US Open 2020: సెమీస్కు సెరెనా, ఒసాక.. ఆ వీడియోలు చూసి భావోద్వేగానికి గురైన జపాన్ స్టార్!

న్యూయార్క్: ఎన్నాళ్లుగానో ఊరిస్తున్న 24వ గ్రాండ్స్లామ్ కల నెలవేర్చుకునేందుకు అమెరికా లెజెండ్ సెరెనా విలియమ్స్ మరో రెండు అడుగుల దూరంలో నిలిచింది. అదిరిపోయే ఆటతో వరుసగా 11వ సారి యూఎస్ ఓపెన్లో సెమీస్ చేరింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో సెరెనా 4-6, 6-3, 6-2తో పిరొంకోవా (బల్గేరియా)పై నెగ్గింది. తొలి సెట్ ఆరంభం నుంచే పిరొంకోవా ధాటిగా ఆడింది. సెరెనా సర్వీస్ను బ్రేక్ చేసిన బల్గేరియా ప్లేయర్ 3-2తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 5-3తో ఉన్నప్పుడు రెండుసార్లు సెట్ పాయింట్లు చేజార్చుకున్నా.. పదో గేమ్ నెగ్గి తొలి సెట్ను దక్కించుకుంది. ఇక రెండో సెట్ తొలి గేమ్లోనే సెరెనా సర్వీ్సను బ్రేక్ చేసిన పిరొంకోవా 1-0 ఆధిక్యంలో నిలిచింది. కానీ, తర్వాతి నుంచి విజృంభించిన విలియమ్స్ 6-3తో రెండో సెట్ను సొంతం చేసుకొంది. నిర్ణాయక మూడో సెట్లో మరింత దూకుడు పెంచిన సెరెనా 6-2తో నెగ్గి మ్యాచ్ను సొంతం చేసుకొంది. మ్యాచ్లో సెరెనా మొత్తం 11 ఏస్లు సంధించింది.

ఒసాకా అలవోకగా...
కెరీర్లో మూడో గ్రాండ్స్లామ్ టైటిల్పై గురి పెట్టిన జపాన్ క్రీడాకారిణి నవోమి ఒసాక సెమీఫైనల్ చేరింది. మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో నాలుగో సీడ్ ఒసాక 6-3, 6-4తో షెల్బీ రోజర్స్ (అమెరికా)ను వరుస సెట్లలో ఓడించింది. కెరీర్లో తొలిసారి గ్రాండ్స్లామ్ సెమీస్ చేరిన అమెరికా అన్సీడెడ్ ప్లేయర్ జెన్నిఫర్ బ్రాడీతో ఒసాక అమీతుమీ తేల్చుకోనుంది. మొత్తం ఏడు ఏస్లు కొట్టిన ఒసాక..24 విన్నర్లు సంధించింది. మరో మ్యాచ్లో బ్రాడీ 6-3, 6-2తో యూలియా పుతిన్త్సెవా (కజకిస్థాన్)పై అలవోకగా నెగ్గింది. టోర్నీలో బ్రాడీ ఇప్పటిదాకా ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం విశేషం.

ఒసాక భావోద్వేగం..
జాతి వివక్ష, సామాజిక న్యాయంపై ప్రజా చైతన్యం కోసం తనవంతు కృషి చేస్తున్న ఒసాకకు బాధిత కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపుతున్నాయి. పోలీసుల కాల్పులో మరణించిన నల్లజాతీయుడి పేరున్న మాస్క్లను మ్యాచ్ల సందర్భంగా నవోమి ధరిస్తున్న విషయం తెలిసిందే. క్వార్టర్స్ మ్యాచ్ సందర్భంగా ఇటీవల మరణించిన అహ్మౌద్ ఆర్బెరీ, ట్రేవన్ మార్టిన్ కుటుంబాలు ఒసాకాకు వీడియో సందేశాన్ని పంపాయి. మృతులకు ఆమె ఇస్తున్న గౌరవానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపాయి. ఆ సందేశం చూసిన ఒసాక తీవ్ర భావోద్వేగానికి గురైంది. వర్ణ వివక్షపై అవగాహన కోసం తాను చేస్తున్న ప్రయత్నం ఇదని ఆమె చెప్పింది.

జ్వెరెవ్ జోరు
‘బిగ్ త్రీ' నడాల్, జకోవిచ్, ఫెదరర్ నీడలో ఇన్నాళ్లూ గ్రాండ్స్లామ్ టైటిల్ వేటలో వెనుకబడిపోయిన జర్మనీ యువతార అలెగ్జాండర్ జ్వెరెవ్ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా మరో అడుగు వేశాడు. యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో 23 ఏళ్ల జ్వెరెవ్ తొలిసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. 27వ సీడ్ బొర్నా చోరిచ్ (క్రొయేషియా)తో జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో జ్వెరెవ్ 1-6, 7-6 (7/5), 7-6 (7/1), 6-3తో గెలుపొందాడు. 1995లో బోరిస్ బెకర్ తర్వాత యూఎస్ ఓపెన్లో సెమీఫైనల్ చేరిన తొలి జర్మనీ ప్లేయర్గా జ్వెరెవ్ నిలిచాడు.

బుస్టా పోరాటం...
ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్వన్ జకోవిచ్ (సెర్బియా) తప్పిం కారణంగా పూర్తిస్థాయి మ్యాచ్ ఆడకుండానే కరెనో బుస్టా క్వార్టర్ ఫైనల్ బెర్త్ దక్కించుకున్నాడు.
ఈ గేమ్లో తొలి సెట్లో 6-5తో ఆధిక్యంలో ఉన్న దశలో జొకోవిచ్ కోపంలో బంతిని వెనక్కి కొట్టడం... అదికాస్తా లైన్ జడ్జికి తగలడంతో... నిర్వాహకులు జకోవిచ్పై అనర్హత వేటు వేయడం తెలిసిందే. అయితే క్వార్టర్ ఫైనల్లో కరెనో బుస్టాకు 12వ సీడ్ డెనిస్ షపోవలోవ్ (కెనడా) నుంచి గట్టిపోటీ ఎదురైంది. 4 గంటల 8 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో కరెనో బుస్టా 3-6, 7-6 (7/5), 7-6 (7/0), 0-6, 6-3తో గెలుపొంది సెమీఫైనల్లోకి ప్రవేశించాడు.
ధోనీతో పోల్చుకోవడమే రిషభ్ పంత్ కొంప ముంచింది: ఎమ్మెస్కే ప్రసాద్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications