బెంగళూరు: కంబాల రన్నర్ శ్రీనివాస గౌడ.. గత నాలుగు రోజులుగా దేశవ్యాప్తంగా మారు మోగుతున్న పేరు. భారత్ ఉసెన్ బోల్ట్ అంటూ సోషల్ మీడియా కీర్తించిన ఓ మాములు భవన నిర్మాణ కార్మికుడు. కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజుతోనే స్వయంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) ట్రయల్స్కు హాజరు కావాలని పిలుపించుకున్న ఘనుడు. అలాంటి శ్రీనివాస గౌడను తలదిన్నే మరో కంబాల్ రన్నర్ వెలుగులోకి వచ్చాడు.
జమైకా పరుగుల చిరుత ఉసెన్ బోల్ట్ ఆల్టైమ్ 100 మీటర్ల పరుగు రికార్డు 9.58 సెకన్లను బ్రేక్ చేశాడనే కదా ఈ శ్రీనివాసుడిని యావత్ భారతం కీర్తిస్తుంది. కంబాల పోటీలో అతను తన దున్నలతో 142.4 మీటర్ల దూరాన్ని 13.42 సెకన్లలో పూర్తి చేశాడని, ఈ లెక్కన 100 మీటర్ల దూరాన్ని శ్రీనివాస్ 9.55 సెకన్లలో పరుగెత్తాడనే కదా భారత్ బోల్ట్ అంటూ ప్రశంసిస్తుంది.
ఈ అద్భుత రికార్డుతోనే కదా సాయ్కు తీసుకెళ్లి ఒలింపిక్స్కు రెడీ చేయాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేసింది. ఆ సాయ్ ఆహ్వానాన్ని అతను తిరస్కరించాడనుకోండి. కానీ ఇప్పుడు ఈ భారత్ బోల్ట్ రికార్డును తిరగరాసాడు మరో బోల్ట్. అతను పేరు నిషాంత్ శెట్టి. అవును ఆదివారం జరిగిన ఓ కంబాల పోటీల్లో అతను తన జోడెద్దులతో 143 మీటర్లను 13.68 సెకన్లలోనే పూర్తి చేశాడు. ఈ లెక్కన 100 మీటర్లను 9.51 సెకన్లలోనే పూర్తి చేసినట్టు. అంటే శ్రీనివాస్ గౌడ కన్న ఇది 0.04 సెకన్లు తక్కువ. పరుగుల చిరుత ఉసెన్ బోల్ట్ కన్నా 0.07 సెకన్లు తక్కువ. కర్ణాటకలోని బజ్గోలి జోగిబెట్టుకు చెందిన నిషాంత్ షెట్టి.. వెనూర్ వేదికగా జరిగిన సూర్య-చంద్ర జోడుకరే కంబాల పోటీల్లో ఈ నయా రికార్డు సృష్టించాడు.
కంబాల అనేది దక్షిణ కన్నడ, ఉడుపి, తుళునాడు తీర ప్రాంతంలో ప్రతి ఏడాది నిర్వహించే ఒక సాంప్రదాయ క్రీడ. కంబాల ఆటలో ఎద్దుల పోటీదారుడు (బఫెలో జాకీ) బురద నీటిలో పరుగెడ్తాడు. ఎవరైతే ఎద్దులను వేగంగా పరుగెత్తించి లక్ష్యాన్ని చేరుకుంటారో వారే విజేతగా నిలుస్తారు. కర్ణాటకలో వ్యవసాయం చేసే గౌడ సామాజిక వర్గం వారు ఈ పోటీల్లో పాల్గొంటారు. ఈ క్రీడా ఎప్పటినుంచో ఉంది.