ఆ అరుపులు.. సంబరాల్లేవ్..
వేలాదిమంది ఫ్యాన్స్తో కిక్కిరిసే స్టేడియం. రకరకాల వాయిద్యాలతో హోరు. అభిమానుల అరుపులతో దద్దరిల్లే పరిసరాలు. వాటికి తోడుగా రెఫరీ విజిల్ చప్పుళ్లు. బంతికోసం ఆటగాళ్లు చేసే విన్యాసాలు. గోల్ కొట్టగానే ఒకరిపై ఒకరు పడుతూ చేసుకొనే సంబరాలు. సాకర్ మ్యాచ్ల్లో ఉండే మజాయే వేరు. కానీ ఇదంతా గతం.
శనివారంనాటి మ్యాచ్ ఫుట్బాల్ చరిత్రలోనే కొత్త అంకానికి నాంది పలికింది. సాధారణంగా అయితే బుండెస్లిగా పోరుకు 80 వేలమంది హాజరవుతారు. అయితే అందుకు పూర్తి భిన్నంగా ఖాళీ స్టేడియం.. నిశ్శబ్ద వాతావరణం.. ఆటగాళ్ల అరుపులు, రెఫరీల విజిల్ కూతలు తప్ప మరేమీ వినిపించకుండా తాజా మ్యాచ్ సాగింది.
నిబంధనలు పాటిస్తూ..
వైరస్ వ్యాప్తికి తావు లేకుండా నిర్వాహకులు పూర్తి జాగ్రత్త చర్యలు తీరసుకున్నారు. భౌతిక దూరం పాటిస్తూ మామూలుగా ఒక్క బస్సులోనే వచ్చే ఆటగాళ్లు వివిధ బస్సుల్లో స్టేడియానికి చేరుకున్నారు. గోల్ చేసిన అనంతరం ఒకరికొకరు హత్తుకోవడాన్ని నిషేధించారు. సబ్స్టిట్యూట్లు, కోచ్లు మాస్క్ ధరించడం తప్పనిసరి చేశారు. మ్యాచ్లకు ముందు ప్రతి జట్టుకు వారం రోజుల క్వారంటైన్ తప్పనిసరి చేశారు.
రూ. 2458 కోట్లే లక్ష్యం..
లీగ్ మొత్తాన్ని జూన్ 30నాటికి పూర్తి చేయాలని నిర్వాహకులు భావిస్తున్నారు. తద్వారా రూ. 2458 కోట్ల టెలివిజన్ ప్రసార హక్కుల సొమ్మును రాబట్టాలని యోచిస్తున్నారు. లీగ్ ఆగిపోవడంవల్ల పలు క్లబ్బులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. ప్రసార హక్కుల డబ్బు అందితే క్లబ్బులు ఆర్థిక ఇక్కట్లనుంచి బయటపడే అవకాశముంది.