భారత్పై ఘన విజయం.. ఇంగ్లండ్దే ఐసీసీ కిరీటం!
ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఐదు టీ20ల సిరీస్లో భాగంగా శనివారం సౌతాంప్టన్ వేదికగా ఏకపక్షంగా సాగిన ఆఖరి మ్యాచ్లోనూ టీమిండియా 56 పరుగుల తేడాతో చిత్తయ్యింది. మరోసారి ఆల్రౌండ్ ప్రదర్శనతో ఇంగ్లండ్ భారీ విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో భారత్ను వెనక్కినెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.
అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియాకు ఇది వరుసగా ఆరో పరాజయం. నయా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో 7 మ్యాచ్లు ఆడిన టీమిండియా ఒక్క విజయం సాధించలేకపోయింది. పసికూన ఐర్లాండ్తో రెండు టీ20ల సిరీస్లో క్లీన్ స్వీప్ అయిన భారత్.. ఇంగ్లండ్తో ఐదు టీ20ల సిరీస్లోనూ 4-0తో దాదాపు క్లీన్ స్వీప్ అయినట్లే. తొలి టీ20 వర్షంతో రద్దవ్వడంతో ఆ అప్రతిష్టను భారత్ తప్పించుకుంది. లేకుంటే ఆ మ్యాచ్లో కూడా ఓడి సిరీస్లో 5-0తో క్లీన్ స్వీప్ అయ్యేది.

శతక్కొట్టిన బట్లర్..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 257 పరుగుల భారీ స్కోర్ చేసింది. జోస్ బట్లర్(64 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్స్లతో 131) విధ్వంసకర శతకంతో చెలరేగగా..కెప్టెన్ హ్యారీ బ్రూక్(45 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్లతో 95 నాటౌట్) పరుగుల సునామీ సృష్టించాడు. భారత బౌలర్లలో శివమ్ దూబే(2/22) రెండు వికెట్లు తీయగా.. ప్రసిధ్ కృష్ణ ఒక వికెట్ పడగొట్టాడు.
అనంతరం భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 201 పరుగులు చేసి ఓటమిపాలైంది. ఇషాన్ కిషన్(35 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 56), తిలక్ వర్మ(25 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 53) హాఫ్ సెంచరీలతో రాణించినా ఫలితం లేకపోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కరణ్(3/36) మూడు వికెట్లు తీయగా.. ఆదిల్ రషీద్ రెండు వికెట్లు పడగొట్టాడు. జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్, లియామ్ డాసన్ తలో వికెట్ తీసారు. ఈ మ్యాచ్లో పిచ్ను అంచనా వేయడంలో విఫలమైన భారత్ భారీ మూల్యం చెల్లించుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం టీమిండియా కొంపముంచింది.
అభిషేక్ విఫలం..
258 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియాకు ఆశించిన శుభారంభం దక్కలేదు. ఓపెనర్ అభిషేక్ శర్మ(6) మరోసారి తీవ్రంగా నిరాశపర్చాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. వైభవ్ స్థానంలో జట్టులోకి తిరిగొచ్చిన సంజూ శాంసన్(27) 3 ఫోర్లు, 2 సిక్స్లతో జోరు కనబర్చాడు. కానీ అతన్ని సామ్ కరణ్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు.
దాంతో పవర్ ప్లేలో భారత్ 2 వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ దూకుడుగా ఆడి 8.5 ఓవర్లలోనే జట్టు స్కోర్ను 100 ధాటించారు. 55 పరుగుల భాగస్వామ్యంతో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని లియామ్ డాసన్ విడదీసాడు. శ్రేయస్ అయ్యర్(28)ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు.
ఇషాన్ మెరిసినా..
క్రీజులోకి తిలక్ వర్మ రాగా.. ఇషాన్ కిషన్ 27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే అతన్ని ఆదిల్ రషీద్ క్యాచ్ ఔట్గా బోల్తా కొట్టించాడు. క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే గోల్డెన్ డకౌటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అతను ఇచ్చిన క్యాచ్ను ఎక్స్ట్రా కవర్స్లో హ్యారీ బ్రూక్ వదిలేసాడు. కానీ అతను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 2 బౌండరీలు మాత్రమే బాది సామ్ కరణ్ బౌలింగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో భారత్ ఓటమి ఖాయమైంది.
సూర్యాన్ష్ షెడ్గేతో కలిసి తిలక్ వర్మ దూకుడుగా ఆడాడు. ఈ క్రమంలోనే అతను 24 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.కానీ ఆ మరుసటి బంతికే కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. సూర్యాన్ష్ క్యాచ్ ఔటవ్వగా.. అక్షర్ పటేల్(3) కూడా నిరాశపర్చాడు. ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్ మంగళవారం(జూలై 14) ప్రారంభం కానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

