టాస్ ఓటమి..
వరుస విజయాలతో దూకుడు మీదున్న భారత అమ్మాయిలకు ఫైనల్లో టాస్ గెలవకపోవడం కూడా ప్రతి కూలంగా మారింది. ముఖ్యంగా బ్యాటింగ్కు అనుకూలించే పిచ్పై.. అలాగే మెగాఫైనల్ ఒత్తిడి లేకుండా ఉండాలంటే తొలుత బ్యాటింగ్ చేయడం ఎంతో మేలు. కానీ టాస్ ఆసీస్ గెలవడంతో ఆ జట్టు బ్యాటింగ్కు దిగింది. సొంత మైదానంలో జరగడమే కలిసొచ్చే అంశం అంటే టాస్ కూడా గెలవడంతో వారి ఆత్మవిశ్వాసం మరింత పెరగగా.. భారత అమ్మాయిల నమ్మకం సన్నగిల్లింది. ఇది ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే స్పష్టమైంది.
భారత్ కల చెదిరింది.. మరోసారి విశ్వవిజేతగా ఆస్ట్రేలియా నిలిచింది!!
ఆసీస్ వ్యూహాలు..
ఇక టోర్నీ ప్రారంభ మ్యాచ్లోనే భారత్ చేతిలో ఖంగుతిన్న ఆస్ట్రేలియా.. టైటిల్ ఫైట్కు అన్ని విధాలుగా సంసిద్దమైంది. ముఖ్యంగా భారత బలం బౌలింగేనని, దానిపైనే దెబ్బకొట్టి విజయం సాధించాలనే ప్రణాళికతో బరిలోకి దిగి విజయం సాధించింది. తొలి మ్యాచ్లో స్పిన్ ఉచ్చులో చిక్కుకొని విలవిలాడిన ఆ జట్టు.. ఈ మ్యాచ్లో మాత్రం ప్రతీ బౌలర్పై మంచి వర్క్ చేసినట్లు కనిపించింది. వారు ఆడే షాట్లే ఈ విషయాన్ని తెలియజేశాయి. కామెంటేటర్లు కూడా పదే పదే ఈ విషయాన్ని ప్రస్తావించారు. ముఖ్యంగా పూనమ్ యాదవ్, రాధా యాదవ్, శిఖా పాండే బౌలింగ్పై క్రికెట్ అనలిస్ట్లతో బాగా చర్చించి ఓ ప్రణాళిక పరంగా బ్యాటింగ్కు దిగింది. ప్రత్యర్థి బలహీనత ఒత్తిడి గురువడమనే విషయాన్ని గ్రహించిన ఆసీస్ ఆ దిశగా ప్రయత్నించి ఫలితాన్ని రాబట్టింది. ముఖ్యంగా అటాకింగ్ మోడ్లో బ్యాటింగ్ చేస్తే భారత అమ్మాయిలు లయ తప్పుతారనే కాన్సెప్ట్తో బ్యాటింగ్కు దిగి ఫలితాన్ని రాబట్టింది.
సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్.. పాండ్యా, ధావన్ ఆగయా.. రోహిత్కు నో చాన్స్.. !!
భారత అమ్మాయిల అతి విశ్వాసం..
గ్రూప్-ఎ టాపర్ అనే హోదా.. లీగ్లో ఒకసారి ఓడించామనే అతివిశ్వాసమే భారత్ కొంప ముంచిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. లీగ్ మ్యాచ్ల్లో ఒకరిద్దరి ప్రదర్శనల ఆధారంగా.. ప్రత్యర్థుల బలహీనతల కారణంగానే గెలిచిన భారత అమ్మాయిలు.. వారి లోపాలపై మాత్రం దృష్టిసారించలేకపోయారు. ఫైనల్కు కావాల్సి హోం వర్క్ కూడా చేయలేకపోయారు. ప్రతీ కూల పరిస్థితుల్లో జట్టు అనుసరించాల్సిన వ్యూహాలు రచించడంలో కూడా టీమ్మేనేజ్మెంట్ దారుణంగా విఫలమైంది. ఫలితంగా హోరహోరీ తప్పదనుకున్న టైటిల్ ఫైట్ చప్పగా ఏకపక్షంగా ముగిసింది.
ఒత్తిడిని జయించకపోవడం..
ఒత్తిడిని జయించలేక ఒక సారి వన్డే వరల్డ్ కప్ ముంగిట బోల్తాపడిన భారత మహిళల జట్టు.. ఇంకోసారి సెమీఫైనల్లో వెనుదిరిగింది. అయినా ఆ దిశగా బలాన్ని పెంచుకోలేకపోయింది. మ్యాచ్కు ముందు.. స్వేచ్ఛగా ఆడి ఉత్తమ ప్రదర్శన ఇవ్వండని,ఎలాంటి ఒత్తిడినీ దరిచేరనీయకండని సచిన్ సూచించినా.. భారత జట్టు ఒత్తిడిని అధిగమించలేకపోయింది. ఆస్ట్రేలియా టాస్ గెలవగానే.. సగం ఒత్తిడికి లోనైనా భారత అమ్మాయిలు.. ఆసీస్ ఓపెనర్లు అలిసా, బెత్ మూనీ అటాకింగ్తో తీవ్ర ఒత్తిడిలోకి లోనయ్యారు. దీంతోనే క్యాచ్లు డ్రాప్ చేస్తూ.. మిస్ ఫీల్డ్లతో మ్యాచ్ చేజార్చుకున్నారు. అలాగే బౌలింగ్ విఫలమై.. భారీ స్కోర్ సమర్పించుకోగానే ఓడామనే భావనకు రావడం.. బ్యాటింగ్లో ధీటుగా బదులివ్వకపోవడం కూడా ఓటమికి కారణమయ్యాయి.