క్రీడాకారులకు గుడ్ న్యూస్: రూ.29,054 కోట్లతో 'ఖేలో ఇండియా'కు కొత్త ఊపు!
పునరుద్ధరించిన ఖేలో ఇండియా పథకం భారత క్రీడారంగం రూపురేఖలను మార్చే సామర్థ్యం కలిగి ఉందని రెండుసార్లు ఒలింపిక్స్లో పాల్గొన్న (2012 లండన్, 2016 రియో) క్రీడాకారిణి, ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పతక విజేత జ్వాలా గుత్తా ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఈ పథకం క్రీడారంగంలో పెనుమార్పు తీసుకొచ్చే గేమ్ చేంజర్గా నిలుస్తుందని, చాలా కాలం క్రితమే ఈ పథకం రావాల్సిందని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వం అండగా నిలవడం వల్లే తాను ఈ స్థాయిలో నిలబడగలిగానని.. కొత్త ప్రణాళికతో తల్లిదండ్రులు తమ పిల్లలను ధైర్యంగా క్రీడల వైపు ప్రోత్సహిస్తారని వెల్లడించారు. జ్వాలా గుత్తాతో పాటు తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (ఎస్ఏటీఎస్) వైస్ ఛైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఏ. సోనిబాలా దేవి, బెంగళూరులోని భారత క్రీడా ప్రాధికార సంస్థ (ఎస్ఏఐ) ప్రాంతీయ డైరెక్టర్ విష్ణు సుధాకరన్, ఢిల్లీలోని ఎస్ఏఐ డిప్యూటీ డైరెక్టర్ ఎస్. హిమబిందు కూడా మీడియా సమావేశంలో పాల్గొన్నారు
చరిత్ర సృష్టించిన గాయత్రి-ట్రీసా జోడీ.. 15 ఏళ్ల తర్వాత భారత్కు పతకం!
బడ్జెట్ 8 రెట్లు పెంపు
ఈ సమావేశంలో ఎస్ఏఐ డిప్యూటీ డైరెక్టర్ ఎస్. హిమబిందు మాట్లాడుతూ, ఖేలో ఇండియా పథకంలోని కీలక అంశాలను, తెలంగాణ వంటి రాష్ట్రంపై ఈ పథకం చూపించే ప్రభావాన్ని వివరించారు. 2026-31 కాలానికి అమలయ్యే ఈ పథకానికి గత కేటాయింపుతో పోలిస్తే 8 రెట్లు పెంచి రూ.29,054 కోట్లను కేటాయించారు. ఈ పథకం ద్వారా మద్దతు పొందే క్రీడాకారుల సంఖ్యను 10 రెట్లు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పథకం కింద క్రీడల్లో అట్టడుగు స్థాయి నుంచి ఒలింపిక్ స్థాయి ప్రతిభకు చేరుకునేలా సమగ్ర ప్రణాళిక రూపొందించారు. వ్యవస్థలోని లోటుపాట్లను ఈ పథకం పరిష్కరిస్తుంది. కోచ్లతో బోర్డును ఏర్పాటు ద్వారా చిన్నారుల క్రీడా ప్రతిభను మరింత మెరుగుపరచేందుకు అవకాశం ఉంటుంది. అకాడమీల వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, మౌలిక సదుపాయాలు, క్రీడా సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు తగినన్ని నిధులు అందుబాటులో ఉన్నాయి.

తెలంగాణలో క్రీడాభివృద్ధికి ప్రత్యేక ప్రోత్సాహం
తెలంగాణలో క్రీడల అభివృద్ధికి కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ఇప్పటికే అధిక ప్రాధాన్యత ఇస్తోంది. రాష్ట్రంలో మొత్తం 33 ఖేలో ఇండియా కేంద్రాలను మంజూరు చేశారు. వీటిలో మాజీ ఛాంపియన్ క్రీడాకారులు 601 మందికి పైగా క్రీడాకారులకు శిక్షణ అందిస్తున్నారు. మేడ్చల్ - మల్కాజ్గిరిలో ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇందులో రోయింగ్, వెయిట్లిఫ్టింగ్, ఫెన్సింగ్ తదితర క్రీడాంశాల్లో మొత్తం 254 మంది క్రీడాకారులకు శిక్షణ, ప్రోత్సాహం అందుతోంది. వీరిలో 152 మంది పురుషులు, 102 మంది మహిళా క్రీడాకారులు ఉన్నారు.రాష్ట్రంలో అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, షూటింగ్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, సైక్లింగ్, టెన్నిస్, ఫుట్బాల్ తదితర క్రీడాంశాల్లో మొత్తం 19 ఖేలో ఇండియా గుర్తింపు పొందిన అకాడమీలను ఏర్పాటు చేసేందుకు నోటిఫై చేశారు. మహిళల కోసం క్రీడల (స్పోర్ట్స్ ఫర్ ఉమెన్) విభాగం కింద తెలంగాణలో 127 అస్మిత లీగ్లు నిర్వహించగా, వీటిలో 20,921 మంది మహిళా క్రీడాకారులు పాల్గొన్నారు.
క్రీడారంగాన్ని మార్చే ఈ పథకం ఎప్పుడో రావాల్సింది: జ్వాలా గుత్తా
ప్రముఖ క్రీడాకారిణి గుత్తా జ్వాల మాట్లాడుతూ.. తాను ప్రభుత్వ అండతోనే ఎదిగానన్నారు. ప్రభుత్వ మద్దతు లేకుండా ఓ క్రీడాకారిణిగా తాను సాధించినదంతా సాధ్యమయ్యేది కాదన్నారు. కొత్త రూపంలోని ఈ ఖేలో ఇండియా పథకం చాలా ఆశాజనకంగా కనిపిస్తోంది. క్షేత్ర స్థాయి నుంచి అభివృద్ధి, సుస్థిరతపై దృష్టి సారించడంతో, పిల్లలను క్రీడలకు పంపడాన్ని తల్లిదండ్రులు చాలా సురక్షితంగా భావిస్తారు. క్రీడలను ప్రోత్సహించడంపై ప్రభుత్వం ఎల్లప్పుడూ శ్రద్ధ వహిస్తూనే ఉంది. ఇది ఈ రంగంపై గణనీయ ప్రభావం చూపుతుంది. దీని ప్రభావం కూడా అపారంగా ఉంటుంది. ఈ పథకంతో అనుబంధం ఉన్నందుకు నేను సంతోషంగా ఉన్నాను" అని గుత్తా జ్వాల అన్నారు.
కేంద్ర-రాష్ట్రాల భాగస్వామ్యం
ఈ నూతన విధానం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకారాన్ని మరింత బలపరుస్తుంది. ఈ విజన్ భాగంలోనే ఈ ఏడాది చివరలో తెలంగాణ రాష్ట్రం 'ఖేలో ఇండియా యూత్ గేమ్స్'ను ఘనంగా నిర్వహించనుంది. స్కూల్ క్రీడలను విద్యావిధానంతో అనుసంధానించడం, కోచింగ్ అకాడమీలకు సాంకేతికతను జోడించడం ద్వారా భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన పతకాలు సాధించే అవకాశం ఉందని స్పోర్ట్స్ అథారిటీ అధికారులు విశ్వాసం వ్యక్తం చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
