రోహిత్, కోహ్లీ నుంచి ఆశిస్తోంది అదొక్కటే.. అతని ఎంపిక సరైనదే: ఆకాష్ చోప్రా
టీమిండియా వెటరన్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల నుంచి పరుగులను మాత్రమే ఆశిస్తున్నామని మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా అన్నాడు. 2027 వన్డే ప్రపంచకప్కు ఏడాది మాత్రమే ఉండటంతో.. ఈ ఇద్దరు సీనియర్ బ్యాటర్లు నిలకడగా రాణించడం కీలకమని అభిప్రాయపడ్డాడు. రోహిత్, కోహ్లీ ఫామ్లోకి వస్తే మ్యాచ్లను సునాయసంగా గెలిపించగలరని పేర్కొన్నాడు.
సొంతగడ్డపై వెస్టిండీస్తో మూడు వన్డేల సిరీస్కు ఎంపిక చేసిన భారత జట్టుపై కూడా ఆకాష్ చోప్రా ప్రశంసల జల్లు కురిపించాడు. శుభ్మన్ గిల్ సారథ్యంలోని 15 మంది సభ్యులతో కూడిని ఈ జట్టులో రోహిత్, కోహ్లీ చోటు దక్కించుకున్నారు. ఆసియా గేమ్స్ 2026 కోసం శ్రేయస్ అయ్యర్ ఈ సిరీస్ దూరం కాగా.. కేఎల్ రాహుల్కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు దక్కాయి.
టీమ్ సెలెక్షన్ బాగుంది..
ఈ జట్టు ఎంపికపై ఆకాష్ చోప్రా సంతృప్తి వ్యక్తం చేశాడు. 'అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో మంచి జట్టును ఎంపిక చేశారు. రిషబ్ పంత్ స్థానంలో రెండో వికెట్ కీపర్గా ధ్రువ్ జురెల్ను తీసుకోవడం నాకు బాగా నచ్చింది. రవీంద్ర జడేజా కూడా వన్డే జట్టులోకి తిరిగి వచ్చాడు. ఆసియా గేమ్స్ నుంచి నితీశ్ కుమార్ రెడ్డిని తప్పించి వన్డే జట్టులోకి తీసుకోవడం కూడా బాగుంది. హార్దిక్ పాండ్యా అందుబాటులో లేని పరిస్థితుల్లో బౌలింగ్తో పాటు బ్యాటింగ్ చేయగల ఆటగాడు జట్టుకు అవసరం.

ఆల్రౌండర్ల స్థానాల్లో పోటీ కూడా ఆసక్తికరంగా ఉంటుంది. అయితే అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ముగ్గురిలో అందరికీ 2027 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కకపోవచ్చు. ప్రతి అవకాశాన్ని ఆటగాళ్లు సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది.'అని ఆకాష్ చోప్రా చెప్పుకొచ్చాడు.
వన్డేల్లో పంత్కు చోటు లేనట్లే..
వన్డేల్లో రిషభ్ పంత్కు దాదాపు చోటు లేనట్లేనని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. 'రిషభ్ పంత్ టెస్టు క్రికెట్ ఆడుతున్నాడు. రెడ్ బాల్ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. కానీ వైస్ కెప్టెన్సీ బాధ్యతలను తొలగించారు. వన్డే క్రికెట్ విషయానికి వస్తే.. మ్యాచ్లు ఆడకుండానే అతనికి దాదాపు వీడ్కోలు పలికినట్టుగా ఉంది.
ఈ సమయంలో ఇరానీ కప్లో రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టుకు పంత్ను కెప్టెన్గా నియమించారు. దీన్ని బట్టి టెస్టు క్రికెట్లో రిషభ్ పంత్ను కీలక పాత్రలో చూడాలనే ఆలోచన స్పష్టంగా కనిపిస్తోంది. కానీ వైట్ బాల్ క్రికెట్ విషయానికి వస్తే.. ప్రస్తుత సెలెక్షన్ కమిటీ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిందని అనిపిస్తోంది' అని ఆకాష్ చోప్రా వ్యాఖ్యానించాడు.
సెప్టెంబర్ 27 తొలి వన్డే..
వెస్టిండీస్తో తొలి వన్డే సెప్టెంబర్ 27న తిరువనంతపురంలో జరగనుండగా.. రెండో వన్డే సెప్టెంబర్ 30న గువాహటిలో, మూడో వన్డే అక్టోబర్ 3న చండీగఢ్లో జరగనుంది. ఓవైపు ఈ సిరీస్ జరుగుతుండగానే మరోవైపు జపాన్ వేదికగా శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత టీ20 జట్టు మ్యాచ్లు ఆడనుంది. దాంతోనే వన్డే జట్టులో చాలా మార్పులు జరిగాయి. ఆకీబ్ నబీ, నమన్ ధీర్ వంటి ఆటగాళ్లకు తొలిసారి టీమిండియా పిలుపు దక్కగా.. మహమ్మద్ సిరాజ్, రుతురాజ్ గైక్వాడ్, జడేజా వంటి ప్లేయర్లు సుదీర్ఘ విరామం తర్వాత భారత వన్డే జట్టులోకి రీఎంట్రీ ఇచ్చారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


