తిలక్ వర్మ.. గెలికి తన్నించుకోవడం అంటే ఇదే బ్రో!
దులీప్ ట్రోఫీ ఫైనల్లో తిలక్ వర్మ సారథ్యంలోని సౌత్ జోన్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ముందుగా బౌలింగ్లో విఫలమైన ఆ జట్టు.. ఆ తర్వాత బ్యాటింగ్లోనూ చేతులెత్తేసింది. దాంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 80 ఓవర్లలో 6 వికెట్లకు 242 పరుగులే చేసింది.
క్రీజులో తిలక్ వర్మ(133 బంతుల్లో 5 ఫోర్లతో 56 బ్యాటింగ్), సీవీ మిలింద్(2 బ్యాటింగ్) ఉన్నారు. ఈస్ట్ జోన్ బౌలర్లలో మహమ్మద్ షమీ(2/17), ముఖేష్ కుమార్(2/36) రెండేసి వికెట్లు తీయగా.. ఖరైషి, శిఖర్ మోహన్ తలో వికెట్ తీసారు. సౌత్ జోన్ ఇంకా 466 పరుగుల వెనుకంజలో ఉంది. అద్భుతం జరిగితే తప్పా ఈ మ్యాచ్లో సౌత్ జోన్ విజయం సాధించలేదు. ఓటమి తప్పించుకున్నా గొప్ప విషయమే. అయితే సౌత్ జోన్కు ఈ పరిస్థితికి రావడానికి కారణంగా కెప్టెన్ తిలక్ వర్మనేనని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.
షమీని రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ఈ ఫైనల్ మ్యాచ్కు ముందు జరిగిన మీడియా సమావేశంలో ఈస్ట్ జోన్ ప్రధాన పేసర్ మహమ్మద్ షమీని రెచ్చగొట్టేలా తిలక్ వర్మ మాట్లాడిన మాటలే సౌత్ జోన్ పతనాన్ని శాసించాయని అభిప్రాయపడుతున్నారు. షమీకి ధీటుగా బదులిస్తామని, అతని బౌలింగ్ను డీకోడ్ చేశామని ఆ మీడియా సమావేశంలో తిలక్ వర్మ పేర్కొన్నాడు.

'సీనియర్ పేసర్ మహమ్మద్ షమీని అడ్డుకునేందుకు సిద్ధంగానే ఉన్నాం. ఈ మ్యాచ్ రసవత్తరంగానే ఉండబోతుంది. గత మ్యాచ్లో షమీ ఎలా బౌలింగ్ చేశాడో మేం గమనించాం. బ్యాటర్లను ఇబ్బంది పెడుతూ లైన్ అండ్ లెంగ్త్తో కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తాడు. అతని బౌలింగ్ను ఎదుర్కొని సత్తా చాటుతాం.'అని తిలక్ వర్మ వ్యాఖ్యానించాడు.
రెచ్చిపోయిన షమీ..
ఇది మహమ్మద్ షమీకి 100వ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ కావడం విశేషం కాగా.. తిలక్ వర్మ రెచ్చగొట్టే వ్యాఖ్యలు అతనిలో కసిని పెంచాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దులీప్ ట్రోఫీ తొలి రెండు మ్యాచ్ల్లో షమీ అంత గొప్పగా ఏం రాణించలేదని, కానీ ఫైనల్లో మాత్రం కట్టడైన బౌలింగ్తో ఆకట్టుకున్నాడని గుర్తు చేస్తున్నారు.
షేక్ రషీద్(27), రవిచంద్రన్ స్మరణ్(23)లను ఔట్ చేసిన షమీ.. కీలక భాగస్వామ్యాలను విడదీసి సౌత్ జోన్పై దెబ్బ కొట్టాడు. అంతేకాకుండా 11 ఓవర్లు బౌలింగ్ చేసిన షమీ అందులో 4 ఓవర్లు మెయిడిన్ చేశాడు. 1.54 ఎకానమీతో పరుగులిచ్చి 2 వికెట్లు తీసాడు. అతని కట్టడైన బౌలింగ్.. ఇతర బౌలర్లకు వికెట్ దక్కేలా చేసింది. తిలక్ వర్మ.. షమీని రెచ్చగొట్టకపోయింటే బాగుండేదని, గెలికి మరీ తన్నించుకోవడం అంటే ఇదేనని విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈస్ట్ జోన్ భారీ స్కోర్..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 708 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్(334 బంతుల్లో 30 ఫోర్లు, 7 సిక్స్లతో 270)తో డబుల్ సెంచరీతో సత్తా చాటగా.. కుమార్ కుశాగ్ర(132 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్లతో 101) సెంచరీతో చెలరేగాడు. శిఖర్ మోహన్(120 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 85), అభిమన్యు ఈశ్వరన్(86 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్తో 72) హాఫ్ సెంచరీలతో రాణించారు.
వైభవ్ సూర్యవంశీ(37 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 44) దూకుడుగా ఆడాడు. సౌత్ జోన్ బౌలర్లలో త్రిపురణ విజయ్(4/180) నాలుగు వికెట్లు తీయగా.. చామ మిలింద్, శ్రేయస్ గోపాల్ రెండేసి వికెట్లు పడగొట్టారు. షేక్ రషీద్కు ఒక వికెట్ దక్కింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


