వారిపై విచారణ జరపండి..
ఈ వ్యవహారంపై స్పందించిన కేంద్ర మంత్రి.. పాకిస్థాన్కు వెళ్లిన కబడ్డీ జట్టు భారత అధికారిక జట్టు కాదని స్పష్టం చేశారు. అక్కడికి ఎవరు వెళ్లారో తమకు తెలియదని, ఎవరు పడితే వాళ్లు.. ఎక్కడపడితే అక్కడ భారత్ పేరుతో ఆడటం సరికాదన్నారు. అనుమతి లేకుండా పాకిస్థాన్కు వెళ్లి భారత జట్టు పేరుతో ఆడిన వారు ఎవరో కనిపెట్టి విచారణ జరపాలని కబడ్డీ ఫెడరేషన్ను కోరుతామని మంత్రి తెలిపారు. ఎవరైనా ఏ టోర్నమెంట్లో అయినా పాల్గొనాలంటే.. ముందు సంబంధిత అధికారుల అనుమతి పొందాలని సూచించారు.
భారత బోల్ట్ శ్రీనివాస గౌడను మించిన మరో కంబాల రన్నర్.!!
టోర్నీ కూడా అనధికారమే..
మరోవైపు పాకిస్థాన్లో నిర్వహించిన ప్రపంచ కబడ్డీ చాంపియన్షిప్ అనధికార టోర్నీ అని, అందులో పాల్గొన్న వారికి ఇచ్చిన సర్టిఫికేట్ ఎక్కడా చెల్లుబాటు కాదని ప్రపంచ కబడ్డీ ఫెడరేషన్ స్పష్టం చేసింది. ఆసియా దేశాలు నిర్వహించే కబడ్డీ టోర్నమెంట్ను అధికారికంగా గుర్తించమని గతంలోనే ప్రపంచ కబడ్డీ సమాఖ్య ప్రకటించింది.
మాకు అనుమతులు అవసరం లేదు..
ఇక ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేపగా.. పాకిస్థాన్ నుంచి భారత్కు వచ్చిన జట్టుకు బాధ్యత వహించిన దావిందర్ సింగ్ మాత్రం తమకెవరి అనుమతులు అవసరం లేదన్నాడు. తామంతా వ్యక్తిగతంగానే పాకిస్థాన్కు వెళ్లామని, అందులో తప్పులేదని చెప్పుకొచ్చాడు.
పంజాబ్ జట్టే..
మనదేశంలోని పంజాబ్లో ఈ సర్కిల్ కబడ్డి ఎక్కువగా ఆడతారు. ఆ జట్టే భారత ప్రభుత్వం అనుమతి లేకుండా పాకిస్తాన్కు వెళ్లి టోర్నీలో భాగస్వామ్యమైనట్లు ప్రచారం జరుగుతోంది. పాక్లో జరిగిన ఈ సర్కిల్ కబడ్డి వరల్డ్కప్లో పాల్గొనడానికి తాము ఎటువంటి జట్టును పంపలేదని, ఎవరైనా వచ్చినా వారు భారత్ పేరు వాడటానికి అనుమతి లేదని అమెచ్యూర్ కబడ్డి ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఏకేఎఫ్ఐ).. పాక్ కబడ్డీ బోర్డుకు అంతకుముందే ఓ లేఖలో స్పష్టం చేసింది. అలాగే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) కూడా పాక్లో జరుగుతున్న ఈ టోర్నీకి ఎటువంటి జట్టునూ పంపడంలేదని గత సోమవారమే ప్రకటించింది.
ఇమ్రాన్ అభినందనలు..
ఈ సర్కిల్ కబడ్డీ ప్రపంచకప్ అందుకున్న పాక్ ఆటగాళ్లను ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అభినందించారు. ఫైనల్లో భారత్ను ఓడించి కబడ్డీ ప్రపంచకప్ గెలిచిన పాకిస్థాన్ కబడ్డీ జట్టుకు అభినందనలని ట్వీట్ చేశాడు.