
లండన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మొత్తానికి రివ్యూ ద్వారా ఫలితం సాధించాడు. ఇటీవల కాలంలో రివ్యూల విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న భారత కెప్టెన్.. తాజాగా తన ట్రేడ్ మార్క్ సారథ్యంతో అదరగొట్టాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో మరోసారి ఒంటెత్తు పోకడతో రివ్యూ తీసుకొని ఫలితం రాబట్టాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా ఇషాంత్ శర్మ వేసిన 21వ ఓవర్ చివరి బంతి జానీ బెయిర్ స్టో ప్యాడ్లను తాకింది. దాంతో భారత ఆటగాళ్లంతా గట్టిగా అప్పీల్ చేశారు. కానీ అంపైర్ మాత్రం నాటౌట్ ఇచ్చాడు. దాంతో కోహ్లీ రివ్యూ తీసుకుందామని చెప్పగా ఇతర ఆటగాళ్లంతా వద్దని వారించారు. బంతి.. బ్యాట్కు తగిలిందనే సందేహం వ్యక్తం చేశారు. కానీ తగలలేదని గట్టి విశ్వాసంతో ఎవరూ చెప్పిన వినకుండా రివ్యూ తీసుకున్నాడు.
తీరా రిప్లేలో బంతి బ్యాట్ను తాకలేదు. పైగా బాల్ ట్రాకర్లో మిడిల్ వికెట్ను హిట్ చేయడంతో అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకొని ఔటిచ్చాడు. దాంతో విరాట్ కోహ్లీ సంతోషానికి హద్దే లేకుండా పోయింది. ప్రపంచకప్ గెలిచినంత సంతోషం వ్యక్తం చేశాడు. ఇతర ఆటగాళ్లు సైతం కోహ్లీ నిర్ణయాన్ని సమర్థిస్తూ మెచ్చుకున్నారు. రోహిత్ శర్మ అయితే విరాట్ కోహ్లీని హగ్ చేసుకోని మరి అభినందించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియో వైరల్గా మారింది.
ఇక జానీ బెయిర్ స్టో వికెట్తో ఇంగ్లండ్ టీ సెషన్ ముగిసే సరికి 22 ఓవర్లలో 4 వికెట్లకు 67 పరుగులు చేసింది. బ్రేక్ అనంతరం కెప్టెన్ జోరూట్(33 బ్యాటింగ్) కూడా ఔటవ్వడంతో మ్యాచ్పై భారత్ పట్టు బిగించింది. భారత్ విజయానికి ఇంకా 5 వికెట్లు అవసరం కాగా.. ఇంగ్లండ్ 205 పరుగులు చేయాలి. ఓటమిని తప్పించుకొని డ్రాతో గట్టెక్కాలంటే ఇంకా సుమారు 35 ఓవర్లపాటు క్రీజులో నిలబడాలి. అంతకు ముందు 181/6 ఓవర్ నైట్ స్కోర్తో చివరి రోజు ఆటను కొనసాగించిన భారత్ రెండో ఇన్నింగ్స్లో 298/8 వద్ద డిక్లేర్ చేసింది. మహమ్మద్ షమీ(70 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 56 నాటౌట్), జస్ప్రీత్ బుమ్రా(53 బంతుల్లో 2 ఫోర్లతో 36 నాటౌట్) విరోచిత ఇన్నింగ్స్తో 9వ వికెట్కు అజేయంగా 89 పరుగులు జోడించారు. ఈ ఇద్దరి పోరాటంతో భారత్కు 271 పరుగుల ఆధిక్యం లభించింది.
అనంతరం 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్కు ఆదిలోనే గట్టిషాక్ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ రోరీ బర్న్స్(0)ను బుమ్రా డకౌట్గా పెవిలియన్ చేర్చాడు. టాప్ ఎడ్జ్ తీసుకున్న బంతి ఫార్వార్డ్ ఫీల్డర్ సిరాజ్ చేతిలో పడింది. షమీ వేసిన మరుసటి ఓవర్లో మరో ఓపెనర్ డామ్ సిబ్లీ(0) కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. దాంతో టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఇండియాపై ఇంగ్లండ్ ఓపెనర్లిద్దరూ ఖాతా తెరవకుండా తొలిసారి పెవిలియన్ చేరారు. ఆ తర్వాత షమీ బౌలింగ్లో హసీబ్ అహ్మద్ ఇచ్చిన సునాయస క్యాచ్ను స్లిప్లో రోహిత్ శర్మ నేలపాలు చేశాడు. అయితే ఇషాంత్ శర్మ అతన్ని ఎల్బీగా పెవిలియన్ చేర్చడంతో హిట్ మ్యాన్ ఊపిరి పీల్చుకున్నాడు. ఆ తర్వాత బెయిర్ స్టో ఎల్బీ కాగా.. జోరూట్.. బుమ్రా బౌలింగ్లో కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు.