట్ జోన్.. రెండో ఇన్నింగ్స్లో 99.2 ఓవర్లలో 7 వికెట్లకు 388 పరుగులు వద్ద డిక్లేర్ చేసింది. ఖురైషి(116 నాటౌట్) అజేయ శతకంతో రాణించగా.. ఇషాన్ కిషన్(80), శిఖర్ మోహన్(52) హాఫ్ సెంచరీలతో రాణించారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని సౌత్ జోన్ ముందు 761 పరుగుల లక్ష్యం నమోదు కాగా.. ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు. దాంతో తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యం సాధించిన ఈస్ట్ జోన్ను విజేతగా ప్రకటించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


