అందుకే రజత్ పాటిదార్కు అవకాశం ఇవ్వడం లేదు: ఆకాశ్ చోప్రా
అంతర్జాతీయ టీ20ల్లో వరల్డ్ ఛాంపియన్ టీమిండియా పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. వరుసగా మూడు మ్యాచ్ల్లో ఓటమిపాలైంది. పసికూన ఐర్లాండ్ చేతిలో రెండు టీ20ల సిరీస్ను కోల్పోయిన భారత్.. ఇంగ్లండ్ గడ్డపై అదే పేలవ ప్రదర్శనను కొనసాగించింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 విజయానంతరం నయా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో టీమిండియా నాలుగు మ్యాచ్లు ఆడి ఒక్క విజయం సాధించలేకపోయింది.
ఈ వరుస పరాజయాలతో టీమిండియా కాంబినేషన్పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) కెప్టెన్ రజత్ పాటిదార్ను టీమిండియాలోకి తీసుకోవాలని ఇర్ఫాన్ పఠాన్ వంటి మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. అయితే రజత్ పాటిదార్ను టీమిండియాలోకి తీసుకునే అవకాశం లేదని మరో మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. జట్టులో అతను ఆడేందుకు ఖాళీ ప్లేస్ లేదని చెప్పాడు.
రజత్ పాటిదార్కు చోటు కష్టం..
ప్రస్తుత టీమ్ కాంబినేషన్ కారణంగానే రజత్ పాటిదార్ను సెలెక్టర్లు పట్టించుకోవడం లేదని అభిప్రాయపడ్డాడు. తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన ఆకాశ్ చోప్రా.. రజత్ పాటిదార్ను ఆడించాలంటే ప్రస్తుతం మిడిలార్డర్లో ఆడుతున్న ఏ ఆటగాడినైనా జట్టు నుంచి తొలగించాలని అన్నాడు.
'టీమిండియా మిడిలార్డర్ ఇప్పటికే సెట్ అయ్యి ఉంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానంలో ఆడుతుంటే.. వైస్ కెప్టెన్ తిలక్ వర్మ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నాడు. శివమ్ దూబే ఆరోస్థానంలో ఆడుతున్నాడు. కెప్టెన్, వైస్ కెప్టెన్ను తొలగించకూడదనుకుంటే.. రజత్ పాటిదార్ కోసం శివమ్ దూబేను తప్పించాలి. రజత్ పాటిదార్ కోసం శివమ్ దూబేను తప్పించాలా?

ఎవరో ఒకరిని తప్పించాలి..
రజత్ పాటిదార్కు అవకాశం రాదని నేను చెప్పడం లేదు. కానీ వెంటనే అతనికి చోటు దక్కే పరిస్థితి అయితే లేదు. అతనికి కూడా సమయం వస్తుంది. రజత్ పాటిదార్ మళ్లీ భారత్ తరఫున ఆడుతాడు. కానీ ఆ సమయం ఇప్పుడే రావాలంటే మాత్రం.. జట్టులో ఎవరో ఒకరిని బయట కూర్చోబెడితేనే సాధ్యమవుతుంది.’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.
భారత్ తరఫున వన్డే, టెస్ట్ క్రికెట్ ఆడిన రజత్ పాటిదార్కు టీ20ల్లో మాత్రం ఇప్పటి వరకు అవకాశం దక్కలేదు. 2023లో సౌతాఫ్రికాతో వన్డే సిరీస్కు తొలి సారి ఎంపికైన రజత్ పాటిదార్.. ఆ సీరిస్లో ఏకైక మ్యాచ్ ఆడి 22 పరుగులు చేశాడు. 2024లో ఇంగ్లండ్తో సొంతగడ్డపై జరిగిన టెస్టు సిరీస్లో అరంగేట్రం చేసిన రజత్ పాటిదార్.. ఆరు ఇన్నింగ్స్ల్లో 63 పరుగులే చేసి జట్టులో చోటు కోల్పోయాడు.
వరుసగా రెండు టైటిళ్లు గెలిచినా..
ఐపీఎల్లో మాత్రం ఆటగాడిగా.. కెప్టెన్గా రజత్ పాటిదార్ సత్తా చాటుతున్నాడు. అతని సారథ్యంలో ఆర్సీబీ వరుసగా రెండు సీజన్లలో విజేతగా నిలిచింది. ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ను ఓడించి తొలి టైటిల్ ముద్దాడిన ఆర్సీబీ.. ఇటీవల ముగిసిన సీజన్ ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ను మట్టికరిపించి టైటిల్ నిలబెట్టుకుంది.
ఈ సీజన్లో రజత్ పాటిదార్ 14 ఇన్నింగ్స్ల్లో 501 పరుగులు చేశాడు. 192.69 స్ట్రైక్రేట్తో 42 సిక్సర్లు, 30 ఫోర్లు బాదాడు. ముఖ్యంగా మిడిలార్డర్లో విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగడం రజత్ పాటిదార్ ప్రత్యేకం. ఐపీఎల్లో అద్భుతంగా రాణించినా భారత్ తరఫున టీ20 క్రికెట్ ఆడే అవకాశం మాత్రం రజత్ పాటిదార్కు దక్కలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

