గంభీర్ పదవికి ముప్పు..! టీమిండియా వైఫల్యంపై బీసీసీఐ సీరియస్
ఇంగ్లండ్ పర్యటనలో వరుస పరాజయాలతో టీమిండియా సతమతమవుతోంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ విజయానంతరం బరిలోకి దిగిన తొలి రెండు సిరీస్ల్లో టీమిండియా ఓటమిపాలైంది. దాదాపు ఏడేళ్ల తర్వాత టీమిండియా వరుసగా రెండు టీ20 సిరీస్లు కోల్పోవడం ఇదే తొలిసారి.
పసికూన ఐర్లాండ్తో రెండు టీ20ల సిరీస్లో క్లీన్ స్వీప్ అయిన టీమిండియా.. తాజాగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-0తో కోల్పోయింది. పేలవ బ్యాటింగ్, చెత్త బౌలింగ్తో టీమిండియా మూల్యం చెల్లించుకుంది. దాంతో టీమిండియా ప్రదర్శనపై బీసీసీఐ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.
గంభీర్ పనితీరుపై బీసీసీఐ సమీక్ష..
నయా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో టీమిండియా ఇప్పటి వరకు ఒక్క విజయం కూడా నమోదు చేయలేదు. వరుసగా 6 మ్యాచ్ల్లో 5 పరాజయాలను మూటగట్టుకుంది. భారత టీ20 క్రికెట్ చరిత్రలోనే వరుసగా 5 మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ గెలవకపోవడం ఇదే తొలిసారి.

సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో వరుసగా 13 సిరీస్లు గెలిచిన టీమిండియా ఇప్పుడు ఒక్క మ్యాచ్ గెలిచేందుకు ఇబ్బంది పడుతుంది. వరుస పరాజయాల నేపథ్యంలో ఆటగాళ్లతో పాటు కోచింగ్ స్టాఫ్ పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
కాంట్రాక్ట్ను కుదించే అవకాశం..
హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కాంట్రాక్ట్ 2027 వరకు ఉన్నప్పటికీ..ప్రస్తుత పరాజయాల నేపథ్యంలో అతని స్థానంపై కూడా బోర్డు పునరాలోచన చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికిప్పుడు అతని పదవికి వచ్చే ముప్పు లేనప్పటికీ.. ఈ వైఫల్యాలు ఇలానే కొనసాగితే అతని కాంట్రాక్ట్ను కుదించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
వరల్డ్ కప్ అందించిన సూర్యకుమార్ యాదవ్ను పక్కనపెట్టి అయ్యర్కు సారథ్య బాధ్యతలు అప్పగించిన బీసీసీఐ.. కుర్రాళ్లతో కూడిన టీమ్ ట్రాన్సిషన్ ఫేజ్లో ఉందని అర్థం చేసుకుంటుంది. కానీ వరుస పరాజయాలకు అదే కారణమని చెప్పడం సరికాదనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఫలితాలే ముఖ్యం..
'టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ ఆడిన జట్టుతో పోల్చితే ప్రస్తుత జట్టులో చాలా మార్పులు ఉన్నాయి. అది కెప్టెన్ కావచ్చు. ఓపెనర్ బ్యాటర్ కావచ్చు. హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాలు కూడా జట్టులో లేరు. టీమ్ను రిసెట్ చేసేటప్పుడు ఫలితాలు రావడానికి కాస్త సమయం పడుతుంది.
15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్ చేయడం, ప్రిన్స్ యాదవ్స్ తన రెండో టీ20 మాత్రమే ఆడటం, హర్షిత్ రాణా గాయం నుంచి కోలుకొని బరిలోకి దిగడం కనిపిస్తోంది. మేం చివరికి ఫలితాలే చూస్తాం. అంతర్జాతీయ క్రికెట్లో ఫలితాలే ముఖ్యం. కానీ మేం కూడా కాస్త ప్రాక్టికల్గా కూడా ఉండాలి.'అని ఓ బీసీసీఐ అధికారి మీడియాతో అన్నాడు.
కండిషన్స్కు తగ్గట్లు ఆడాలి..
ప్రతీ బంతిని భారీ షాట్ ఆడే ప్రయత్నం చేస్తున్న వైభవ్ సూర్యవంశీ, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ పట్ల బీసీసీఐ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరి బ్యాటింగ్ను నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రతీ బంతిని బాదకుండా..కండిషన్స్కు తగ్గట్లు ఆడాలని, మ్యాచ్ పరిస్థితులను అర్థం చేసుకోవాలని బీసీసీఐ కోరుకుంటుంది. వైస్ కెప్టెన్ తిలక్ వర్మపై కూడా సెలెక్టర్లు ఓ కన్నేసినట్లు తెలుస్తోంది. ఈ సిరీస్లో అతను పెద్దగా ప్రభావం చూపలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

