హైదరాబాద్: భారత స్టార్ రెజ్లర్ భజరంగ్ పూనియాను క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన రాజీవ్ ఖేల్ రత్న అవార్డు వరించనుంది. గతేడాది జరిగిన ఆసియా, కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణ పతకాలు గెలిచిన భజరంగ్ పూనియాను ఈ అవార్డుకు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సిఫారసు చేసిన సంగతి తెలిసిందే.
ఈ ఏడాది జాతీయ పురస్కారాల కోసం మొత్తం 12 మంది సభ్యులతో ఓ ప్యానెల్ కేంద్ర క్రీడాశాఖ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్యానెల్లో ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ బాక్సర్ మేరీ కోమ్, భారత మాజీ ఫుట్బాల్ కెప్టెన్ భైచుంగ్ భూటియా లాంటి క్రీడాకారులున్నారు. ఈ ప్యానెల్ రెండు రోజుల చర్చల అనంతరం భజరంగ్ పూనియాకు ఖేల్ రత్న అవార్డు ఇవ్వాలని నిర్ణయించింది.
గుండెపోటు కాదు.. ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న మాజీ క్రికెటర్
భజరంగ్ పూనియాకు ఖేల్ రత్న ఇవ్వనున్నామని, ఏకపక్షంగా ఆ అవార్డుకు అతని పేరును ఎంపిక చేసినట్లు ఓ అధికారి వెల్లడించారు. గతేడాది జకార్తా వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో 65 కేజీల విభాగం ఫ్రీస్టయిల్ ఈవెంట్లో భజరంగ్ పూనియా స్వర్ణ పతకం సాధించిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికగా జరిగిన కామన్వెల్త్ క్రీడల్లోనూ పూనియా స్వర్ణ పతకం సాధించాడు. రెండు ప్రపంచ పోటీల్లో పూనియా స్వర్ణ పతకం సాధించడంతో రాజీవ్ ఖేల్ రత్నకు అర్హుడని క్రీడాకారులు అంటున్నారు. వచ్చే ఏడాది టోక్యోలో జరిగే ఒలింపిక్స్లోనూ భజరంగ్ పూనియా ముందంజలో ఉన్నాడు.
ప్రస్తుతం జార్జియాలో రెజ్లింగ్ మెళకువలు నేర్చుకుంటున్న భజరంగ్ పూనియా దీనిపై మాట్లాడుతూ ఖేల్ రత్న అవార్డు స్వీకరించేందుకు తాను అర్హుడినని అన్నాడు, కాగా, గతేడాది రాజీవ్ ఖేల్ రత్న అవార్డుని కేంద్ర ప్రభుత్వం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వెయిట్ లిఫ్టర్ మీరాభాయి ఛానులకు ప్రకటించిన సంగతి తెలిసిందే.
కాగా, రాజీవ్ ఖేల్ రత్న అవార్డుని అందుకున్న మొట్టమొదటి క్రీడాకారుడిగా చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ నిలిచాడు. 1991-92 సంవత్సరంలో ఆయన అత్యుత్తమ ప్రదర్శనకు గాను కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డుతో సత్కరించింది. ప్రతి ఏటా భారత హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజైన ఆగస్టు 29న జాతీయ క్రీడా పురస్కారాలను ప్రధానం చేస్తోన్న సంగతి తెలిసిందే.
మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజుని జాతీయ క్రీడా దినోత్సవంగా కూడా జరుపుకునే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర క్రీడా శాఖ జాతీయ పురస్కారాలపై 12 మంది సభ్యులతో కూడిన ఓ సెలక్షన్ కమిటీని ఎంపిక చేసింది. ఈ కమిటీకి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ (రిటైర్డ్) ముకుందం శర్మ అధ్యక్షత వహిస్తారు.
రేసులో రవిశాస్త్రి ముందంజ: హెడ్ కోచ్ సెలక్షన్ ప్రాసెస్ తెలుసుకోండి!
ఈ కమిటీలో క్రీడా శాఖ సెక్రటరీ రాథే శ్యామ్ జులానియాతో పాటు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ సందీప్ ప్రధాన్, టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్) సీఈఓ కమాండర్ రాజేష్ రాజగోపాలన్, మాజీ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ అంజుమ్ చోప్రా, మాజీ లాంగ్ జంపర్ అంజు బాబీ జార్జ్, టేబుల్ టెన్నిస్ కోచ్ కమలేష్ మెహతాలు ఉన్నారు.
వీరితో పాటు ఇద్దరు మీడియా వ్యక్తులు టైమ్స్ గ్రూప్ (డిజిటల్) చీఫ్ ఎడిటర్ రాజేష్ కల్రా, ప్రఖ్యాత స్పోర్ట్స్ వ్యాఖ్యాత చారు శర్మలకు కేంద్ర క్రీడాశాఖ చోటు కల్పించింది. ఈ కమిటీ గత ఎడిషన్ల మాదిరి కాకుండా జాతీయ క్రీడా పురస్కారాల విజేతలు - రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, అర్జున అవార్డు, ద్రోణాచార్య అవార్డు (కోచ్ల కోసం), ధ్యాన్ చంద్ అవార్డు (జీవితకాల సాధన), జాతీయ ఖేల్ ప్రోత్సాహాన్ అవార్డులను అందజేస్తుంది.