దూకుడు కంటే గెలుపు ముఖ్యం.. వైభవ్ సూర్యవంశీని మందలించిన మాథ్యూ హెడెన్!
దూకుడుగా ఆడటం కంటే జట్టును గెలిపించడం ముఖ్యమని రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ కోచ్ మాథ్యూ హెడెన్ చురకలంటించాడు. పవర్ ప్లేలో ఆడితే సరిపోదని, జట్టు విజయం కోసం ఆఖరి వరకు క్రీజులో ఉండే ప్రయత్నం చేయాలని మందలించాడు. ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన గుజరాత్ టైటాన్స్ 77 పరుగుల భారీ తేడాతో రాజస్థాన్ రాయల్స్ను చిత్తు చేసింది.
ఈ మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న మాథ్యూ హెడెన్ తమ టాప్-3 బ్యాటర్లపై ప్రశంసల జల్లు కురిపించాడు. వైభవ్ సూర్యవంశీలా దూకుడుగా ఆడలేకపోతున్నా.. 150 స్ట్రైక్రేట్తో నిలకడగా రాణిస్తున్నారని కొనియాడాడు. దూకుడు కంటే నిలకడైన ప్రదర్శనకే ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశాడు.
దూకుడు అవసరం లేదు..
ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ కేవలం 16 బంతుల్లోనే 36 పరుగులు చేశాడు. కానీ మూడో ఓవర్లోనే పెవిలియన్ చేరాడు. మరోవైపు గుజరాత్ ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ అర్ధ సెంచరీలు సాధించి 65 బంతుల్లో 118 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. గిల్ 17వ ఓవర్ వరకు క్రీజులో ఉండి 44 బంతుల్లో 84 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్లు ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ.. 200 ప్లస్ రన్స్ ఛేజింగ్లో చివరి వరకు బ్యాటింగ్ చేయడం కీలకమని మాథ్యూ హెడెన్ నొక్కి చెప్పాడు. శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్ 150 స్ట్రైక్రేట్తో ఆడుతున్నా.. టోర్నీ అంతటా మెరుగైన ప్రదర్శన కనబర్చారని గుర్తు చేశాడు.

వైభవ్ మంచి ఉదాహరణ..
'దూకుడు కంటే గెలుపు ముఖ్యం అనేదానికి ఈ రోజు వైభవ్ సూర్యవంశీ వంటి యువ ప్రతిభావంతుడి ప్రదర్శన ఓ మంచి ఉదాహరణ. అతను 300 స్ట్రైక్-రేట్తో 30 పరుగులు చేశాడు. కానీ 220 ప్లస్ రన్స్ ఛేజింగ్లో ఆఖరి వరకు బ్యాటింగ్ చేయాలి. మేం పొందిన ప్రయోజనం ఏంటంటే.. మా టాప్-3 ఆటగాళ్లు 150 స్ట్రైక్రేట్తో ఆడుతున్నా నిలకడగా రాణిస్తున్నారు.
ఇలా నిలకడగా రాణించడం చాలా కష్టమని ఓ బ్యాటర్గా నేను చెప్పగలను. కేవలం పవర్ప్లేలోనే మాత్రమే కాకుండా.. మ్యాచ్ చివరి సగం వరకు నిలకడగా ఆడుతున్నారు. వారు తమ శారీరక సామర్థ్యంతో టెస్ట్ మ్యాచ్-తరహా క్రికెట్, వన్డే క్రికెట్ను ఆడుతున్నారు.
మా బ్యాటర్ల నిలకడ అద్భుతం..
మా బ్యాటర్లు ఇన్నింగ్స్ను నిర్మించే విధానం నాకు చాలా నచ్చింది. ఈ రాత్రి లక్ష్యాన్ని నిర్దేశించడం మాకు భిన్నమైన సవాలు. 160 పరిధిలో మేం అనేక విజయాలు సాధించాం. వారంలో ఏ రోజునైనా మా బ్యాటింగ్ దాన్ని అధిగమించగలదని నేను విశ్వసిస్తున్నా. రాజస్థాన్ రాయల్స్ వంటి 'ఎక్స్-ఫాక్టర్' జట్టుపై విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ గెలుపు మాకు చాలా ముఖ్యం’అని హెడెన్ చెప్పుకొచ్చాడు.
ఈ సీజన్లో శుభ్మన్ గిల్ 160.41 స్ట్రైక్-రేట్తో, జోస్ బట్లర్ 151.96 స్ట్రైక్-రేట్తో రాణిస్తున్నారు. సాయి సుదర్శన్ 157.70 స్ట్రైక్-రేట్తో 440 పరుగులు చేశాడు. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో రెండవ స్థానానికి చేరుకోగా.. రాజస్థాన్ రాయల్స్ టాప్-4 ప్లేస్ గల్లంతయ్యింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

