
కవ్విస్తే ఖతమే..
భారత్తో మ్యాచ్ అంటే రెండు నిబంధనలు గుర్తుంచుకోవాలని క్రికెట్ దేశాలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అందులో మొదటిది భారత ఆటగాళ్ల జోలికి అస్సలు రాకూడదని, రెండోది ఈ విషయం ఏలాంటి పరిస్థితుల్లోనైనా మర్చిపోకూడదనే రెండు రూల్స్ ప్రతీ క్రికెట్ దేశం గుర్తుంచుకోవాలని తమ ఆటతోనే చాటి చెప్పింది.
నోరు ఉంది కదా అని భారత ఆటగాళ్లను గెలికితే ఫలితం లార్డ్స్ టెస్ట్ మాదిరే ఉంటుందని స్పష్టం చేసింది. గతంలో ఆస్ట్రేలియా జట్టు కూడా ఇదే తరహా కవ్వింపులతో మూల్యం చెల్లించుకొని రెండు సార్లు సొంతగడ్డపై సిరీస్ కోల్పోయింది. ఇప్పుడు ఇంగ్లండ్ కూడా అదే తరహా ప్రవర్తనతో గెలిచే మ్యాచ్లో ఓటమిపాలైంది.

కవ్వింపులే గెలిపించాయి..
లార్డ్స్ టెస్ట్లో భారత్ విజయానికి మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా వీరోచిత బ్యాటింగ్, మహమ్మద్ సిరాజ్ మ్యాచ్ విన్నింగ్ పెర్ఫామెన్స్, కేఎల్ రాహుల్ సెంచరీ, పుజారా, రహానే ఆపద్బాంధవ ఇన్నింగ్స్ కారణాలు కావచ్చు. కానీ ఓటమి అంచున చేరిన భారత్ ఆటగాళ్లలో గెలవాలనే కాంక్షను రగల్చింది మాత్రం ఇంగ్లండ్ ఆటగాళ్ల కవ్వింపులే.
వారి స్లెడ్జింగే భారత్ ఆటగాళ్లలో విజయం సాధించాలనే కసిని రగిల్చింది. లార్డ్స్ టెస్ట్ ఆసాంతం ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య మాటల యుద్దం నడిచింది. మూడో రోజుకు ఇది తారాస్థాయికి చేరుకుంది. ఇంగ్లండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్, భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మధ్య మొదలైన కవ్వింపులు.. ఆ తర్వాత రిషభ్ పంత్- జోరూట్ మధ్యకు చేరాయి. ఇక నాలుగో రోజు ఆదివారం ఆటలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అండర్సన్ మధ్య అగ్గి రాజుకుంది.

బుమ్రాపై స్లెడ్జింగ్..
చివరి రోజు బుమ్రా X మార్క్ వుడ్, బుమ్రా X జోస్ బట్లర్, మహమ్మద్ సిరాజ్ X మార్క్ వుడ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. షమీ, బుమ్రా బ్యాటింగ్ను సహించలేకపోయిన ఇంగ్లండ్ ఆటగాళ్లు నోరుపారేసుకున్నారు. కానీ ఈ స్లెడ్జింగ్ను భారత ఆటగాళ్లు సైతం అదే రీతిలో తిప్పికొట్టారు. మైదానంలో బుమ్రాను కవ్విస్తుంటే బాల్కనీలో భారత ఆటగాళ్లు అసహనానికి గురయ్యారు.
ఈ క్రమంలో భారత ఆటగాళ్లు సమష్టిగా రాణించి చిరస్మరణీయ విజయాన్నందుకున్నారు. 60 ఓవర్లలోనే ఇంగ్లండ్ను మట్టికరిపించారు. మ్యాచ్ అనంతరం భారత స్టార్ బ్యాట్స్మన్ కేఎల్ రాహుల్ మాట్లాడుతూ.. 'శ్రుతి మించని కవ్వింపులకు మేమేమీ వెనుకాడం. మీరు మాలో ఒకరి వెంట పడితే.. మేం మొత్తం 11 మందిమి మీ వెంట పడతాం'అని కవ్వింపుల పట్ల తమకున్న కమిట్మెంట్ తెలియజేశాడు.
కోహ్లీని రోహిత్ గట్టిగా పట్టుకున్నాడు.. వారి మధ్య విభేదాలున్నాయ్! పేలుతున్న సెటైర్స్!

స్లెడ్జింగ్తోనే బుమ్రా, షమీ జోరు..
ఇక మ్యాచ్ అనంతరం మాట్లాడిన కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం ఇంగ్లండ్ ఆటగాళ్ల కవ్వింపుల వల్లే జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ పట్టుదలగా పరుగులు చేశారన్నాడు. వారి స్లెడ్జింగ్తోనే 60 ఓవర్లలో ప్రత్యర్థిని ఆలౌట్ చేయాలని కాంక్ష రగిలిందన్నాడు. 'రెండో ఇన్నింగ్స్లో ఒత్తిడి పెరిగిన తర్వాత షమీ, బుమ్రా అద్భుతంగా ఆడారు. మేం ప్రత్యర్థిని 60 ఓవర్లలో ఆలౌట్ చేస్తామన్న నమ్మకం కలిగింది. రెండో ఇన్నింగ్స్లో మైదానంలో కవ్వింపులు, టెన్షన్ మాకు సాయం చేశాయి. కష్టాల్లో ఉన్నప్పుడు బుమ్రా, షమి నిలబడ్డ తీరు అద్భుతం. వారికి సెల్యూట్ చేస్తున్నా. వారితో కలిసి బ్యాటింగ్ కోచ్ ఎంతో శ్రమించారు. జట్టుకు మేలు చేయాలన్న కసి వారిలో రగిలింది. వారు చేసిన పరుగులకు విలువ కట్టలేం. లోయర్ ఆర్డర్ పరుగులు చేయడం లేదని కొన్నాళ్లుగా అంటున్నారు. ఇప్పుడు వారు పరుగులు చేయగలమని నిరూపించారు'అని కోహ్లీ పేర్కొన్నాడు.

షమీ అసాధారణ పోరాటం..
181/6 ఓవర్ నైట్ స్కోర్తో చివరి రోజు ఆటను కొనసాగించిన భారత్.. రెండో ఇన్నింగ్స్లో 298/8 వద్ద డిక్లేర్ చేసింది. మహమ్మద్ షమీ(70 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 56 నాటౌట్), జస్ప్రీత్ బుమ్రా(53 బంతుల్లో 2 ఫోర్లతో 36 నాటౌట్) 9వ వికెట్కు అజేయంగా 89 పరుగులు జోడించారు. దాంతో భారత్కు 271 పరుగుల ఆధిక్యం లభించింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్ 51.5 ఓవర్లలో 120 పరుగులకు ఆలౌటైంది. జోస్ బట్లర్(96 బంతుల్లో 25), జోరూట్(60 బంతుల్లో 33) పోరాడినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్(4/32) నాలుగు వికెట్లతో చెలరేగగా.. జస్ప్రీత్ బుమ్రా(3/33) మూడు, ఇషాంత్ శర్మ(2/13) రెండు వికెట్లు తీశారు. మహమ్మద్ షమీ(1/13) ఒక వికెట్ దక్కింది. ఈ విజయంతో ఐదు టెస్ట్ సిరీస్లో భారత్ 1-0తో బోణీ కొట్టింది. ఇరు జట్ల మధ్య మూడో టెస్ట్ ఆగస్టు 25న(బుధవారం) లీడ్స్ వేదికగా ప్రారంభమవుతోంది.


Click it and Unblock the Notifications












