అయ్యా రవిశాస్త్రి.. మేం కూడా ఆ ప్రపంచకప్ గెలిచిన జట్టులో ఉన్నాం: యువరాజ్

హైదరాబాద్: అప్పుడెప్పుడో 1983లో కపిల్ దేవ్ నేతృత్వంలో ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు.. మళ్లీ 28 ఏళ్ల తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో విశ్వవిజేతగా నిలిచింది. ఈ అద్భుత క్షణం గడిచి గురువారం(ఏప్రిల్ 2) నాటికి తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. దీంతో యావత్ భారత్ ఆ మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ నాటి జట్టును కొనియాడింది. అటు మాజీ క్రికెటర్లు సైతం నాటి ఆటగాళ్లపై ప్రశంసల జల్లు కురిపించారు.
శ్రీలంకతో జరిగిన నాటి ఫైనల్ మ్యాచ్లో ధోనీ విన్నింగ్ షాట్తో మ్యాచ్ ముగించి 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు. దీంతో ప్రతీ ఒక్కరూ ఈ సిక్సర్ గురించే మాట్లాడుతూ ఈ కూల్ కెప్టెన్ను ప్రశంసించారు.
ధోనీ సిక్సర్ ఒక్కటే కాదు..
ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ క్రిక్ఇన్ఫో.. ధోనీ నాటి విన్నింగ్ షాట్ను గుర్తు చేస్తూ ట్వీట్ చేసింది. నాటి ధోనీ విన్నింగ్ షాట్ ఫోటోకు ‘సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం ఇదే రోజు ఈ షాట్తో భారత అభిమానుల కోట్లాది హృదయాలు సంతోషంతో ఉప్పొంగాయి' అని క్యాప్షన్గా పేర్కొంది. అయితే ఈ ట్వీట్ చూసిన మాజీ క్రికెటర్, ఆ నాటి ప్లేయర్ గౌతం గంభీర్కు చిర్రెత్తుకొచ్చింది.
వెంటనే ‘క్రిక్ఇన్ఫో .. 2011 వన్డే వరల్డ్కప్ భారత్ అంతా కలిసి సాధించింది. ముఖ్యంగా భారత జట్టు, సహాయక సిబ్బంది వల్లనే ఇది సాధ్యమైంది. ధోనీ సిక్సర్ ఒక్కటే విజయాన్నందించలేదు. సమష్టి ఆటతీరువల్లే ఈ విజయం దక్కింది'అని గుర్తు చేస్తూ ఘాటుగానే బదులిచ్చాడు.
రవిశాస్త్రి ట్వీట్.. యూవీ ఫైర్
ఈ అద్భుత క్షణాన్ని గుర్తు చేస్తూ టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి కూడా ఓ ట్వీట్ చేశాడు. ధోని సిక్సర్ కొట్టిన వీడియోను జత చేస్తూ.. అందులో విరాట్ కోహ్లి, సచిన్ టెండూల్కర్ల పేర్లు మాత్రమే ట్యాగ్ చేశాడు. ‘ఆటగాళ్లకు శుభాకాంక్షలు.. మా 1983 బృందంలాగే.. జీవితమంతా ఈ క్షణాలను తలుచుకొని మీరు సంతోషిస్తారు' అని రవిశాస్త్రి క్యాప్షన్గా పేర్కొన్నాడు.
దీన్ని చూసిన యువరాజ్కు ఎక్కడో కాలినట్లు అయింది. అయితే చిలిపి ఎమోజీలు పెట్టి తన మనసులోని మాటను ఈ సిక్సర్ల సింగ్ బయటపెట్టాడు. తనను ధోనిని ట్యాగ్ చేయకపోవడాన్ని లాఫింగ్ ఎమోజీలతో ప్రశ్నించాడు. ‘సీనియర్కు కృతజ్ఞతలు! మీరు నన్ను, మహీని కూడా ట్యాగ్ చేయవచ్చు. విజయంలో మా భాగస్వామ్యం కూడా ఉంది' అని ట్వీట్ చేశాడు.

యూవీ.. నీకన్నా లెజెండ్ ఉన్నారా?
యూవీ ట్వీట్తో తన తప్పును తెలుసుకున్న్ రవిశాస్త్రి చాలా తెలివిగా సమాధానమిచ్చాడు. ‘ప్రపంచకప్ టోర్నీల విషయానికొస్తే నువ్వు అసలు జూనియరే కాదు.. నీ కన్నా లెజెండ్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారా' అని యువరాజ్కు బదులిచ్చాడు. 2011 వన్డే వరల్డ్కప్లో అటు బ్యాటింగ్..ఇటు బౌలింగ్తో మెరిసిన యువరాజ్.. మ్యాన్ ఆఫ్ ద సిరీస్గా నిలిచిన విషయం తెలిసిందే. ఆ టోర్నీలో ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన యువీ.. భారత్ కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
ధోనీ ఒక్కడితోనే ప్రపంచకప్ రాలేదు : గంభీర్

గంభీర్ సూపర్ ఇన్నింగ్స్..
నాటి ఫైనల్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. కెప్టెన్ మహేల జయవర్దనె (103 నాటౌట్: 88 బంతుల్లో 13x4) అజేయ సెంచరీతో చెలరేగాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత్ వీరేంద్ర సెహ్వాగ్ (0), సచిన్ టెండూల్కర్ (18) వికెట్లను ప్రారంభంలోనే కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో గౌతమ్ గంభీర్ ( 122 బంతుల్లో 9 ఫోర్లు 97), నాటి యువ ప్లేయర్ విరాట్ కోహ్లీ (35)తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు.
కోహ్లీ ఔటైనా.. ధోనీతో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. నాలుగో వికెట్కి 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే సెంచరీ చేరువైన క్రమంలో తీవ్ర ఒత్తిడికి లోనైన గంభీర్ క్లీన్ బౌల్డ్గా వెనుదిరిగాడు. ఇక గంభీర్ ఔటైనా.. యువరాజ్తో కలిసి ధోనీ ( 79 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 91 నాటౌట్) 48.2 ఓవర్లలోనే 277/4తో మ్యాచ్ను ముగించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications