IND vs PAK: రఫ్ఫాడించిన తెలుగు తేజం.. పాకిస్థాన్పై భారత్ ఘన విజయం!
మహిళల ఆసియా కప్ 2026 టోర్నీలో భారత్ జోరు కొనసాగుతోంది. దాయాదీ పాకిస్థాన్తో శనివారం జరిగిన ఏకపక్ష మ్యాచ్లో సమష్టిగా రాణించిన భారత్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. భారత్ స్పిన్ త్రయం శ్రీచరణి, దీప్తి శర్మ, ప్రేమ రావత్ ధాటికి పాకిస్థాన్ విలవిలలాడింది. 55 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. హైఓల్టేజ్ మ్యాచ్ అని భావించిన అభిమానులకు తీవ్ర నిరాశే ఎదురైంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 18.1 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు మునీబా అలీ( 15 బంతుల్లో ఫోర్తో 13), షవాల్ జుఫికర్(14 బంతుల్లో 3 ఫోర్లతో 14) మినహా అంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. నలుగురు బ్యాటర్లు ఖాతా తెరవలేకపోయారు. భారత బౌలర్లలో తెలుగు తేజం శ్రీచరణి(3/7), ప్రేమ రావత్(3/9) మూడేసి వికెట్లతో పాకిస్థాన్ పతనాన్ని శాసించారు. దీప్తి శర్మ(2/5) రెండు వికెట్లు పడగొట్టగా.. షెఫాలీ వర్మ ఒక వికెట్ తీసింది.
అనంతరం భారత్.. 8.4 ఓవర్లలో 3 వికెట్లకు 57 పరుగులు చేసి 68 బంతులు మిగిలి ఉండగానే గెలుపొందింది. షెఫాలీ వర్మ(6 బంతుల్లో ఫోర్, సిక్స్తో 12), ప్రతికా రావల్(3 బంతుల్లో ఫోర్తో 4), స్మృతి మంధాన(11 బంతుల్లో 2 ఫోర్లతో 9) విఫలమైనా.. హర్మన్ప్రీత్ కౌర్(18 బంతుల్లో ఫోర్, సిక్సర్తో 18 నాటౌట్), దీప్తి శర్మ(14 బంతుల్లో ఫోర్తో 12 నాటౌట్) జట్టుకు విజయాన్ని అందించారు. పాకిస్థాన్ బౌలరల్లో ఫాతిమా సనా(3/17) మూడు వికెట్లు పడగొట్టింది. ఇప్పటికే భారత్ సెమీఫైనల్ చేరగా.. పాకిస్థాన్ తమ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. హాంగ్ కాంగ్తో జరిగే ఆఖరి మ్యాచ్లో భారీ తేడాతో విజయం సాధిస్తే పాకిస్థాన్కు సెమీస్ బెర్త్ దక్కుతుంది.

పాక్ విలవిల
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన పాకిస్థాన్ తమ ఇన్నింగ్స్ను మెరుగ్గానే ప్రారంభించింది. ఓపెనర్లు మునీబ్ అలీ, షావజల్ జుఫికర్ బౌండరీలతో జోరు కనబర్చారు. మునీబ్ అలీ(13)ని షెఫాలీ వర్మ క్లీన్ బౌల్డ్ చేయడంతో పాకిస్థాన్ పతనం మొదలైంది. వరుసగా ఆ జట్టు వికెట్లు కోల్పోయింది. క్రీజులోకి వచ్చిన గుల్ ఫెరోజా(0)ను శ్రీచరణి క్లీన్ బౌల్డ్ చేయగా.. అదే ఓవర్ ఆఖరి బంతికి దూకుడుగా ఆడుతున్న జుల్ఫీకర్ ఎల్బీగా పెవిలియన్ చేరింది. దాంతో పాకిస్థాన్ పవర్ ప్లేలో 3 వికెట్లు కోల్పోయి 29 పరుగులే చేసింది.
తన మరుసటి ఓవర్లో ఆయేషా జఫర్(2)ను శ్రీచరణి క్యాచ్ ఔట్ చేసింది. సదాఫ్ షమాస్(3) ప్రేమ రావత్ క్లీన్ బౌల్డ్ చేయగా.. కెప్టెన్ ఫాతిమా సనా(0)ను దీప్తిశర్మ డకౌట్గా పెవిలియన్ చేర్చింది. ఐమాన్ ఫాతిమా(5)ను ఫుల్మాలి రనౌట్ చేయగా.. ఉమ్మ్-ఈ-హాని(6)ని ప్రేమ్ రావత్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చింది. ఆ వెంటనే నష్రా సంధు(0)ను కీపర్ క్యాచ్గా వెనక్కిపంపింది. టుబా హసన్ను దీప్తి శర్మ స్టంపౌట్ చేయడంతో పాకిస్థాన్ ఇన్నింగ్స్ ముగిసింది. బంతి గింగిరాలు తిరగడంతో పాకిస్థాన్ బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు.
భారత్కు షాకిచ్చిన సనా..
స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ ఇన్నింగ్స్ను భారీ సిక్సర్తో షెఫాలీ వర్మ ప్రారంభించింది. దాంతో పవర్ ప్లేలోనే భారత్ విజయం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా బిగ్ షాకిచ్చింది. జోరు మీదున్న షెఫాలీ వర్మ(12)ను రిటర్న్ క్యాచ్తో పెవిలియన్ చేర్చింది. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన ప్రతికా రావల్(4)ను కీపర్ క్యాచ్గా వెనక్కి పంపింది.
తన మరుసటి ఓవర్లో డేంజరస్ స్మృతి మంధానా(9)ను వికెట్ల ముందు బోల్తా కొట్టించింది. పవర్ ప్లేలోనే భారత్ 29 పరుగులకే మూడు వికెట్లు కోల్పోవడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. లక్ష్యం చిన్నది కావడంతో ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా హర్మన్ ప్రీత్ కౌర్, దీప్తి శర్మ ఆచితూచి ఆడి విజయలాంఛనాన్ని పూర్తి చేశారు. హర్మన్ప్రీత్ వరుసగా 4, 6 బాది మ్యాచ్ను ముగించడం గమనార్హం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


